“పెద్ది” సినిమా చూసేందుకు వస్తుండగా ప్రమాదం
ఆత్మకూరు, జూన్ 5 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు బోల్తాపడి ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రానికి చెందిన రెండు కుటుంబాలు ఆత్మకూరులోని రామకృష్ణ థియేటర్లో ప్రదర్శితమవుతున్న నటుడు రామ్న చరణ్ నటించిన “పెద్ది” సినిమా చూసేందుకు కారులో ఆత్మకూరుకు బయలుదేరాయి. ఈ క్రమంలో ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కారు టైర్ అకస్మాత్తుగా పంచర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును కిరణ్ కుమార్ నడుపుతున్నాడు. వాహనంలో కిరణ్ కుమార్, ఆయన భార్య యామిని, కుమారుడు దిలీప్తో పాటు పక్కనే నివసించే కల్పన, ఆమె పిల్లలు దీక్షిత్, చరణ్ ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో వారందరికీ స్వల్ప గాయాలు కాగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.సమాచారం అందుకున్న వెంటనే ఆత్మకూరు సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు తెలిసింది. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనాల టైర్లు, ఇతర సాంకేతిక అంశాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.



