సమీక్ష సమావేశంలోనే ప్రాణం పోయిందా?
గాజువాక జోన్–6లో ఎస్ఈ గోవిందరావు మృతి – ఒత్తిడే కారణమా? లోడర్లపై ప్రశ్నలతో వేడెక్కిన సమావేశం… కుప్పకూలిన అధికారి విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి): గాజువాక జీవీఎంసీ జోన్–6 కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర విషాదంగా మారింది. జోన్–6 సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) గోవిందరావు సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురై కుప్పకూలి అనంతరం మృతి చెందడం నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక సమావేశంలో జరిగిన పరిణామాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సమక్షంలో సమీక్ష జోన్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో పాటు పలువురు కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, లోడర్ల పని తీరుపై చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఎస్ఈ గోవిందరావును నేరుగా ప్రశ్నిస్తూ గాజువాకలో ఎన్ని లోడర్లు పనిచేస్తున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. లోడర్ల అంశంపైనే తీవ్ర వాగ్వాదం గాజువాక పరిధిలో మొత్తం ఐదు లోడర్లు ఉండగా నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని గోవిందరావు సమాధానం ఇచ్చారు. అయితే పనిచేయని ఒక్క లోడర్ను కేంద్రంగా చేసుకుని పట్టాభి తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. గాజువాక స్వచ్ఛాంధ్రలో దుర్గంధానికి కారణం ఎస్ఈ వైఫల్యమేనని వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చినట్లు సమాచారం. సమావేశంలోనే అస్వస్థత… కుప్పకూలిన ఎస్ఈ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన గోవిందరావు సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో గోవిందరావు మృతి చెందారు. మానసిక ఒత్తిడే కారణమా? అనుమానాలు ఈ ఘటనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమావేశంలో ఎదురైన ఒత్తిడి, అవమానకర వ్యాఖ్యలే ఆయన మృతికి కారణమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై పెరుగుతున్న రాజకీయ, పరిపాలనా ఒత్తిళ్లపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్వతంత్ర విచారణకు డిమాండ్ గోవిందరావు మృతిపై స్వతంత్ర విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశంలో పాల్గొన్న వారి పాత్రను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.











