Wednesday, 22 April 2026

Blog

తిరుపతి

సర్దార్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక కార్యక్రమం

ఏర్పేడు, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా సర్దార్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రచనాత్మక పరీక్ష విజయవంతంగా పూర్తైంది. అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆలోచనలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పరీక్షను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు వెల్ఫేర్ హాస్టళ్లకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో అంబేద్కర్ భావజాలంపై చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సర్దార్ ఎన్‌జీఓ ప్రతినిధులు పేర్కొన్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన హాస్టల్ వార్డెన్లు మరియు సర్దార్ టీమ్ సభ్యులకు ఎన్‌జీఓ అధ్యక్షుడు డా. బి.ఎన్. లలిత్ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

మహిళా సాధికారతలో నవ శకం..మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం- ప్రజ్ఞశ్రీ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) దేశ జనాభాలో సగభాగమైన మహిళల దశాబ్దాల నిరీక్షణకు మోదీ ప్రభుత్వం తెరదించిందని, ‘నారీ శక్తి వందన్’ అధినియం ద్వారా మహిళా సాధికారతకు కొత్త బాటలు వేశారని తిరుపతి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞశ్రీ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2023లో ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక చట్టం ద్వారా లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమన్నారు. ఇది కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారత రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యానికి వేసిన బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మోదీ ప్రభుత్వ పాలనలో మహిళల పట్ల సానుకూల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళల ఆశలకు న్యాయం జరిగింది. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మహిళా లోకానికి గర్వకారణమని, సామాజిక సమానత్వ దిశగా ఇదొక గొప్ప అడుగని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తిరుపతి

యువతకు బంగారు అవకాశం – శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా ఈనెల 15వ తేదీ బుధవారం పట్టణంలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ కంట రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఏప్రిల్ 15న శ్రీకాళహస్తిలోని జేఎన్టీయూఏ–శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (JNTUA-SKIT) ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ జాబ్ మేళాలో శ్రీ సిటీ, మేనకూరు సెజ్, ఈఎంసి క్లస్టర్, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు చెందిన 40కి పైగా బహుళజాతి సంస్థలు పాల్గొని సుమారు 2400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 5వ తరగతి నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 14గా నిర్ణయించినట్లు తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అడ్మిట్ కార్డ్‌తో రావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8919889609, 7989509540, 9988853335 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునిరాజ నాయుడు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మోహన్, ఈఎస్సీ కోఆర్డినేటర్ వినయ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

తండ్రి బొజ్జల ఆశయాల సాధనకు తనయుడు సుదీర్ రెడ్డి ముందడుగు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి స్థానిక పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఏప్రిల్ 15న చేపట్టనున్న సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే టిడ్కో ఇళ్ల పంపిణీ, అలాగే ఉచిత కంటి, నొప్పి నివారణ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసి, లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తూ, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఆశయాల సాధన దిశగా శ్రీకాళహస్తిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

తిరుపతి

శ్రీకాళహస్తి గృహ పంపిణీ వేడుకకు చంద్రబాబు రాక కోరుతూ ఆహ్వానం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న APTIDCO గృహ నిర్మాణ పథకం కింద శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న ప్లాట్ల అధికారిక అప్పగింత, గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ముఖ్య అతిథిగా విచ్చేయాలని మున్సిపల్ కమిషనర్ అధికారికంగా ఆహ్వానించారు. పట్టణంలోని శివనాధపాళ్యంలో ఉన్న APTIDCO గృహ సముదాయంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ప్లాట్ల పత్రాలు అందజేయడం, గృహ ప్రవేశోత్సవాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హాజరై లబ్ధిదారులను ఆశీర్వదించి, ప్రభుత్వ గృహ పథకాలపై దిశానిర్దేశం చేయాలని కమిషనర్ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి చెంత పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా రూ. 5,000/- రాహు-కేతు నివారణ పూజలు, అంతరాలయ దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్వో రవి మరియు స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తిరుపతి

సోమవార పర్వదినం-కాళహస్తిలో నయనానందకరంగా మృత్యుంజయార్చన

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి టెంపుల్ న్యూస్) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల విడిపూలు, సుగంధ భరిత పుష్ప మాలలతో నయనానందకరంగా అలంకరించారు. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి వారి అభిషేక సేవను కనులారా వీక్షించి, భక్తి పారవశ్యంలో మునిగితేలారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భారీ ఎత్తున తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా “ఓం నమః శివాయ” నామస్మరణతో మారుమోగింది.

తిరుపతి

జలియన్‌వాలాబాగ్ అమరవీరుల త్యాగాలు చిరస్థాయి – జనసేన నివాళి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 13 (పున్నమి న్యూస్) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలిచిన జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించినట్లు పార్టీ నాయకులు జయప్రకాష్ తెలిపారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో గల జలియన్‌వాలాబాగ్ మైదానంలో సమావేశమైన వేలాది నిరాయుధ భారతీయులపై జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైనికులు ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపి అమానుష మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో వెయ్యికి పైగా నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. జలియన్‌వాలాబాగ్ సంఘటన కేవలం రక్తపాతం మాత్రమే కాకుండా, భారత స్వాతంత్ర్య పోరాటానికి కీలక మలుపు తీసుకువచ్చిన ఘట్టంగా చరిత్రలో నిలిచింది. అమాయక ప్రజల త్యాగాలే దేశానికి స్వేచ్ఛను అందించాయని జయప్రకాష్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 107 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి సబ్ డివిజన్‌కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకారం

కావలి సబ్ డివిజన్‌కు సోమవారం నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కావలి పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి, భయరహిత వాతావరణం సృష్టించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలో కావలిలో పనిచేసిన శ్రీధర్ ఒంగోలు దిశ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఒంగోలులో విధులు నిర్వహించిన రమణ కుమార్ ఇప్పుడు కావలికి బదిలీ కావడంతో స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.