Featured
ఆంధ్రప్రదేశ్
జాతీయ అంతర్జాతీయ
ఓ మధ్యతరగతికి చెందిన కుటుంబం హడావుడిగా పిల్లవాడిని లాక్కుంటూ కూతవేస్తున్న ట్రైన్లోకి ఎక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం జరిగింది. బోగీలో సందడిగా ఉన్నప్పటికి పిల్లవాడు మాత్రం వాటిని పట్టించుకోకుండా కిటికీవైపుకి చేరిపోయాడు. ఎప్పుడూ ఓజిలి గ్రామంలోని పీతిరి గుంటలు, మట్టిగోడలు, గబ్బుకొట్టే కోట శిధిలాలు ఇదే మన పూర్వీకుల ఆనవాళ్లు అని చూపించే అమ్మమ్మ మొదటిసారి నాన్నగారి వూరికి తీసుకువెళుతుండటంతో, ఆ కుటుంబానికి చెందిన పిల్లవాడు చాలా కుతూహలంగా ఉన్నాడు. ట్రైను గూడూరు నుండి బయలుదేరి తిరుపతి వైపు వెళ్లడం సాగింది. కిటికీలోనుంచి చూస్తుంటే భూమి గుండ్రంగా తిరుగుతూ, చెట్టు పుట్ట తనను చూసి పలకరిస్తున్నట్టు ఆ పిల్లవాడు తన మొదటిసారి ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాము చేరవలసిన గమ్యానికి వచ్చిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు రైలు దిగి స్టేషన్ బయట ఆగి ఉన్న జట్కా బండి ఎక్కారు. జట్కాబండి ప్రయాణం రైలు ప్రయాణం కంటే హాయిగా ఉన్నట్టు పిల్లవాడు తెగ ఆనందపడిపోతున్నాడు. ఎదురుగా ఆకాశాన్నంటే కొండలు, చుట్టూ పచ్చదనం, పాత పెంకుటిల్లులు, విశాల ప్రార్ధనాలయాలు, పెద్ద పెద్ద కోటలు, ఇవన్నీచూస్తుంటే పిల్లవాడికి అమ్మమ్మ చెప్పిన రాజు కథల్లో లాంటి వాతావరణ ఇక్కడ కనిపిస్తుంటే, ఎదో ఇంకొక దేశంలో ఉన్నట్టు ఆ పిల్లవాడు సంబరపడిపోసాగాడు. అక్కడి మనుషుల తీరు, ఆప్యాయత, కలుపుగోలుతనం, భారతదేశమంటే ఇదేనేమో నన్న భావన ఆ చిన్నవాడిలో బలంగా నాటుకుపోయింది. అది మొదలు పదేపదే ఆ వూరికి వెళ్లిన, తరువాత కొంతకాలం అక్కడే స్థిరపడిన, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు చూసిన ఆ సుమధుర దృశ్యకావ్యం తన స్మృతిపధంలో చెరపలేని ముద్రవేసింది. చిన్నపిల్లాడిగా ఈ వ్యాస రచయితకు అక్కడ అడుగుపెట్టినప్పుడు కలిగిన అనుభూతి అత్తరు సువాసనల వలె శరీరంలో ఇంకిపోయింది. తర్వాత ఎందరో ఈ పెక్యులియర్ ప్రాంతానికి వచ్చి తామనుభవించిన అనుభూతుల సజీవ సాక్ష్యాలకు అక్షర రూపమివ్వడం జరిగింది. ఆ ప్రాంతం మరేదోకాదు, ఆతిథ్యసత్కారాలకు, వైభవాలకు నెలవైన వెంకటగిరి గడ్డ అది. మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పడక ముందే దక్షిణభారతంలో దేదీప్యమానంగా ఓ వెలుగు వెలిగిన వేంకటగిరి ప్రాంతమది, వెలమల కంచుకోటగా, సువిశాల భూభాగంతో ఎనలేని సంపదతో అలరాలిన వెలుగోటి వారి స్థావరంగా, కాలక్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి నేటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్న ప్రాచీన రాచరిక వైభవం వెంకటగిరి సొంతం. ఈ వ్యాస రచయితే కాదు ఎందరో మహానుభావులు, కవులు, రాజులు, దేశ విదేశీయులు, అధికారులు, ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ వెంకటగిరి ఆతిధ్యాన్ని పొందినవారే. ఇలాంటి సహజ నేపథ్యం కలిగిన వెంకటగిరికి 1888 లో సందర్శించిన లార్డ్ కన్నెమెరా, వెంకటగిరి వైభవాన్నిచూసి “ వెంకటగిరి ప్రాంతం బ్రిటీషువారి అధీనంలో ఉందా, బ్రిటిషువారే వెలుగోటివారి పాలనలో ఉన్నారా “ అని ఆశ్యర్యానికి గురవుతాడు. అక్కడి స్వాగత సత్కారాలకు ముగ్ధుడైన లార్డ్ కన్నెమెరా వ్యక్తిగత సహాయకుడు రీస్ తన వెంకటగిరి అనుభవాలను ఇంగ్లాండ్ పత్రిక అయిన ది మార్నింగ్ పోస్ట్ లో రాయడం జరిగింది. ఇతర విదేశీ పత్రికలు సైతం వారి అనుభవాల్ని వెంకటగిరి ప్రాంత వైభవాన్ని విశేషంగా ప్రచురించాయి. కన్నెమెరా బృందం యొక్క భారతదేశ పర్యటనలో భాగంగా 1888, నవంబర్ 13 వ తేదీన నెల్లూరు నుంచి ప్రత్యేక రైలులో వెంకటగిరిలో దిగిన బ్రిటిషువారికి అఖండ స్వాగతం లభించింది. రీస్ మాటలలో….. మొదటగా ఎత్తయిన కోటల్లాంటి అంబారీలతో ఏనుగులు, చుట్టూ ప్రజలతో రద్దీగా ఉన్న వీధుల గుండా నెమ్మదిగా ఊరేగింపుగా కదిలాయి, అంబారీలన్నీ ఒకే స్థాయిలో ఉన్నాయి. ఇళ్ళ పై అంతస్తులన్నితెలుపు మరియు రంగురంగుల వస్త్రాలు ధరించిన వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. గుర్రాలపై స్వాగత బ్యానర్లు మోస్తు కొందరు వూరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. వారి తరువాత నీలం తెలుపు రంగుల యూనిఫాం ధరించిన అశ్వికదళ బృందం, తరువాత అందమైన అమ్మాయిలు నృత్యం చేస్తూ సిగలో మల్లెల వాసనతో, బంగారపు వస్త్రాలతో మెరిసిపోతూ నృత్యం చేయసాగారు. వెనుకనే జాపత్రి మోసుకొంటూ కొందరు, ఈటెల ధారణతో మరి కొందరు, దివిటీలు చేతపట్టుకొని గుర్రాలపై వరుసగా వస్తున్నారు. గుర్రాలన్ని బంగారు వస్త్రాలతో మెరిసిపోతున్నాయి. వీటితోపాటు కొన్ని బంగారు మరియు వెండి పల్లకీలు మోస్తూ వెంట వస్తున్నాయి. సంగీతకారుల బృందం ఒంటెలపై డ్రమ్స్ వాయిస్తు, మెరిసే స్టార్లైట్ కింద ఆడుతుండగా, ఆ ప్రాంతమంతా తాళాలు తప్పెట్లతో మారుమోగాయి. పొడుగాటి ఇత్తడి కొమ్ముల ధ్వని ఘీంకారాలతో, బాకాల గర్జనలతో వీధులన్నీదద్దరిల్లాయి, అపారమైన పొడవు, పరిమాణం కలిగిన బాకాలు జెరిఖో (పాలస్తీనాలోని పురాతన పట్టణం) గోడలతో పోటీపడుతున్నాయి. ప్రధాన వీధిలో బల్లెములతో నిండియున్నసైనికులు వరుసగా నిలబడి వున్నారు. వారిచేతిలో అత్యంత పొడవైన బరిసెలు కన్పిస్తున్నాయి. ఇవి అంబారీల ఎత్తుతో పోటీ పడుతున్నాయి. వీధులన్ని చదునైన ఇళ్లతో ఉండి పైకప్పులలో కిక్కిరిసిన జనాభా కలిగి ఉన్నారు. వీధికిరువైపులా చింతచెట్లు, వాటివెనక పర్వతాల మధ్య మెరుస్తున్న వెంకటగిరి యొక్క గొప్ప నిధి శిఖరం (దుర్గం), వీరి అనాగరిక ఆడంబరం మరియు వైభవం యొక్క