✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన-2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. గురువారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. నమోదు అనంతరం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియ విజయవంతంగా పూర్తయినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన వసతులు, సేవలు అందించేందుకు జనగణన ముఖ్య దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల ఖచ్చితమైన సంఖ్య తెలిసినప్పుడే ప్రభుత్వం సమర్థవంతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించగలదని వివరించారు.
ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
“నేను జనగణనలో పాల్గొని నా వివరాలు నమోదు చేసుకున్నాను… మీరు కూడా ముందుకు వచ్చి పాల్గొనండి” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలు నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రణాళికలు సిద్ధం కావడానికి సహకరించాలని ఆయన ఆకాంక్షించారు.
END



