అనకాపల్లి, సెప్టెంబర్ 18:పున్నమి ప్రతినిధి ఆనంద్ :
అనకాపల్లి జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం దొడ్డి రాము నాయుడు భవన్లో జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు కర్రి అప్పారావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో సాధారణం కంటే సుమారు 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, ఖరీఫ్లో వేయాల్సిన వరి పంటలో కేవలం 15 శాతం మాత్రమే నాట్లు పడ్డాయని తెలిపారు. బోర్లు ఉన్న ప్రాంతాల్లో వేసిన పంటలు సైతం ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు రుణమాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, పశువుల తాగునీటి కోసం అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేయించాలని కోరారు. ముఖ్యమంత్రి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన నేపథ్యంలో మెయిన్ కాలువకే పరిమితం కాకుండా పిల్ల కాలువల ద్వారా రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, కోశాధికారి గండి నాయనబాబు, ఎస్.వి.నాయుడు, ఎస్.బ్రహ్మాజీ, సీహెచ్.మాధవస్వామి, సాంబశివరావు, కె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.