దృశ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెపుతూ బ్రిటిషువారికున్న సహజ అసూయను వెళ్లగక్కుతాడు. ఈ రోజుల్లో తూర్పుప్రాంతాన అత్యంత అరుదుగా కనిపించే ఈ ఆడంబరం, పురాతన కాలంనుంచి యోగ్యతగా చెలామణి అవుతున్నట్టు చెప్పుకువచ్చాడు. ‘బ్రహ్మాండమైన’ వారి వైభవానికి చిహ్నంగా భారీ ఏనుగుపై రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) గొప్పగా కూర్చొని ఉన్నాడు. గవర్నర్తో కలిసి ఉన్నరాజు తన కిరీటంలో కోడి గుడ్డు సైజు కలిగిన పెద్ద ఎమెరాల్డ్ ధరించి ఉన్నాడు. అతని సోదరులు క్రాస్బెల్టులు ధరించి, విలువైన రాళ్లతో కప్పబడిన కత్తులు కలిగిఉన్నారు. మార్మిక సంకేతంతో ఏనుగులు పూర్తిగా మత్తులోకి ప్రవేశించి నెమ్మదిగా, గత వైభవానికి నిదర్శనంగా, మనోహరమైన నడకతో నడుస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో రాయబడిన స్త్రీల వయ్యారపు నడక మాదిరి, ఏనుగులు లయబద్దంగా నడుస్తున్నట్టు రీస్ చెప్పాడు. రాజు (రాజగోపాలకృష్ణ యాచేంద్ర) అత్యంత విలువైన గొప్ప ఆభరణాలను ధరించి ఉన్నాడు. కొన్నిసంవత్సరాల క్రితం అతని తండ్రి (కుమారయాచమ నాయకుడు) స్వచ్ఛందంగా తన వద్ద ఉన్నఅన్ని ఆస్తులను కుమారుడికి ఇచ్చి, తాను మాత్రం మతపరమైన కార్యక్రమాల్లోనిమగ్నమైనాడని రీస్ తెలిపాడు. (కుమార యాచముడి స్వచ్చంద పదవీత్యాగం పై చరిత్రకారుల్లో పలురకాల అభిప్రాయాలున్నప్పటికీ అవి అప్రస్తుతం ) అతని పెద్ద కుమారుడు, మా హోస్ట్ అయిన రాజు తన చిన్నతనంలోనే ఎస్టేట్ ని విజయవంతంగా నిర్వహిస్తు వెంకటగిరి నికర ఆదాయం సంవత్సరానికి 40,000 పౌండ్లను పెంచాడని, రాజు స్వభావం అతని నడవడిక మరియు మర్యాదలు ఒకే విధంగా సరళంగా మరియు సూటిగా ఉన్నాయని రాజగోపాలకృష్ణ యాచేంద్రను ప్రశంసించడం జరిగింది. ఇతని పరిపాలనలో అద్దెదారుల ఆర్ధిక పరిస్థితి చాలా బాగున్నట్టు రీస్ పేర్కొన్నాడు. మా ప్రభుత్వ అజమాయిషీలో కానీ లేక బయటకాని మరెక్కడకాని మేము విన్నదానికంటే వెంకటగిరి మెరుగ్గా ఉందని రీస్ చెప్పుకొచ్చాడు. ఇలా దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాలు పర్యటించిన బ్రిటిషు బృందానికి ఆతిధ్య సత్కారంలో వెంకటగిరికి మరేదీ సాటిరాదని రీస్ తన అభిప్రాయాల్ని ఆంగ్లపత్రికల్లో రాయడం అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. లార్డ్ కన్నెమెరా తర్వాత ఎందరో బ్రిటిషు గవర్నర్లు వెంకటగిరికి రావడం పోవడం జరిగింది. బ్రిటిషు అధికారులు వెంకటగిరిని ప్రత్యేక దృష్టితో చూడగా, ఇంగ్లాండ్లోని పత్రికలైతే వెంకటగిరిని ఓ రాష్ట్రంగా భావించి వెంకటగిరిలో చీమ చిటుక్కుమన్న తమ పత్రికల ద్వారా స్పందించేవారు. వెంకటగిరి రాజులు కూడా బ్రిటిషువారితో అంతే భయభక్తులతో ఉండేవారు. స్వదేశీ సంస్థానాల రద్దు వరకు వీరి మైత్రి కొనసాగింది.