ఏలూరు, జూన్ 04:
ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గురువారం ఏలూరు కొత్త బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
తనిఖీల్లో భాగంగా బస్టాండ్ ప్రాంగణమంతా కలియతిరిగిన చైర్మన్, ఇటీవల నూతనంగా వేసిన సీసీ రోడ్లను పర్యవేక్షించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్ల నిర్వహణను, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆర్.ఓ (RO) వాటర్ ప్లాంట్, నాన్-స్టాప్ టికెట్ కౌంటర్, విచారణ కేంద్రం, మరియు బి.ఓ.టి (BOT) ప్రదేశాలను నిశితంగా తనిఖీ చేశారు.
త్వరలోనే ఆర్టీసీ పరిధిలోకి రాబోతున్న ఎలక్ట్రికల్ బస్సుల కోసం ఛార్జింగ్ పాయింట్లను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.
ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బస్టాండ్లో ఉన్న ప్రయాణికులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లకు రెడ్డి అప్పలనాయుడు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) శ్రీమతి ఎస్.కె. షబ్నం, డిపో మేనేజర్ శ్రీమతి బి. వాణి, ఏ.ఎం.టి శ్రీ అప్పాజీ, మెకానికల్ ఫోర్మెన్ శ్రీ శ్రీనివాస్, పిఆర్ఓ కె.ఎల్.వి. నరసింహం పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Uploaded Video:


