తూర్పు గోదావరి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ గతంలో 20శాతం సిబ్బంది ఉండేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక వైద్యులను, సిబ్బందిని పెంచుకుంటూ రావడం వలన ఇంకా 40శాతం లోటు ఉందని తెలిపారు. కొన్ని స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇక్కడ జాయిన్ కావడం లేదని ఆయన తెలిపారు. ఇవన్నీ పరిశీలించి పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వాసు చెప్పారు. రక్తం శాంపిల్స్ ఒకటికి రెండు సార్లు తీసుకుంటున్నారని పిర్యాదులు రావడంతో అకస్మాత్తుగా వచ్చి తనిఖీ చేసి, వివరణ కోరామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. థైరాయిడ్ తదితర కారణాల వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చెన్నె నుంచి టెక్నీషియన్స్ కూడా వచ్చారని, సరిచేయడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. అందుకే ఫ్రెష్ గా శాంపిల్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకునైనా సరే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాసు స్పష్టంచేశారు. మొదటినుంచీ ఇక్కడకి రావడం, సమస్యలు తెలుసుకోవడం, అవగాహన చేసుకుని పరిష్కరించడంతో చిన్నపాటి సమస్య ఉన్నా ప్రజలు నేరుగా తమ దృష్టికి తెస్తున్నారని ఆయన తెలిపారు. ఇది మంచి సంప్రదాయమన్నారు. సక్రమమైన పద్దతిలో సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వాసు స్పష్టంచేసారు.ప్రజలు నేరుగా తమకు చెప్పడం వలన తమకు వాస్తవ పరిస్థితులు తెల్సి పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రోజూ 1600నుంచి 1800ఒపి రావడం, యాక్సిడెంట్ కేసులు రావడం జరుగుతోందని, ఇంతపెద్ద వ్యవస్థలో లోపాలు సహజమని ఆయన అన్నారు. అయితే చిన్నపాటి లోపాలు తరచూ జరిగితే నేరుగా తెలియజేయాలని ప్రజలకు ఎమ్మెల్యే వాసు సూచించారు. సిటీ స్కానింగ్ విషయమై అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే వాసు స్పందిస్తూ, రేడియాలజిస్ట్ వచ్చారని తెలిపారు. జిఎస్ఎల్ కాలేజీ వాళ్ళు , ఐ ఎం ఏ నుంచి కూడా కొంతమంది పిజి స్టూడెంట్స్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లు పనిచేసే విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. వాతావరణ మార్పుల వలన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఎమ్మెల్యే వాసు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హెల్త్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారని, ఎక్కడికక్కడ సచివాలయ ద్వారా సమీక్షించి, వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని ఆయన చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లు నగరంలో 8ఉన్నాయని, అక్కడ కూడా ఒపి రోజుకి 80వరకు కేసులు వస్తున్నాయని, ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిపై వత్తిడి తగ్గుతుందని ఆయన చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్గించగలిగామని అందుకే కూటమి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఒపి పెరగడమే కాకుండా జీజీహెచ్ లో కూడా ఒపి పెరిగిందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ప్రయివేటు హాస్పిటల్స్ కన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంకా మంచి వైద్యం అందుతుందన్న భరోసా కల్గించగలిగామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.