Friday, 27 March 2026

Blog

గూడూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది. – ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. – ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. – బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు. – సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు. – మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు. – ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు. – అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి? – రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం. – ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.

Featured ఆంధ్రప్రదేశ్

వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తి పిఎస్‌ఎల్‌వి సి-47

కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సి-47ను రోదసిలోకి దిగ్విజయంగా పంపింది. శాస్త్రవేత్తల ఉత్కంఠకు తెరదించుతూ నిర్ధిష్ట లక్ష్యం వైపు దూసుకెళ్లింది. వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తిని చాటింది మన పిఎస్‌ఎల్‌వి సి-47 రాకెట్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన కీర్తిని తమ ఖాతాలో వేసుకొంది. అచ్చొచ్చిన వాహక నౌక పిఎస్‌ఎల్‌వి నుంచి సి-47 రాకెట్‌ కొద్దిసేపటి క్రితం నిప్పులు చెరుగుతూ నింగిలోకి వెళ్లింది. నిర్ధిష్ట కక్ష్యలో చేరింది. అత్యాధునిక రెసల్యూషన్‌ కలిగిన కెమెరాలతో భూవాతావరణ పరిస్థితులను 0.28 మీటర్ల కంటె మెరుగైన రెసల్యూషన్‌లో ఫోటోలు తీసే కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట సమయంలో నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 12 నానో శాటిలైట్లను మన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక రోదసిలోకి పంపింది. భారత సమాచార సాంకేతిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే కార్టోశాట్‌ – 3 ఉగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్తో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రసంశలు కురుస్తున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనకీర్తిని సర్వత్రా కొనియాడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివుండే కార్టోశాట్‌-3 దేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ప్రత్యేకించి భారత సైన్యానికి అభివృద్ధి ప్రణాళికలకు ఈ ప్రయోగం దిక్సూచిగా మారనుంది. దాదాపు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన స్లోక్‌-4పి అనే నానో ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనేమరో బుల్లి ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి సి-47 దిగ్విజయంగా కక్ష్యలోకి పంపింది. దాదాపు పదేళ్లపాటు ఈ ఉపగ్రహం భారతదేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.

Featured బిజినెస్

వృత్తి జీవితం – 6

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం – 6 వ భాగం వినడం ద్వారా మానసిక ఆరోగ్యం ! శ్రద్ధగా వినడం అనేది కమ్యూనికేషన్‌ లో అన్నింటికంటే ముఖ్యమైన కళ ! కమ్యూనికేషన్‌కి 4 స్థంభాలు! రాయడం, చదవడం, మాట్లా డడం, వినడం. మాట్లాడడం కంటే కూడా ముఖ్యమైనది వినడం . ఇది అలవరుచుకుంటే, మనకి వత్తి జీవితంలోనూ, కుటుంబ జీవితం లోనూ కూడా చాలా ఉపయోగ పడుతుంది. మన సత్సంబంధ బాంధవ్యాలు మెరుగు పడ తాయి. తద్వారా ఉపశాంతి, సంతోషం. తద్వారా మన మానసిక ఆరోగ్యం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి . నిశితంగా వినడంలోని ముఖ్యాంశాలు. 1. చెప్పే వారి వైపు వినే వారు చూడడం మొదటి స్టెప్పు ( అలా అని మనం తదేకంగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ ఉంటే, ఆ చెప్పే వారు స్త్రీ లు అయితే, వారు ఇబ్బంది పడవచ్చు! జాగ్రత్త ! చెప్పే వారు స్త్రీలు అయితే, సూది లాంటి చూపులతో గ్రుచ్చెయ్యకండి మరి! కొంచెం గ్యాపు ఇచ్చి అటు ఇటు చూస్తూ వినండి!) 2.అవతలి వారు చెప్పేటప్పుడు ‘ఊ’ కొట్టడం, తల ఊపడం, వారు చెప్పినది కొంచెం రిపీట్‌ చేసి, మనం విన్నాము అన్న నమ్మకం కలిగించడం. 3. సూటి ప్రశ్నలు అడగడం . సరి అయిన ప్రశ్నలు అడగడం . కానీ ఇది చాలా సున్నితం గా చేయాలి . మనకి సమస్య చెప్పే వారు, మనకి పూర్తి వివరాలు చెప్ప డానికి ఇష్ట పడక పోవచ్చు. కొన్ని విషయాలు గోప్యంగా ఉం చవచ్చు. వారు ఎంత వరకు చెప్పడానికి ఇష్ట పడతారో, అంతవరకే ప్రశ్నలు అడగాలి. 4. ఎవరైనా సహోద్యోగి తమ బాధలు చెప్పినప్పుడు, పూర్తి గా విని, వారు చెప్పిన దానిలో, కీలక మైన పదాలు తిరిగ్‌ రిపీట్‌ చెయ్యడం. దాని వలన వారికి మనం విన్నామని నమ్మకం కలుగుతుంది. మన అవగాహన కూడా పెరుగుతుంది. అవతలి వారు చెప్పేది విన్న తరువాత , వారి దగ్గర లేనిదీ, మనకి తెలిసినదీ, వారిగి సహాయ పడగలదీ అయిన సమాచారాన్ని వారికి ఇవ్వడం. మీకు తెలిసిన డాక్టర్‌ పేరు కావచ్చు, వారి బిడ్డ ని చేర్పించాలి అనుకున్న పాఠశాలలో మీకు తెలిసిన వ్యక్త్‌ పని చేస్తూ ఉండవచ్చు . ఇలాంటి రిఫరెన్సు కి సంబంధించిన సహాయం కావచ్చు. కేవలం ‘వినడం’ ద్వారా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందా ? ఖచ్చితంగా కుదుట పడుతుంది ! ‘ వినడం ‘ అనే ప్రక్రియ ద్వారా, మనస్సు ప్రక్షాళనం అవుతుంది ఇతరులు తమ బాధలు చెప్పేట ప్పుడు, మన స్వంత ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకోవడం అవసరం ! అవతలి వారు తమ బాధలు చెబుతున్నప్పుడు , కొన్ని విషయాలు మనకి ఆశ్చర్యం కలిగించేవిగా , లేదా మనని నిర్ఘాంత పరిచేలా ఉండవచ్చు. కానీ, వినే ప్రక్రియలో , మన భావోద్వేగాలు, వెనువెంటనే ప్రకటించక పోవడమే మంచిది .. ఇంకో విషయం ఏమిటంటే, అవతలి వారు తమ సమస్యను మనకి చెప్పేటప్పుడు మనం విని వెనువెంటనే తక్షణ పరిష్కారాల లిస్టు చదవక పోవడం. చాలా మందికి తక్షణ పరిష్కారం అవసరం లేదు. వారి బాధని వినే వారు మాత్రమే కావాలి ! మనం చెప్పే ఇన్స్‌ స్టంట్‌ సొల్యూషన్‌ లు వారికి తట్ట లేదనీ కాదు. పరిష్కారానికి వారు ఇప్పటి దాకా ఏమేమి చేశారో వారినే అడిగి , ఆ తరువాత మాత్రమే మనకి తోచిన సలహా ఇవ్వడం మంచిది! ఒక ఆనంద కరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో వత్తిడికీ, మానసిక సమస్యకూ గురి అయిన వారిలో 70 శాతం మంది కోలుకుంటారు ! వారి చుట్టు పక్కల వారు అర్ధం చేసుకుని సహానుభూతితో సపోర్టు చేస్తే! పైగా, ఉద్యోగంలో మానసిక అనారోగ్యం అనేది – ఏళ్ళ తరబడి ఉండదు . ఒక్కో సారి మనకి నచ్చని ఒక సంఘట వల్ల రావచ్చు. ఇష్టం లేని బదిలీయో, లేక ఇష్టం లేని బాస్‌ క్రింద పని చేయడమో, అనుకున్న ప్రమోషన్‌ / ఇంక్రిమెంటు రాక పోవడమో, ఇలా. ఆ సమయంలో ఆ ఎదురు దెబ్బని సరిగా ఎదుర్కొంటే, మళ్ళీ, ఉద్యోగ / వ్యాపార జీవితం సజావుగా నడవ వచ్చు! ఒక్కోసారి సమస్యలకి పరిష్కారమే ఉండక పోవచ్చు ! పరిష్కారం లేని సమస్యలు ఎన్నో ! అలాంటప్పుడు కలిగిన బాధ ని , దుఃఖాన్నీ జీర్ణం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడమే! ఉదాహరణకి , విడాకులు కావచ్చు . లేదా, సంస్థ నష్టాల్లో ఉందని వేల మందికి ” స్వచ్చంద విరమణ” (!!) ఇచ్చీ ఇంటికి పంపించ వచ్చు! మళ్ళీ అదే సంస్థ లో అదే ఉద్యోగం రాదు. మళ్ళీ ఆ జీతం రాక పోవచ్చు ! ఉన్న డబ్బు ని పొదుపు చేసుకుని, మరో చోట ఇంకోపనో, రిస్కు తక్కువ ఉన్న వ్యాపారమో ప్రారంభించ డమే ! మానసిక అనారోగ్యం అనుకోని సమస్యల వల్ల వస్తుంది. కానీ అన్ని సమస్యలకి పరిష్కా రాలు ఉండవు. పరిష్కారం లేని సమస్యల గురించి , మార్చ లేని గతాన్ని గురించి అతిగా వ్యధ పడకుండా , కొత్త జీవితాన్ని మరో చోట ప్రారంభించడమే పరిష్కారం ! మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

పని చేసే చోట మానసిక ఆరోగ్యానికి మార్గాలు – 5

వృత్తి జీవితం – 5 ఇంకొకరితో పోలికలు వద్దు ! మిమ్మల్ని మీరుగా అంగీకరించండి . మీలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలూ ఉండవచ్చు . ఇతరులలో కూడా అవి ఉంటాయి కానీ, వేరు వేరు రకాల ప్లస్‌లు మైనస్‌లు ! గుర్తు ఉంచుకోండి. పని అనేది మన జీవి తంలో ఒక భాగం మాత్రమే ! దీనికి మించిన సంపూర్ణ వ్యక్తిత్వం మన అందరికీ ఉంటుంది! కానీ దురదష్టవశాత్తు మనలో చాలా మందిమి, మనం పనిలో సాధించే విజయాన్ని బట్టే, మన ఆత్మ గౌరవం పెంచుకోవడం, లేదా తగ్గించు కోవడం – చేస్తూ ఉంటాము. చాలా మంది , తమ ఐడెంటిటీ, ఉనికి , మనకి మనం ఇచ్చుకునే విలువ, అన్నీ – వత్తికే ముడి పెట్టుకుంటారు . ఒక ఇంకిమెంటు కో, ప్రమోషన్‌కో, లేక విదేశీ ట్రిప్పుకో, లేక ఆన్‌ సైట్‌ ప్రాజక్టుకో. ప్రమోషన్‌ కానీ, మిగతావి కానీ, మన పక్క సహోద్యోగికి వచ్చి మనకి రాక పోతే, ఆ ఉద్యోగి బాధ వర్ణనాతీతం ! మనో వ్యాధి పట్టేస్తుంది. ఒక పెద్ద సంస్థలో అన్నీ కరెక్ట్‌గా , న్యాయంగా జరగవు. కొన్ని అన్యాయాలు ఉం టాయి, పాలిటిక్స్‌ ఉంటాయి. ఒక్కోసారి ఆ అన్యాయానికి, పాలిటిక్స్‌కి మనం బలి అవుతాము. అయినా, వత్తి జీవితం ఒక్కటే మన వ్యక్తిత్వానికీ, మన విలువలకు గీటురాయి కాదు! మనకి ప్రమోషన్‌ / ఇంక్రెమెంటు / ఆన్‌ సైట్‌ ప్రాజక్టు, అవార్డు, రివార్డు వచ్చినా రాక పోయినా – ఇంటికి వస్తే ఆప్యాయంగా చూసుకునే జీవిత భాగస్వామి , పిల్లలు, లేక మిమ్మల్ని చూడగానే తోక ఆడించే పెంపుడు కుక్క – ఉంటే , మీరు విజయం సాధించినట్లే! కాబట్టి , మనకి మనం ఇచ్చుకునే విలువ ( సెల్ఫ్‌ వర్థ్‌ ) మొత్తం వత్తి కే ముడి పెట్ట వద్దు ! ఇది మానసిక ఆరోగ్యానికి మేము చేసే మరొక సూచన . 10. మరి మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం మాట ఏమిటి ? ఇప్పటి దాకా మనం – పని చేసే చోట మన మానసిక ఆరోగ్యం కోసం ( మందులు వాడకుండా ) మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో – తెలుసుకున్నాం . ఇప్పుడు మనం, ఇతరుల, అనగా మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం మనం ఏమైనా చేయగలమో లేదో – చూద్దాం. ఇది ముఖ్యం! ఎందుకంటే, మనం మన తోటి వారికి ఏమి ఇస్తామో, అదే మనకు ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది . మనం వారి శ్రేయస్సు గురించి శ్రద్ధ తీసుకుంటే, మన టైం బాగు లేనప్పుడు, మనము ‘ డౌన్‌’లో ఉన్నపుడు మనకి ఆసరా / సహాయం లభిస్తాయి. మనం పరస్పర ఆధారిత సామాజిక వ్యవస్థలో నివసిస్తున్నాము కాబట్టి. మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం ఎంత అవసరమో, ఇతరుల గురించి శ్రద్ధ చూపించడం కూడా అంతే ముఖ్యం. ఇత రులూ మనమూ ఒకటే అనుకున్నప్పుడు. మనమందరం, కుటుంబ వ్యవస్థ నుంచి తయారయిన మనుషులం. మీ సహోద్యోగు లలో కుటుంబ సమస్యల వల్ల ఆఫీసులో డిప్రెష న్‌కి లోను అవుతున్నారేమో – కనుక్కోండి. మీకు క్లోజ్‌ గా ఉన్న కొలీగ్స్‌తో. వారి ఇంట్లో వద్ధులైన తల్లిదరండ్రులు ఉన్నారా ? వారిని ఇంట్లో వదిలి పనికి రావాల్సి వస్తోందా ? మీకు తెలిసిన ‘ డే కేర్‌’ ఇచ్చే వారు ఉంటే, మగ నర్సులు, డే కేర్‌ సెంటర్‌లు, మీకు తెలిస్తే, సూచించండి. వారి పిల్లలు చదువులో ఎక్కి రావటం లేదని వర్రీ అవుతున్నారా? మీకు తెలిసిన మంచి ట్యూటర్‌ ఉంటే, వారికి తెలియ జేయండి. మీ సహోద్యోగి పని వత్తిడిని సరిగా హ్యాండిల్‌ చెయ్య లేక మీ బాస్‌చేత బాగా తిట్లు తింటున్నారా ? మీరు కాస్త ట్రెయినింగ్‌/ కోచింగ్‌ ఇచ్చి వారి నైపుణ్యం మెరుగు పరచ గలరేమో ఆలొచించండి . పని నేర్పిన వారి పట్ల చాలా మంది జీవితాంతం క్రుతగ్నులుగా ఉంటారు . మీకు ఏయే సబ్జక్ట్‌ల పట్ల మంచి పరిజ్ఞానం ఉంది? మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి రెండు క్లాసులు చెప్ప గలరేమొ చూడండి! మీ ఆఫీసుకి బయట , ఏవైనా సామాజిక సేవా కార్య క్రమాలలో ‘ వాలంటీర్‌ / స్వచ్చంద సేవకులుగా చేరండి. దీర్ఘ కాలం వ్యాధితో బాధ పడుతూ మంచం పట్టిన చుట్టాలు ఎవరైనా ఉంటే, వారిని, తీరిక చేసు కుని అప్పుడప్పుడూ సందర్శించండి . ఇంటర్‌ / డిగ్రీ చదివిన విద్యార్ధినీ విద్యా ర్ధులకి పోటీ పరీక్షలలో ‘ ఫ్రీ కోచింగ్‌ ‘ ఇవ్వండి. ఒకటి రెండు క్లాసులు. మీకు బాగా కమాండ్‌ ఉన్న సబ్జెక్టులలో. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉం డండి. డాక్టర్‌ లకీ జబ్బులు వస్తాయి. మానసిక వ్యాధి నిపుణులు కూడా డిప్రెషన్‌కి లోను అవు తారు. క్రీడాకారులకి కూడా గాయాలు అవుతాయి. ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే క్రమంలో, వారి సమస్యలను మీరు ఎక్కువ సీరియస్‌ గా తీసుకుని, మీరు మానసిక వత్తిడికి గురి కావద్దు. మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్‌ : : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.

