క్రౌన్ హ్యూమన్ రైట్స్ కైకలూరు జూన్ 4:
కైకలూరు పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. కైకలూరు మెయిన్ రోడ్ నుండి స్టేషన్ రోడ్డుకు వెళ్లే ప్రధాన మార్గంలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం వేసవి కాలం నడుస్తున్నప్పటికీ, మురుగునీరు ఇలా రోడ్లపైకి ప్రవహిస్తూ చెరువులను తలపిస్తోంది. ఎండలకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో కైకలూరు ప్రజలు మురుగునీటిలోనే ప్రయాణాలు చేయాల్సి వస్తుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడో లేదు… స్థానిక **ఎమ్మార్వో (MRO) ఆఫీస్, ఎండీఓ (MDO) ఆఫీసులకు కూతవేటు దూరంలోనే** జరుగుతోంది. ప్రతిరోజూ అధికారులు ఈ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ, ఏ ఒక్క అధికారి కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. అసలు కైకలూరులో గ్రామ పంచాయతీ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది తక్షణమే స్పందించి, డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని స్థానిక ప్రజానికం డిమాండ్ చేస్తోంది. మురుగునీటి సమస్య నుండి తమకు శాశ్వత విముక్తి కలిగించి, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరుతున్నారు.
Uploaded Video:



