జీతం కష్టార్జితం… వెంటనే చెల్లించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట స్టీల్ సీఐటీయూ ధర్నా
గాజువాక ఉక్కునగరం డిసెంబర్, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతం కష్టార్జితమని, కార్మికుల హక్కుగా ఉన్న పూర్తి వేతనాన్ని తక్షణమే చెల్లించాలని స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షులు ఎం. జగ్గు నాయుడు ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామంటూ జారీ చేసిన సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, ఉక్కునగరం కార్మికుల విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి జగ్గు నాయుడు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. రా మెటీరియల్ నాణ్యత లోపాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఉత్పత్తి ఆధారిత జీతాల సర్కులర్ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, యాజమాన్య నిర్ణయాల వల్లే నష్టాలు వచ్చాయని, దానికి కార్మికులను బాధ్యులుగా చేయడం అన్యాయమన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన హెచ్ఆర్ఏ, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సీఐటీయూ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.










