మంత తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి –
*“మంత తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్* *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ గారు పలు కీలక సూచనలు చేశారు: “మంతా” తుఫాన్ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు మరియు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్ చేయాలని సూచించారు. రేంజ్ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్లు నిర్వహించరాదని హెచ్చరించారు.










