విశాఖపట్నం
పెదగంట్యాడ: జనవరి (పున్నమి ప్రతినిధి) సౌర పలకల ద్వారా స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని ఏపీఈపిడీసీఎల్ ఈఈ బికే నాయుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ కాలుష్య రహిత శక్తి వనరని పేర్కొన్నారు. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువుల విడుదల జరగదని, తద్వారా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించవచ్చని తెలిపారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని, ప్రభుత్వం కల్పించే రాయితీలను పొందుతూ ఇంటికి కావాల్సిన విద్యుత్తును స్వయంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో కరెంటు బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించినట్లవుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను లేదా సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ మాధవి, గాజువాక, పెదగంట్యాడ ఏఈలు ఆర్.వి. రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, వార్డు టీడీపీ అధ్యక్షుడు రట్టి వాసు, ఇన్చార్జి బైపిల్లి గాంధీ, సీఓ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.