విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు వెంకటరమణపై కత్తితో దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. లంకెలపాలెం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దుండగుల దాడికి గురై గాయపడిన హోంగార్డు వెంకటరమణ ప్రస్తుతం షీలా నగర్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లిన హోం మంత్రి అనిత, వెంకటరమణను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు వెంకటరమణపై కత్తితో దాడి చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినప్పటికీ, పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వెంకటరమణ చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ఘటనకు పాల్పడిన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, అవసరమైన పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
పోలీసులు ప్రజల భద్రత కోసం అనునిత్యం కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని, వారి విధుల నిర్వహణకు ప్రజలు కూడా సహకరించాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.



