పైప్లైన్ ధ్వంసం చేసిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు.. రూ.20 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఆత్మకూరు , జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు పట్టణ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ అడ్డుకోలేరని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.గురువారం ఆత్మకూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆత్మకూరు పట్టణానికి సోమశిల నుంచి తాగునీటిని అందించే ప్రధాన పైప్లైన్ను కొందరు దురుద్దేశపూర్వకంగా బోర్వెల్ యంత్రంతో ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటన కారణంగా పట్టణంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు.సమాచారం అందిన వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 26 ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. పైప్లైన్ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.89 లక్షలు ఖర్చు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఆత్మకూరు పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.20 కోట్లతో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.75 నుంచి రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రహదారులు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆత్మకూరు అభివృద్ధి ఆగదని, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


