కురుమిద్ద గ్రామ సభ బహిష్కరణ
రైతుల భూముల్లో అనుమతి లేకుండా పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం
పున్నమి న్యూస్
04 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా కురుమిద్ద గ్రామంలో నిర్వహించిన గ్రామ సభను గ్రామ రైతులు, పశుపాలకులు బహిష్కరించారు. గ్రామంలో “ఫార్మా పనులు” పేరుతో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు మరియు సంబంధిత సంస్థలు పొలాల్లోకి ప్రవేశించి కరెంట్ సరఫరాను నిలిపివేయడం, పూర్తి నష్టపరిహారం చెల్లించకుండా భూములను జేసీబీలు, డోజర్లతో చదును చేయడం వంటి చర్యలకు నిరసనగా గ్రామ సభను బహిష్కరించినట్లు గ్రామస్థులు తెలిపారు.
రైతుల పొలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సాగు పనులు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భారీ యంత్రాలతో భూములను చదును చేయడం వల్ల పశువులు, గొర్రెలు మేత మేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామ పరిసరాల్లో ఉన్న చెరువులు, నీటి వనరులు దెబ్బతింటుండడంతో పశువులకు తాగునీటి సమస్య కూడా ఏర్పడుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన గ్రామస్థులు, రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని గ్రామ ప్రజలు హెచ్చరించారు.