Featured ఆంధ్రప్రదేశ్

విద్యాలయాలు

విద్యాలయాలు విద్యావేత్తలను, వైద్యులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, న్యాయ వాదులను, న్యాయమూర్తులను, దేశరక్షకులను, నాయకులను అందించి సకల మానవాళిని వున్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారాల వంటి స్థలాలే విద్యాలయాలు. తొలి విద్యాలయాలు వి.ఆర్‌. కళాశాల విద్యారంగంలో జిల్లా ముందడుగులో వుంది. ప్రధమంగా నెల్లూరులో సి.ఏ.యం. హైస్కూలు, వెంకటగిరి రాజా హైస్కూలు, వేద సంస్కృత పాఠశాల ప్రారంభించబడినవి. వీటిని ఈ ప్రాంతపు మొదటి విద్యాలయాలుగా పేర్కొనాలి. 1875లో సుంకు నారాయణస్వామి శెట్టి అద్దె ఇంటిలో ప్రారంభించిన హిందూ వర్నాకులర్‌ స్కూలు క్రమంగా హిందూ హైస్కూలుగా పిలువబడేది. 1979లో మహమ్మదు రహంతుల్లా సాహెబ్‌ (వెంకటగిరి రాజాగారి మాజీ దివాను) భవన స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళమిచ్చారు. వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర దాతృత్వంతో అభివృద్ధి పరచడంవల్ల 1895లో హిందూ హైస్కూలు పేరు వెంకటగిరి రాజా హైస్కూలుగా మార్చారు. పాఠశాల నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన భవనాలు నిర్మించారు. 50 వేల రూపాయలు శాశ్వతనిధి సమకూర్చారు. ఆనాడు వి.ఆర్‌. హైస్కూలుగా మొదలై 1920లో వి.ఆర్‌ కళాశాల, క్రమంగా పోస్టు గ్రాడ్యుయేషన్‌, లా కాలేజి, చిల్డ్రన్స్‌ అకాడమీ, ఈవినింగ్‌ కాలేజి, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌తో నేడు విరాజిల్లుతోంది. కళాశాల సర్వతోముఖాభివృద్ధికి ఆనం కుటుంబీకులు, మేనకూరు ఆదిశేషారెడ్డి, మాడభూషి నరసింహాచారి, వవ్వేటి విశ్వనాథరావు, తూములూరు శివరామయ్య విశేష కృషి చేశారు. ఈ ప్రాంతపు మేధావులు, ప్రముఖులలో ఎక్కువమంది ఇందులో చదివినవారు కావడం విశేషం. వి.ఆర్‌. కళాశాల మొదటి ప్రిన్సి పాల్‌గా రాయసం వెంకట శివుడు పనిచేశారు. సిఎఎం హైస్కూల్‌ : మిషనరీస్‌ ఆధ్వర్యంలో 1837 ప్రాంతాలలో ఏర్ప డిన సి.ఏ.యం. హైస్కూలు విద్యావ్యాప్తికి బాగా తోడ్ప డింది. ఇది నెల్లూరులో స్థాపితమైన మొదటి హైస్కూలు. ప్రప్రథమంగా ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టింది. విశాలమైన ప్రాంగణంలో మంచి భవనాలు నిర్మించారు. ఆటస్థలం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా వుండేది. దీటైన ఉపాధ్యాయులు ఇందులో పనిచేశారు. అంతటి వున్నత స్థితిలో వుండిన పాఠశాల 175 ఏళ్ళ తర్వాత మూతపడింది. ఆస్తులు పరాధీనమవుతున్నాయి. వేదసంస్కృత పాఠశాల స్థానికంగా వున్న భాషాభిమానుల ప్రోత్సాహంతో 1882లో స్థాపించబడింది. పిల్లలకు సంస్కృతంపై పరిజ్ఞానం, పట్టు, వేద విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన వుద్దేశం. వేదాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా విద్యాలయం సాగుతుంది. చిన్న పాఠశాలగా మొదలై కళాశాలగా రూపుదిద్దుకొంది. వేదం, సంస్కృతం, ఇతిహాసాలు, కావ్యాలు ఇక్కడ విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడ చదివినవారు విద్వాన్‌, శిరోమణి వంటి విద్యార్హతలు పొందగలిగారు. తెలుగు, సంస్కృత పండితులుగా గౌరవప్రదమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కలిగిన పెద్ద గ్రంథాలయం వుంది. 1900-1915 మధ్య కాలంలో వెంకటగిరిలో ఆర్‌.వి.యం. హైస్కూలు, నెల్లూరులో ఎబియం గరల్స్‌ హైస్కూలు, కావలిలో బోర్డు హైస్కూలు ప్రారంభమయ్యాయి. కావలిలో విశ్వోదయ విద్యాసంస్థలు జవహరు భారతి : ఈ విద్యాలయ సంస్థలకు శ్రీకారం చుట్టిన మహ నీయుడు ‘డి.ఆర్‌.’గా పిలువ బడే దొడ్ల రామచంద్రారెడ్డి. కావలిలో సంపన్నమైన సంస్కా రవంతమైన కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే ఎం.ఎ డిగ్రీ పొందిన తర్వాత ఆయనకు కళాశాల స్థాపన ఆలోచన కలి గింది. 1951లో విశ్వోదయ విద్యా సంస్థను స్థాపించారు. కొంతకాలం తర్వాత జవహర్‌ భారతి కాలేజీగా నామకరణం చేశారు. 1953లో డిగ్రీ కళశాల, 1972లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సెంటర్‌, 1978లో ఇంజనీరింగ్‌ కాలేజి స్థాపించారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని పారద్రోలి వెలుగులోకి రావడం, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి రావడం అనే భావనతో ప్రారంభమైంది. విద్యారంగంలో వెనుకబడిన కావలి ప్రాంతానికి, ప్రకాశంజిల్లా మెట్ట ప్రాంతాలవారికి విద్యా సముపార్జనకు అవకాశాలు కలుగజేశారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. విశ్వోదయ సంస్థ పేరుకు తగ్గట్టే ఆశయాలు, వాటికి తగ్గట్టే సంస్థ ఎంబ్లమ్‌ రూపొందించారు. దొడ్ల రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఛీఫ్‌ జస్టిస్‌ రాజమన్నార్‌, తిక్కవరపు రామిరెడ్డి, రామానుజ రావు నాయుడు, బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మల్లికార్జునం, భుజంగ రాయ శర్మ వంటి మేధావులున్నారు. ఈ విద్యా సంస్థలో ఎందరో ప్రముఖులు విద్య నభ్యసిం చారు. సి.పి.యం. కార్యదర్శి రాఘవులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకట్రామి రెడ్డి, దివంగత ఐ.ఏ.యస్‌. అధికారి సుబ్రహ్మణ్యం, జూపూడి ప్రభాకరరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్న వారే. విద్యా సంస్థలకు డి.ఆర్‌.గారు రెక్టారుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, కామరాజ నాడార్‌, దేశ్‌ముఖ్‌ దంపతులు, జాకీర్‌ హుసేన్‌ వంటి మహామహులు ఈ విద్యా సంస్థలను సందర్శించారు. విద్యా సంస్థలు 60 సం|| పూర్తి చేసుకొన్న సందర్భంలో 2012లో వజ్రోత్సవం జరుపుకొంది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యాసంస్థలు : స్వాతంత్య్రం రాకపూర్వమే విద్యాలయాలను, హాస్టళ్ళను ప్రారం భించి పాతికేళ్లపాటు అవిరళ కృషిచేసిన మహోన్నతుడు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థ లకు కోట, వాకాడు మండ లాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఈ రెండు మండ లాలు కోట సమితిగా వుండేది. విద్యాదాతగా పేరుపొందిన బాలకృష్ణారెడ్డి గారి కృషివల్ల విద్యాసంస్థలు వెలిశాయి. వీరు నేదురు మల్లి జనార్ధనరెడ్డికి పినతండ్రి గారు. 1965లో కళాశాల స్థాపించారు. క్రమంగా వాటితో ఈ మండలాలకు విద్వత్‌ వెలుగులు వచ్చాయి. వీటి అభివృద్ధికి నేదురుమల్లి, నల్లపరెడ్లు సయోధ్యగా కృషి చేశారు. వాకాడు మండలం విడిపోయిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు చేతులమీదుగా కోటలో జూనియర్‌ మహిళా కళాశాలను స్థాపించారు. బాలకృష్ణారెడ్డి మరణించిన తర్వాత జనార్దన రెడ్డి, పద్మనాభరెడ్డి సోదరులు బాధ్యత వహించి విద్యాలయాలను అభివృద్ధి చేశారు. వాకాడు విద్యానగర్‌గా మారిపోయింది. బాలకృష్ణారెడ్డి హరిజన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారి అభివృద్ధికి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను ఇందిరాగాంధీ ఒకసారి దర్శించారు. విద్యానగర్‌లో బాలురకు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు నిర్మించారు. ఇక్కడ చదువుకొన్న విద్యార్థులు గొప్ప పదవులలో వున్నారు. ఈ విద్యా సంస్థలు చదువులోనే కాకుండా క్రమశిక్షణకు పేరుపడ్డాయి. వీటికి ఆద్యుడు, స్థాపకుడు, మూలపురుషుడు అనతగిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి చిరస్మరణీయుడు. వీరి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘దీన బంధు’ బిరుదుతో, కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాయి. ఆ మహనీయుడు 1978లో కన్నుమూసినా వారు వెలిగించిన విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది. శ్రీ సర్వోదయ కళాశాల : 1972లో నెల్లూరులోని వైశ్య ప్రముఖులు కళాశాలను ప్రారంభించారు. వాకాటి సంజీవిశెట్టి ముఖ్యదాతగా సి.సి. సుబ్బరాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. యడ్లపల్లి గోవిందుశెట్టి, వొమ్మిన సుబ్రహ్మణ్యం సెక్రటరీలుగా పనిచేశారు. ఆర్‌.టి.సి. బస్టాండు ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో కాలేజి నిర్మితమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్‌, బి.ఏ., బి.యస్‌సి., ఎం.ఏ., ఎం.కామ్‌., తదితర చదువులున్నాయి. డా|| వి. మాధవరావు, డా|| కాళిదాసు పురుషోత్తం వంటి మేధావులు ఇక్కడ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. నిపుణులైన అధ్యాపకులు ఆయాశాఖలలో పనిచేస్తున్నారు. కాలేజి 1996లో ఎండోమెంట్స్‌ శాఖ పరిధిలోకి వెళ్లింది. కోరా విద్యా సంస్థలు : నెల్లూరుకు చెందిన విద్యావేత్త కోదండ రామయ్య ఆధ్వర్యంలో 1986లో విద్యాలయాలు స్థాపించబడినవి. ఎంసెట్‌ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థగా ప్రారంభమై 1995లో జూనియర్‌ కాలేజిగా రూపుదిద్దుకొంది. ఇటీవల స్వర్గస్తులైన డాక్టరు ఎస్‌.వి.నరసింహులు (రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డి.కె.డబ్ల్యూ. కాలేజి) వంటి ప్రముఖ విద్యావేత్తలు సంస్థకు మూలస్థంబాలలో ఒకరుగా వుండేవారు. 2000 మార్చిలో ఈ సంస్థ రత్నం విద్యాసంస్థలలో విలీనమయింది. నారాయణ విద్యా సంస్థలు : ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనలో నారాయణ పేరు, నారాయణ విద్యా సంస్థల పేర్లు విననివారు రాష్ట్రంలో వుండరు. 1977లో పి. నారాయణ ఒక కాలేజీలో స్టాటిస్టిక్స్‌ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎందు కనో ఆయన అందులో కొనసాగ లేదు. కొనసాగి వుంటే ఆయనలోని ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలు బయల్పడేవి కావు. 1983 నుండి విద్యాసంస్థలను ఒకటొకటిగా ప్రారంభించడం మొదలు పెట్టారు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాళెం విద్యలకు కేంద్ర బిందువయింది. అక్కడనుండి విద్యాలయాలు విస్తరించాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర పరిధులు దాటింది. నేడు దేశంలో పలుచోట్ల నారాయణ విద్యాసంస్థలు (దాదాపు 300) నెలకొని వున్నాయి. ఇందులో ఐదారువేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆయన స్వతంత్రంగా, స్వయంకృషితో ఎదిగారు. పట్టుదల, కార్యదీక్ష, మృదుస్వభావం ఆయన సహజ లక్షణాలు. ప్రస్తుతం నారాయణ సంస్థలలో ప్రీప్రైమరీ స్కూలునుండి పోస్టు గ్రాడ్యుయేట్‌ వరకు విద్యాలయాలున్నాయి. ఒలింపియాడ్‌ స్కూల్స్‌, కాన్సెప్ట్‌ స్కూల్స్‌, టెక్నో స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజి, బి.ఫార్మసి, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంటు, యోగ & నేచురోపతి కాలేజి, బి.ఇడి. కాలేజి వున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల ఐ.ఎ.ఎస్‌. అకాడమి ప్రారంభించారు. 30 సం||ల కాలంలో (1983-2012) నారాయణ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా వున్న నారాయణ 2014 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రత్నం విద్యా సంస్థలు : నెల్లూరు జిల్లాలో 1984లో ప్రారంభమైన రత్నం సంస్థలకు ప్రత్యేక స్థానం వుంది. కె.వి. రత్నం, వారి శ్రీమతి పద్మావతి రత్నం సంస్థ వ్యవస్థాపకులుగా వున్నారు. ప్రస్తుతం కె. వేణుగోపాల్‌ , డా|| కె. కృష్ణకిషోర్‌ సారధ్యంలో నడుస్తున్నాయి. రత్నం రెసిడెన్షియల్‌ స్కూలు, ఫార్మసి ఇన్‌స్టిట్యూట్‌, కంప్యూ టర్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్లు నెల్లూరు సమీపంలోని పిడతా పోలూరులో, రత్నం పబ్లిక్‌ స్కూలు ధనలక్ష్మీపురంలో నిర్మించారు. రత్నం డిగ్రీ కళాశాలను హరనాథ పురంలో స్థాపించారు. నెల్లూరు నగర పరిధిలో రత్నం ఒలింపియాడ్‌ అకాడమి క్యాంపస్‌ స్కూలు దర్గామిట్టలో, గ్లోబల్‌ స్కూలు మాగుంట లే అవుట్‌లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా విద్యాసంస్థలను ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రియదర్శిని విద్యాసంస్థలు : నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటలో 2001-02 సం||లో ఇంజనీరింగ్‌ కాలేజి ప్రారంభించారు. 2005-06లో నెల్లూరు పట్టణ పరిధిలో మరొక ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. ఇక్కడ యం.సి.ఏ., యం.బి.ఏ. కోర్సులు కూడ వున్నాయి. సూళ్ళూరుపేటలో ఇంజ నీరింగ్‌ కోర్సులోని పలు బ్రాంచీలను ఏర్పాటు చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు

