ఖమ్మం, జూలై
(పున్నమి ప్రతినిధి )
సింగరేణి సర్కిల్ పరిధిలోని కామేపల్లి మండలంలో తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.85.70 లక్షలు మోసం చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
సింగరేణి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సాగర్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితులు ప్రజలకు తక్కువ ధరలో బంగారం అందిస్తామని నమ్మించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి పరారైనట్లు గుర్తించారు.
విచారణలో ప్రధాన నిందితుడు గురప్ప కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంచరిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరలో భూములు, బంగారం ఇప్పిస్తానని చెప్పి అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేసినట్లు వెల్లడైంది. గతంలో ఇదే తరహా కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరలో బంగారం, భూములు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆఫర్లు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


