Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గడప గడపకు బీఎస్పీ – ఉదయగిరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని కలిగిరి, జలదంకి మండలాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో “గడప గడపకు బీఎస్పీ” కార్యక్రమం నిర్వహించారు. పలువురు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, మహాపురుషుల త్యాగాలు, సామాజిక న్యాయం కోసం బీఎస్పీ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాకుటూరు పుష్పాంజలి, సాదు శ్రీనివాసులు, నారాయణ, చన్నకృష్ణ, తిరుపాలు, మారుతి, వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వృద్ధాశ్రమంలో శ్రీరామ నవమి వేడుకలు-అల్పాహారం పంపిణీ చేసిన ‘స్వేచ్ఛ ఫౌండేషన్’.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పేడు మండలం, వికృత గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో ‘స్వేచ్ఛ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ పూట వృద్ధులకు, వికలాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫౌండేషన్ వాలంటీర్ల చొరవతో శుక్రవారం ఉదయం ఆశ్రమ నివాసితులకు రుచికరమైన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. స్వయంగా ఫౌండేషన్ సభ్యులే వృద్ధుల వద్దకు వెళ్లి అల్పాహారాన్ని వడ్డించి, వారితో సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ యాదవ్ మాట్లాడుతూ.. పండుగ వేళ వృద్ధులు మరియు వికలాంగుల మధ్య సమయాన్ని గడపడం, వారికి స్వల్ప సాయం అందించడం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, వాలంటీర్ల సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. తమను అక్కున చేర్చుకుని, పండుగ పూట ఆత్మీయతను పంచిన స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు మరియు వృద్ధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరంభాకం ముని ప్రసాద్ విజయం

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 172 ఓట్లకు గాను 159 ఓట్లు (సుమారు 92%) పోలయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరంభాకం ముని ప్రసాద్ ఘనవిజయం సాధించారు. ఆయనకు 77 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శేఖర్‌పై 30 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ రేసులో శేఖర్‌కు 47 ఓట్లు, వెంకటా చలపతికి 30 ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదేవిధంగా, కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికలో టీ. తులసీరామ్ తన సమీప ప్రత్యర్థి కే.వీ. రమణపై స్పష్టమైన ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాల ప్రకటన అనంతరం ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గాన్ని ధృవీకరించారు. నూతనంగా ఎన్నికైన ముని ప్రసాద్, తులసీరామ్‌లకు తోటి న్యాయవాదులు, మిత్రులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

తిరుపతి

నారా భువనేశ్వరిపై విమర్శలు చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారిపై వైకాపా నేతలు చేస్తున్న నీచమైన వ్యాఖ్యలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం లేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రోజా గారు.. నోటికొచ్చినట్లు మాట్లాడటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మా అమ్మ భువనేశ్వరి గారి గురించి ఇంకొకసారి తప్పుడు కూతలు కూస్తే సహించే ప్రసక్తే లేదు” అని సుధీర్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ విలువలు తెలియని వారు, మా నాయకుడి కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ బాస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకున్నారా?” అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నోటి దురదను అదుపులో పెట్టుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. ధర్మం కోసం, కుటుంబ విలువల కోసం నిలబడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలాంటి అవాకులు చవాకులను ఉపేక్షించబోవని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని నిత్యాన్నదానానికి రూ. 51,111 విరాళం

శ్రీకాళహస్తి, మార్చి 27, (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం బెంగళూరుకు చెందిన ప్రముఖ భక్తుడు చిక్కాల యోగేశ్వరరావు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 51,111/-లను విరాళంగా అందజేశారు. విరాళానికి సంబంధించిన నగదును ఆలయ సహాయ ప్రజాసంబంధాల అధికారి (APRO) రవికి దాత అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి ఉదారంగా విరాళం అందించినందుకు గాను దేవస్థాన అధికారులు చిక్కాల యోగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సహకారంతోనే వేలాది మందికి నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతోందని వారు పేర్కొన్నారు.

తిరుపతి

భక్తిశ్రద్ధలతో కుంభాభిషేక మహోత్సవం.. అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం, పాపా నాయుడు పేట గ్రామంలో వెలసిన శ్రీరాముల వారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎస్.సి.వి. నాయుడుకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్, కయ్యూరి శివ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రతిష్టాత్మక ‘ప్రశిక్షణ’ కార్యక్రమం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రశిక్షణ’ (శిక్షణా తరగతుల) కార్యక్రమం నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని NVS కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రూరల్, పట్టణ, తొట్టంబేడు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బీజేపీలో ప్రశిక్షణ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందని, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు ఇందులో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ బలోపేతానికి ఈ శిక్షణా తరగతులు కీలకమని, నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొని పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

తిరుపతి

భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు-కోదండ రాముని సేవలో బియ్యపు ఆకర్ష్

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆకర్ష్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీతారాముల వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల, ముని రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుల రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

తిరుపతి

ప్రతి ఇంటా సీతారాముల కృపాకటాక్షాలు కలగాలి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకాంక్ష

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): ధర్మానికి ప్రతిరూపం, ఆదర్శవంతమైన జీవనానికి నిదర్శనం ఆ దాశరథి జన్మించిన పవిత్ర దినం శ్రీరామ నవమి అని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కొనియాడారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణ మహోత్సవ వేళ, ఆ దైవ కృపాకటాక్షాలు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. “రాముని పాలనలో ప్రజలందరూ ఏ విధంగా అయితే సుఖశాంతులతో విరాజిల్లారో, అదే విధంగా మన శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ఇంటా సుఖసంతోషాలు, వెలుగులు నిండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నట్లు సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పండగ పూట ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఈ సందేశం నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.

తిరుపతి

సేవానిరతికి దక్కిన గౌరవం-గుడిమల్లం ఈవోకు ముందస్తు వీడ్కోలు.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) రామచంద్ర రెడ్డి పదవీ విరమణను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందస్తు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా వీడ్కోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గ మఠం ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ (AC) డి. వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డిని దుశ్శాలువతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి సేవలో ఆయన చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. సన్మాన గ్రహీత రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తన సేవా కాలంలో గుడిమల్లం దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.