నెల్లూరు అధికార పార్టీలో రాజకీయ పోరు ఆనం – మంత్రి అనిల్‌ మధ్య ఆధిపత్యపోరు వి.ఆర్‌.విద్యాసంస్థలే వేదిక రాజకీయాలకు రాజధాని నెల్లూరులో ఇప్పుడు సరికొత్త రాజకీయ అంతర్యుద్ధం మొదలైంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు మరో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య తాజా వార్‌ మొదలైంది.ఇందుకు వి.ఆర్‌.విద్యా సంస్థలు వేదికయ్యాయి. గత రెండేళ్లుగా వి.ఆర్‌.విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ఆనం పెత్తనం పై అత్యున్నత ధర్మాసనం వరకు వెళ్ళి విజయం సాధించారు. వి.ఆర్‌.విద్యాసంస్థలకు పాత పాలక వర్గాన్ని రద్దు చేసింది కోర్టు. జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. వి.ఆర్‌. విద్యా సంస్థల నూతన యాజమాన్యం కోసం ఎన్నికలు జరపాలని గత ఏడాది క్రితం సుప్రీం కోర్ట ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కసరత్తు మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వి.ఆర్‌.కళాశాల నూతన పాలక వర్గం కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు ఓటర్లుగా సభ్యత్వాలకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే సమయంలో జిల్లా అధికారులు పదే పదే మారడం, ఎన్నికల క్రతువు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వి.ఆర్‌. విద్యాసంస్థల ఆర్థిక వ్యవహారాలు, కళాశాల పురోభివృద్ధికి అవాంతరాలు మొదలయ్యాయి. దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆనం కుటుంబం వి.ఆర్‌.విద్యాసంస్థల పై పెత్తనం చేస్తోంది. సుదీర్ఘ 144 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల విద్యాసౌధానికి ఆనం కుటుంబమే యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తోంది. ఒకప్పటి ఆనం భక్తవత్సల రెడ్డి నుంచి ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కళాశాల కార్యనిర్వాహకులుగా కొనసాగుతూ వున్నారు. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న రామనారాయణరెడ్డి, అంతకుముందున్న ఆనం కుటుంబీకుల మొత్తం పెత్తనం ఆపివేయాలంటూ ఆనం వ్యతిరేక వర్గం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. తాజాగా వి.ఆర్‌.విద్యాసంస్థల నిర్వహణ పై రూరల్‌ ఎమ్మెల్యేతో పాటు మంత్రి అనిల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి కళాశాలను పరిశీలించారు. పాలనా తీరును అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. వి.ఆర్‌. విద్యాసంస్థలకు పూర్వవైభవం తెస్తాం. ఇందులో ఎవరి ప్రమేయాలు ఉండబోవు. ఎవరికి భయపడాల్సిన పనిలేదు అంటూ పరోక్షంగా మాజీ పాలక వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానాలను చేశారు. మరోవైపు వి.ఆర్‌.విద్యాసంస్థల పై ఇప్పటి వరకు ఉన్న పెత్తనాలను సహించం. కొత్త యాజమాన్యంతో కళాశాలను అభివృద్ధి చేస్తాం.. ఇప్పుడివి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వి.ఆర్‌.విద్యాసంస్థలు వేదికగా ఆనం వర్సెస్‌ మంత్రి అనిల్‌ అన్నట్లుగా ఉన్నాయి తాజా పరిణామాలు. వి.ఆర్‌.కళాశాల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి అనిల్‌ తనదైన స్టైల్‌లో పరోక్షంగా ఆనంకు వ్యతిరేకంగా మాట్లాడారు. పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వి.ఆర్‌.కళాశాల మైదానాన్ని ఇకపై రాజకీయ పార్టీలకు వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కళాశాల నిర్వాహకులకు నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చారు. ఎవరి పెత్తనాన్ని సహించం. విద్యాశాఖ మంత్రి ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఆనంకు వ్యతిరేక ధోరణిలోనే సాగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు వి.ఆర్‌.విద్యాసంస్థలు మరోసారి అధికార వైసీపీలో ఆధిపత్య రాజకీయాలకు తెరలేపాయి.

