*స్వరం ఆగింది… కానీ కాలం ఆపలేని ప్రతిధ్వనిగా జానకి నిలిచిపోయారు*
కొంతమంది కళాకారులు వేదికలను అలంకరిస్తారు.
మరికొందరు అవార్డులను గెలుస్తారు.
కానీ ఎస్. జానకి మాత్రం తరాల హృదయాలను గెలిచిన అరుదైన గానతపస్వి.
ఆమె పాడిన పాటలు కేవలం రికార్డుల్లో బంధించబడిన స్వరాలు కావు. అవి లక్షలాది కుటుంబాల జ్ఞాపకాలు. ప్రతి ఇంటి ఆనందంలో, ప్రతి తల్లి జోలపాటలో, ప్రతి ప్రేమకథలో, ప్రతి భక్తి గీతంలో, ప్రతి కన్నీటి చుక్కలో ఎక్కడో ఒకచోట జానకి గాత్రం సజీవంగా వినిపిస్తుంది.
సంగీతం భాషలను దాటుతుందని ప్రపంచానికి నిరూపించిన స్వరం జానకిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… ఏ భాషలో పాడినా ఆమె గొంతు భావానికి మాత్రమే భాషగా మారింది. అందుకే ఆమెను అభిమానించినవారు రాష్ట్రాలవారు కాదు… తరాలవారు.
నెల్లూరుకు ఆమెతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సింహపురి కోడలిగా ఈ నేల ఆమెను గర్వంగా హృదయంలో దాచుకుంది. 2018లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలో ఇద్దరూ పంచుకున్న ఆప్యాయ క్షణాలు, “స్టేజ్ మీద నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడతావు బాలు” అంటూ నవ్వులు పూయించిన ఆ సరదా మాటలు నేడు కన్నీటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
*ఒక గాయకుడి గొంతు కాలంతో మారుతుంది… కానీ ఒక మహాగాయని స్వరం కాలాన్నే మార్చేస్తుంది. ఎస్. జానకి అదే చేశారు. ఆమె పాటలు వినిపించేంత వరకు ఆమె లేని లోటు మనకు అనిపించినా… ఆమె లేరనే నిజం మనసు ఒప్పుకోదు.*
*ఈ రోజు సంగీత ప్రపంచం ఒక గొప్ప స్వరాన్ని కోల్పోయింది. కానీ చరిత్ర మాత్రం ఒక అమర గానకోకిలను శాశ్వతంగా సొంతం చేసుకుంది.*
*జానకి …*
మీరు వెళ్లింది ఈ లోకం నుంచి మాత్రమే
మా జ్ఞాపకాల నుంచి కాదు…
మా హృదయాల నుంచి కాదు…


