ఆంధ్రప్రదేశ్
* అమరావతి జనవరి ( పున్నమి ప్రతినిధి) – *స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి* – *అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు శిక్షణా సదస్సు* *విజయవాడ:* అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేయాలని స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి అన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగశాయి ప్రసంగిస్తూ.. అక్రిడిటేషన్ జీవోలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటమే కాకుండా.. అక్రిడిటేషన్ల జారీలో చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్యాయం జరక్కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమాచార శాఖ డైరెక్టరు దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఎంప్యానల్డ్ పత్రికలకు అక్రిడిటేషన్ల సంఖ్యను పెంచాలని, నాన్ ఎంప్యానల్డ్ పత్రికలకు రాష్ట్ర స్థాయిలో కనీసం ఒక్క అక్రిడిటేషన్ అయినా మంజూరు చేయాలని అన్నారు. ఈ అంశాలపై ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో అసోసియేషన్ నుంచి చేసిన ప్రతిపాదనలకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కమిటీల సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అసోసియేషన్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని కోరారు. ఎంప్యానల్మెంట్ పెండింగ్ ఫైళ్లు, ఇతర సమస్యల గురించి త్వరలోనే ఐ అండ్ పీఆర్ డైరెక్టరును కలిసి పరిష్కారమయ్యేలా చూస్తామని రంగశాయి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపీనాథరావు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు నిట్టల శ్రీనివాస్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.