Featured ఆంధ్రప్రదేశ్

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు రంగనాథస్వామి(పల్లికొండ నాథుడు) దేవాలయం : దేశంలోని ప్రముఖ దేవాలయాలు నదీమ తల్లుల ఒడ్డున వెలసివున్నాయి. అలాగే నెల్లూరు లోని రంగనాథ స్వామి (రంగపెరుమాళ్‌) దేవాలయం పెన్నానది ఒడ్డున వుంది. ఇది అతి ప్రాచీనమైన వైష్ణవాలయం. నెల్లూరు కాపులు (ఇక్కడ రెడ్లను కాపులంటారు) ఏడవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినది. దాదాపు వెయ్యి సంవత్సరాలక్రితం నిర్మి తమైనట్లు తెలుస్తుంది. సోమశిల నిర్మాణం కాకముందు పెన్నకు వరదలు వచ్చిన పుడు దేవాలయంలోకి నీరు వచ్చేది. ఏడు అంతస్తులతో 29 మీటర్ల ఎత్తు గలిగిన గాలిగోపురం భక్తకోటిని ఆకర్షిస్తుంది. ఈ గాలి గోపురాన్ని 1859 ప్రాంతంలో మహాభక్తులు యరగుడిపాటి వెంకటాచలం పంతులు నిర్మించారు. ఈ గాలి గోపురం మధుర, చిదంబరం, కంచి వంటి తమిళనాడు దేవాలయాలను తలపిస్తుంది. ఇక్కడ రంగనాథస్వామి వారు తలక్రింద కుంచం పెట్టుకొని శయనించి వుంటారు. కనుక తల్పగిరి రంగనాధస్వామిగా ప్రసిద్ధి చెందారు. భూదేవి, శ్రీదేవి స్వామివారి పాదాలొత్తుతూ వుంటారు. నెల్లూరు సీమ వరి పంటకు ప్రసిద్ధి చెందింది. పండిన ధాన్యాన్ని కొలిచి, కొలిచి కలిగిన శ్రమవల్ల సేదతీరుతున్నారని చెపుతారు. దేవాలయ ప్రాంగణములో 1928లో భక్తుడు ముప్పిరాల చినవెంకట నరసింహాచార్యులు నిర్మించిన అద్దాల మంటపం చూపరుల నాకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలలలో తిరునాళ్లు వైభవంగా జరుగుతుంది. గరుడసేవ, రథోత్సవం రోజున భక్తులు క్రిక్కిరిసి వుంటారు. రంగనాధ స్వామి ఆలయం వుండే ప్రాంతాన్ని రంగనాయకులపేట అని, గోపురానికి ఎదురుగా వున్న వీధిని గోపురంవీధి అని పిలుస్తారు. మూలస్థానేశ్వరస్వామి దేవాలయం : నెల్లూరు మూలాపేటలో ఈశ్వరాలయం వుంది. ఇది ప్రాచీన దేవాలయం. దీన్ని మూలస్థానేశ్వర దేవాలయం అంటారు. ఉసిరిక చెట్టు క్రింద స్వయంభువుగా శివలింగం కనిపిస్తే అక్కడ శివాలయం నిర్మించా రని చెపుతారు. ఇందులో వేణు గోపాలస్వామి విగ్రహం కూడ వుండడం విశేషం. మూల స్థానేశ్వరుడు పేరు మీదుగానే ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. నిత్యం భక్తులు వస్తుంటారు. శివరాత్రి ఘనంగా జరుగుతుంది. దీని సమీపంలో వేణుగోపాలస్వామి దేవాలయం వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయం కూడా వుంది. ఈ రెండు దేవాలయాలలో పెళ్ళిళ్లు జరుగుతుంటాయి. నెల్లూరు సీమవారు పెళ్ళి లగ్నం కుదరగానే దేవాలయ ప్రాంగణాన్ని రిజర్వు చేసుకుంటారు. కళ్యాణ వేదికంటూ వుండాల్సిన అవసరం లేదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వధూవరులను కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు జరుపుతుంటారు. ఇక్కడ పెళ్ళి జరిగితే అంతా శుభమే జరుగుతుందని ఈ సీమ ప్రజల పరిపూర్ణ విశ్వాసం. కన్యకా పరమేశ్వరి దేవాలయం : నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో కన్యకా పరమేశ్వరి ఆలయం వుంది. ఆర్య వైశ్యులు పరమేశ్వరి అమ్మవారిని తమ కుల దేవతగా ఆరాధిస్తారు. భక్తుల విరాళాలతో దేవాలయం నిర్మించారు. దేవీ శరన్నవరాత్రి వుత్సవాలను చాల వేడుకగా నిర్వహిస్తారు. పెళ్ళి కాని యువతీ యువకులు ఇక్కడ దేవాలయంలో ‘వరమాల’ కట్టి పూజలు చేస్తారు. ఈ విధంగా చేస్తే త్వరగా వివాహం నిశ్చయవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయస్వామి గుడి : నెల్లూరు నగరానికి నడిబొడ్డున రాయాజీవీధిలో ఆంజనేయస్వామి దేవాలయం వుంది. నిత్యం స్వామి వారిని భక్తులు దర్శించుకొంటారు. పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఇస్కాన్‌ మందిరం (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) : శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచ సమాజానికి తెలియపరచి ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించడానికి దేశ విదేశాలలో కృష్ణ మందిరాలు నెలకొల్పారు. స్థానికంగా నెల్లూరులో కొండాయపాళెం రోడ్డు ప్రాంతంలో రాథాకృష్ణ మందిరం 1996లో నిర్మించారు. వీరి ఆధ్వర్యంలో 2012 నుండి ఏటా జనవరిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయిబాబా గుడి : నెల్లూరులో సాయిబాబా మందిరాలు చాలానే వున్నాయి. మొదటిదిగా డాక్టరు రాజగోపాలాచార్లు రాయాజీ వీధిలో చిన్నగుడి నెలకొల్పి రేబాల లక్ష్మీనరసారెడ్డి ఆర్ధిక సహకారంతో నిర్వహించారు. నెల్లూరు ప్రజలకు ‘సాయిబాబా’ ఎవరో తెలియని రోజుల్లో సాయిభజనలు ప్రారంభించి, సాయి ఎఱుక కలిగించారు. రోగులకు వైద్యంతో పాటు విభూతి ఇచ్చేవారు. అటు తర్వాత కోఆపరేటివ్‌ బ్యాంకు సమీపంలోని బాబా గుడి నిర్మింపబడింది. 1956లో నిర్మాణం మొదలుపెట్టి 1958 అక్టోబరు నెలలో విజయదశమి రోజున మందిరం ప్రారంభమైంది. భక్తులతో నిత్యం రద్దీగా వుంటుంది. నెల్లూరు నడిబొడ్డున మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహనీయులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వ డానికి, భక్తులు కూర్చోడానికి అనువుగా పైఅంతస్తు నిర్మాణం జరిగింది. పిల్లలపార్కు సమీ పంలోని సాయిసదన్‌, పద్మావతి నగర్‌లోని సాయిదర్బార్‌ అద్దాల మందిరం, మినీబైపాస్‌ రోడ్డులో జేమ్స్‌గార్డెన్‌ ప్రాంతంలోగల సాయిబాబా మందిరం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని సాయిబాబా దేవాలయం ప్రసిద్ధమైనవి. పొదలకూరు, గూడూరు పట్టణాలలోను ఆధ్యాత్మికత పరిఢవిల్లే సాయిబాబా మందిరాలు నిర్మితమై వున్నాయి. సత్యసాయిబాబా మందిరం : నెల్లూరులో రామమూర్తినగర్‌ ప్రాంతంలో సత్యసాయి భజన మందిరం నిర్మితమైంది. బాబా జన్మదినం తదితర వేడుకలు ఘనంగా జరుపుతారు. ప్రతి గురువారం భజన కార్యక్రమాలు వుంటాయి. