శ్రీకాళహస్తిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి–విగ్రహ ప్రతిష్ఠకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం నాడు స్థానిక శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని ఆయన చేసిన త్యాగం ఫలితంగానే దేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జయంతి నాటికి శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సగర్వంగా ప్రకటించారు. ఆయన ఆశయాలు, త్యాగస్ఫూర్తి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా మనమందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు.











