పంట నష్టం–అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
పంటలు పండక పెట్టిన పెట్టుబడులు రాక, గిట్టుబాటు ధరలు లేక అప్పుల భారం తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచింది. మండలంలోని జెట్టివారిపల్లి గ్రామానికి చెందిన యేదోటి వెంకటసుబ్బయ్య కుమారుడు యేదోటి సుబ్బరాయుడు (48) కువైట్కు వెళ్లి ఉపాధి సాధించి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయంపై ఆశలు పెట్టుకున్నాడు. భార్య సుభాషిణితో కలిసి కౌలుకు 13 ఎకరాలు తీసుకుని పంటలు సాగు చేసిన సుబ్బరాయుడికి వరుస నష్టాలు ఎదురయ్యాయి. వాతావరణ ప్రతికూలతలు, పెరిగిన సాగు ఖర్చులు, దిగుబడులు తగ్గడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం కారణంగా దాదాపు రూ.20 లక్షల మేర అప్పులు పేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు లోనైన ఆయన చివరకు తన పొలంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతూ, రైతులను ఆదుకునే విధంగా ధరల హామీ, రుణభారం తగ్గింపు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.