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం : నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ప్రధాన రహదారి ప్రక్కనే వున్న అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకతో జరుగుతాయి. విద్యుద్దీపాలతో మెరిసిపోతుంది. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి 1968లో కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారిచే శంకుస్థాపన జరిగింది. 1975లో జయేంద్ర సరస్వతి స్వాములవారు, శృంగేరీ పుష్పగిరి పీఠాధిపతి స్వాముల వారి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నేడు అత్యంత వైభవోపేతమైన దేవాలయంగా వెలుగుతుంది. దేవాలయానికి అనుబంధంగా వున్న కల్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలు జరుపు కొంటారు. ఆలయాన్ని స్వర్గీయ రత్నసాయి మొదలియార్‌ నిర్మించారు. వీరు తమిళనాడు నుండి వచ్చి నెల్లూరులో స్థిరపడినవారు. అయ్యప్ప స్వామి గుడి : నెల్లూరులో వేదాయపాళెం సమీపంలో వున్న దేవాలయం. 1987లో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రజలు అపార విశ్వా సంతో వుంటారు. భక్తులు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల ధరిస్తారు. నల్ల బట్టలు ధరించి చాల నియమ నిష్ఠలతో వుంటారు. 41 రోజుల దీక్ష చేస్తారు. కేరళలోని శబరిమలకు వెళ్ళే భక్తులకు గుడి యాజమాన్యం వారు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. డిసెంబరు, జనవరి మాసాలలో స్వామివారి గుడిని విద్యుద్దీపాలతో వైభవంగా అలంకరిస్తారు. శబరిమల వెళ్లే భక్తులు నవంబరు నెల మధ్య నుండి ప్రయాణ సన్నాహాలలో వుంటారు. భగవాన్‌ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి మందిరం : నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో నాగులవెల్లటూరు గ్రామంలో జన్మించిన వెంకయ్య స్వామి 1982 ఆగష్టు 24న గొలగమూడిలో మహాసమాధి చెందారు. అక్కడ మందిర నిర్మాణం జరిగింది. ఇది నెల్లూరుకు 15 కి.మీ. దూరంలో వెంకటాచలం మండలంలో వుంది. వీరు భగవాన్‌ వెంకయ్యస్వామిగా, అవధూతగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజ మాష్టారు, మాకాని వెంకట్రావు వంటి మహనీయులు వెంకయ్యస్వామిని భగవత్‌ స్వరూపులుగా భావించి ఆరాధించారు. వెంకయ్యస్వామి ఈతాకు చాపమీద కూర్చొని, శరీరంపై కౌపీనం (గోచిగుడ్డ) తప్ప మరే ఆచ్ఛాదన లేకుండా తంబూర వాయించుకొంటూ కాలం గడిపే వారు. ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి. ఆపదలో వున్న వారిని ఆదుకోండి. ‘పావలా దొంగలిస్తే పది రూపా యలు పోతాయి’ అని చెప్పేవారు. ఈ మాటల ద్వారా ఆర్తులకు సహా యపడమని, అన్యాయార్జితం కూడదని, ఇతరుల సొత్తు నాశించరాదని యుగాలకు సరిపోయే సందేశమిచ్చారు. నేడు ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఆశ్రమపాఠశాల స్థాపించారు. వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన యాత్రా స్థలంగా పేరుపొందింది. ఏటా ఆగష్టు నెలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి. గాలిపాలెం చిన వెంకయ్యస్వామి : చేజర్ల మండలంలోని గాలిపాలెం ప్రాంతం 1987కు ముందు దాదాపు జనసంచారం లేని ప్రదేశం. అక్కడ శ్రీహరి అనే పశువుల కాపరి ఒక పాకలో శ్రీశ్రీశ్రీ భగవాన్‌ వెంకయ్యస్వామి పటాన్ని పెట్టుకొని పూజ చేసేవారు. కొద్ది కాలానికి ఒక చిన్న ఆశ్రమం ఏర్పడింది. గ్రామస్తులు రావడం, ప్రార్థించినవారి కోర్కెలు తీరుతుండడంతో ఆశ్రమ ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న భక్తుల విరాళాలతో క్రమంగా తొమ్మిది ఆలయాల సముదాయం ఏర్పడింది. నేడు ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరు పొందింది. భగవాన్‌ వెంకయ్యస్వామివారి పీఠం ఏర్పరచి ‘ఆకలైన వారికి అన్నం పెట్టండి’ అనే సూక్తిని ఇక్కడ ఆచరణలో పెడుతున్నారు. ఆలయ ప్రాంతమంతా ‘ఓం నారాయణ, ఆదినారాయణ’ మంత్రంతో మారుమ్రోగు తుంటుంది. ఏటా మూడు రోజులు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీహరి చిన వెంకయ్యస్వామివారికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం : దక్షిణ భారత దేశంలో కంచి కామాక్షి దేవాలయం ప్రసిద్ధి చెందినది. జొన్నవాడను రెండవ కాంచీపురంగా పిలు స్తారు. ఇది నెల్లూరుకు 12 కి.మీ. దూరంలో వుంది. కామాక్షి అమ్మవారుగా ప్రసిద్ధి చెందింది. బుచ్చిరెడ్డిపాళెంకు దగ్గరగా పెన్న ఉత్తరతీరాన ఈ పుణ్యక్షేత్రంలో మల్లికార్జునుడు (ఈశ్వరుడు), కామాక్షి అమ్మవారు (పార్వతీ దేవి) కొలువై వున్నారు. శ్రీశైలక్షేత్రంతో సమానంగా వెలుగుతోంది. నిత్యం భక్తులతో ప్రత్యేకించి మహిళా భక్తులతో నిండి వుంటుంది. గ్రహపీడి తులకు స్వాంతన చేకూర్చే సన్నిధిగా పేరుంది. భక్తుల కోరికలు తీరుతుంటాయని, సంతానం కలగాలని అమ్మవారికి మొక్కుకుంటారు. ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెంచలకోన : రాపూరు మండలంలో అడవి ప్రాంతంలో గోనుపల్లి గ్రామం దగ్గరగా దేవాలయం వుంది. పెనుశిల నరసింహ స్వామి దేవాలయం క్రమంగా పెంచలకోనగా మారింది. ఎ.సి.సుబ్బారెడ్డి మంత్రిగా వున్న సమయంలో ఆలయ అభివృద్ధి, రోడ్డు నిర్మాణం, సింహద్వార స్థాపన, నిత్యపూజ ఏర్పాట్లు జరిగాయి. హిరణ్యకశిపుడనేరాక్షస రాజును మహావిష్ణువు ఉగ్ర నరసింహావతార మెత్తి సంహరిస్తాడు. తర్వాత కూడ ఉగ్రరూపం చల్లారదు. చెంచులక్ష్మి రూపంలో వున్న ఆదిలక్ష్మితో చెలిమి తర్వాత ఉగ్రరూపం చాలిస్తాడు. భక్తుల కోరిక మేరకు పెంచలకోనలో స్వయంభువుగా స్వామివారు వెలిశారని స్థలపురాణం చెపుతోంది. నృసింహ జయంతి పండుగ ఘనంగా జరుపుతారు. నెల్లూరుకు పెంచలకోన 80 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రాంత వాసులు స్వామివారి పేరుతో పెంచలయ్య, పెంచలమ్మ, పెంచల నరసింహ, పెంచలలక్ష్మి అనే పేర్లు పెట్టుకొంటారు. పెంచలకోన వెళ్లినవారు అక్కడ వేంచేసి వున్న కరుణామయి విజయేశ్వరి దేవి

Featured ఆంధ్రప్రదేశ్

ఆ…నాటి నెల్లూరు మహనీయులు

ఆ…నాటి నెల్లూరు మహనీయులు పొట్టి శ్రీరాములు – రాష్ట్ర సాధన గాంధేయవాదాన్ని ఆయుధంగా చేసుకొని ప్రత్యేకరాష్ట్రం కొరకు నిరసన దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు. వీరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు జన్మించింది మద్రాసులో అయినా, స్వగ్రామము బోగోలు మండలంలోని జువ్వల దిన్నె. పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. శానిటరి ఇంజనీరింగ్‌ చదివి రైల్వేలో ఉద్యోగం పొంది స్థిర పడుతున్న రోజులలో భార్యావియోగం కలిగింది. పురిటిబిడ్డ కూడ మరణించింది. విధి వంచితుడైన శ్రీరాములు విరక్తి, వైరాగ్యాలకు లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. వేదాంత ధోరణి వచ్చింది. స్వభావరీత్యా ఆయనలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష సడలలేదు. గాంధీజీ ప్రబోధాలకు ఉత్తేజితులయి వార్ధాలోని ఆశ్రమాన్ని దర్శించి అందులో చేరిపోయారు. గాంధీజీ నుండి నేర్చుకొన్నవే ఖద్దరుధారణ, హరిజనోద్ధరణ, హరిజన దేవాలయ ప్రవేశం కొరకు కృషి, అస్పృశ్యతా నివారణ, స్వాతంత్య్ర సాధనకు అహింసా పోరాటం, ఉప్పు సత్యాగ్రహం మొదలయినవి. 18 నెలల జైలు జీవితం అను భవించారు. గాంధీజీ భావాలు శ్రీరాములుకు బాగా వంట బట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించేవారు. ఏపని చేపట్టినా దానిని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు. హరిజన దేవాలయ ప్రవేశం కొరకు నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దీక్ష చేపట్టారు. 23 రోజుల తర్వాత దేవాలయ మేనేజ్‌ మెంట్‌ దిగివచ్చి హరిజనులకు ప్రవేశం కల్పించింది. మొదట పట్టించుకోక పోయినా అప్పటి మద్రాసు ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు పేరు వింటేనే దీక్షలు గుర్తుకొచ్చే విధంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అప్పట్లో ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. తమిళులు తెలుగువారిపై చిన్నచూపు చూసేవారు. ఆంధ్రప్రాంతం విడివడాలని కొంతకాలం నుండి ఉద్యమాలు సాగుతుండేవి. అది తీవ్రమై రాష్ట్రసాధన కొరకు దీక్షచేపట్టడానికి శ్రీరాములు సిద్ధపడ్డారు. మద్రాసు నగరం నడిబొడ్డున తెలుగువాడైన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో శ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు. 58రోజులు నిరాహారదీక్షచేసి 1952 డిసెంబరు 15న శ్రీరాములు మరణించడంతో రాష్ట్రం అగ్నిగుండమైంది. అల్లర్లు వ్యాపించాయి. కాల్పులు జరిగాయి. నెల్లూరులో నలుగురు అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత తెలిపారు. పొణకా కనకమ్మ (1892-1963) జిల్లాలో స్త్రీ విద్యకు నాంది పొణకా కనకమ్మ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తొలి తరం మహిళ. ఆమె రెండు సార్లు ఏడాదిన్నర పాటు కఠిన కారాగార శిక్ష అను భవించారు. పోట్లపూడిలో సుజన రంజని సమాజం స్థాపించారు. వివేకానంద గ్రంధాలయం నెలకొల్పారు. కనకమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయకురాలు, వక్త, విప్లవకారిణి, కారుణ్యమూర్తి, రచయిత్రి, రమణాశ్రమంలో వున్న రోజుల్లో ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి రమణ మహర్షిని కీర్తిస్తూ ‘ఆరాధన’, ‘నైవేద్యం’ రచనలు చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను ‘జ్ఞాన నేత్రం’ పేరుతో అనువదించారు. మదరాసులోని ఆంధ్ర మహిళా సభ రజతోత్సవాలలో శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారి నుండి కనకమ్మ సన్మానం అందుకున్నారు. ”ఆడపిల్లలకు చదువెందుకు?” అనే అభిప్రాయం నెలకొని ఉన్న రోజులవి. పొణకా కనకమ్మ 1923లో కస్తూరిదేవి బాలికల విద్యాలయం స్థాపించారు. అప్పట్లో అదొక సాహసోపేత నిర్ణయం. భూస్వామ్య కుటుంబం నుండి మహిళ గడపదాటి రావడమే సంచలనం. ఆమె సత్యాగ్రహం చేసి జైలు కెళ్ళింది. వెంకటగిరి జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసింది. తన యావదాస్తిని జాతీయోద్యమానికి, హరిజనోద్ధరణకు, మహిళాభ్యుదయానికి త్యాగం చేసింది. గాంధీజీ వచ్చినప్పుడు ఒంటిమీద నగలన్నీ విరాళంగా ఇచ్చివారి చేత కస్తూరిదేవి విద్యాలయ భవనాలకు 1929లో శంకుస్థాపన చేయించింది. ఆమె కోరిక మేరకు పల్లెపాడులో పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని గాంధీజీ 1921లో ప్రారంభించారు. దానికవసరమైన 13 ఎకరాల స్థలాన్ని కనకమ్మ కొని ఇచ్చారు. దీనికి ‘దక్షిణాది సబర్మతి’ ఆశ్రమంగా పేరుంది (పల్లెపాడు ఇందుకూరుపేట మండలంలోని గ్రామం). కనకమ్మ వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. విధి వంచితలైన స్త్రీల అభ్యున్నతికొరకు 1952లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మరుపూరివారి ఇంట పుట్టింది – పొణకా వారి ఇంటి కోడలుగా వచ్చింది. రెండు కుటుంబాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారు’ అని చెప్పిన గురజాడవారి మాటలను కనకమ్మ నిరూపించింది. ఆమె తమ్ముడు మరుపూరు కోదండరామిరెడ్డి ‘మందాకిని’ పత్రిక నడిపిన ప్రముఖ సాహితీవేత్త. కనకమ్మ మరణించి (1963) అర్ధశతాబ్దం దాటుతున్నా నెల్లూరు నగరంలోగాని, కస్తూరిదేవి విద్యాలయంలో గాని ఆమె విగ్రహప్రతిష్ఠ నేటికీ జరగకపోవడం విచారకరం.ఆమె స్థాపించిన విద్యాలయం, పల్లెపాడు ఆశ్రమం, నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. నేడు ఈ ప్రాంతపు ఆడపిల్లలు చదువుల్లో ముందడుగులో ఉండడానికి కారణం ఆనాడు కనకమ్మ వేసిన పునాది. స్త్రీల ప్రగతికి విద్య మౌలికావసరంగా ఆమె ఆ రోజుల్లోనే గుర్తించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనర్సారెడ్డి నెల్లూరు నడిబొడ్డున ట్రంకురోడ్డు ప్రక్కన సువిశాలమైన స్థలంలో నెల్లూరు పురమందిర నిర్మాణం జరిగింది. టౌన్‌హాలుగా పేరొందిన దీనిని నిర్మించిన ఉదారుడు రావుబహద్దూరు రేబాల లక్ష్మీనరసారెడ్డి. 1915లో భవనం నిర్మిం చినప్పటి నుండి ఇక్కడ సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పట్టణానికిది తలమానికంగా ఉంది. దీన్ని తెలియని వారుండరు. అంతగా ప్రఖ్యాతి వహించింది. వర్ధమాన సమాజం ఆఫీసు, పఠన మందిరం ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఇప్పుడా పురమందిరం స్థలం కోట్లకుకోట్లు విలువ చేస్తుంది. రేబాల కుటుంబీకులు దాతృత్వం కలిగిన వారు. దానగుణం వారికి వంశ పారంపర్యంగా వచ్చింది. రేబాల పట్టాభిరామరెడ్డి వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. వారి స్మృతి చిహ్నంగా వారి ధర్మపత్ని సుజాతమ్మ పురమందిర ప్రాంగణంలో విశాలమైన పఠన మందిరాన్ని నిర్మించారు. వారి సోదరుడు రేబాల లక్ష్మీనరసారెడ్డి 1943-47లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా, 1957-62లో నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వున్నారు. దాదాపు 35 సంవత్సరాలపాటు వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. స్టోన్‌హస్‌పేటలోని రేబాల వారివీధిలోని తమ నివాస భవనాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి కిచ్చారు. దాని ప్రక్కనే వున్న మరొక భవనాన్ని పట్టాభిరామిరెడ్డి ధర్మ పత్ని సుజాతమ్మ జిల్లా గ్రంథాలయానికిచ్చారు. నెల్లూరు చరిత్రలో వారి కీర్తి చిరస్థాయిగా నిలి చిపోయింది.

Featured ఆంధ్రప్రదేశ్

రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు

రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును పరిశీలించిన కలెక్టర్‌ శేషగిరి బాబూ. నెల్లూరు, అక్టోబర్‌ 26 (పున్నమి విలేకరి) : నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వీ శేషాగిరి బాబు ఆదేశించారు. కలెక్టర్‌ శుక్రవారం నగరంలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తనిఖీ చేశారు. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసారు. ముందుగా ఆత్మకూరు బస్టాండ్‌ ప్లైఓవర్‌ను పరిశీలించి చాలా చోట్ల దెబ్బతిన్న వంతెనను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనం రద్దీ, వాహన రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు చోట్ల మరమ్మతులు చేయించాలన్నారు. ఏస్‌.మోహన్‌, కార్పొరేషన్‌ ఎస్‌.ఈ. హిమయుద్దీన్‌, ఏఈలు మహేష్‌, సంజయ్‌, జానీ తదితరులు కలెక్టర్‌తో పాటు ఉన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అభిమానం అక్షర సాక్షిగా తరుమారైంది…

అభిమానం అక్షర సాక్షిగా తరుమారైంది… నేతల హోదాలు మారిపోయాయి… రెట్టించిన అభిమానంతో… నెల్లూరు, అక్టోబర్‌ 26 (పున్నమి విలేకరి) : అభిమాన నాయకులు.. అధినేతలు వస్తున్నారంటే క్యాడర్‌ లో ఉత్సవాహం ఉరకలేస్తుంది.ముఖ్యంగా సినీ రాజకీయ నేతల అనుచరుల్లో ఇది మరీ ఎక్కువ….ఒక్కోసారి మితిమీరిన అభిమానం. అతిధులు… అధినాయకులకు…అభిమాన నేతలను చాలా ఇబ్బందులు తెస్తుంది….. అలాంటిదే నెల్లూరులో ఓ పోస్టర్‌ లో బయటపడింది… నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌,ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వై సుజనా చౌదరి నెల్లూరు రానున్నారని ఆ పార్టీ నాయకులు బ్యానర్లు, పోస్టర్లు,ఫ్లెక్సీలు వేశారు.. అందులోను నెల్లూరులో సత్యకుమార్‌ కి నెల్లూరు నేతలు చిరకాల అనుబంధం ఉంది.. సత్యకుమార్‌ గతంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు… దీంతో సత్యకుమార్‌ కి స్వతహాగా నెల్లూరు బీజేపీ, సంఘ్‌ నేతలతో పేర్లతో పిలవగలిగే పరిచయాలు ఉన్నాయి.. ఇటీవల వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక అప్పటి నాయుడు గారి టీమ్‌ అంతా ఇప్పుడు సత్యకుమార్‌ తో ఉంటోంది.. ఒకరకంగా చెప్పాలంటే నాయుడు ఫాలోయర్లందరూ ఇప్పుడు సత్య వెంట ఉన్నారు.. అలాంటి అనుబంధముంటే నెల్లూరోళ్ళ హంగామా గురించి చెప్పాలనా… పావలాకి రూపాయి బిల్డప్‌ …సత్యాపై ఉన్న అభిమానంతో… నగరంలోని విఆర్సీ సెంటర్లో నెల్లూరు క్లబ్‌ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షులు సురేందర్‌ రెడ్డి పేరుతో అభిమానులు ఒక ఫ్లెక్సీ కట్టారు..అందులో ఫ్లెక్సీ నిర్వాహకుల పొరపాటో.. మరి ఉత్సాహమో..తెలియదుగానీ….బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ని ఎంపీ గానూ… ఎంపీ సుజనా చౌదరిని బీజేపీ జాతీయ కార్యదర్శి గానూ గౌరవించారు… ఫ్లెక్సీలో..ఆ ఫ్లెక్సీ నిత్యం రద్దీగా ఉండే విఆర్సీ సెంటర్‌ కావడంతో అది కాస్తా సోషల్‌ మీడియాకెక్కి హడావుడి చేస్తోంది… అందుకే ప్లెక్సీ లైన.. పోస్టర్‌ లైన ఒకసారి చెక్‌ చేసుకోవాలి.. మరీ..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.