ఖమ్మం
పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం నగరంలో ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్కు ఒక సంవత్సరం పూర్తి అయింది. ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకులు, నందమూరి బాలకృష్ణ వీరాభిమాని నల్లమల్ల రంజిత్ తన స్వంత ఖర్చుతో పాటు దాతల సహకారంతో కాల్వా ఒడ్డు ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ, “స్వర్గీయ నందమూరి తారక రామరావు గారి ఆశీస్సులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నందమూరి బాలయ్య మీద అభిమానం తో పేద ప్రజల కోసం ఈ అన్న క్యాంటిన్ను ప్రారంభించాను. నామమాత్రపు రుసుముతో ఆహారం అందించడం ద్వారా ఆకలితో ఉన్న వారికి తోడ్పాటు అందించడం నాకు గౌరవంగా ఉంది” అని తెలిపారు. ఏడాది పాటు నిరంతరంగా క్యాంటిన్ నిర్వహణలో సహకరించిన దాతలు, సేవకులు, ప్రజలకు రంజిత్ కృతజ్ఞతలు తెలిపారు. “అన్నదానం మహాదానం — ఈ సేవా యజ్ఞంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు తమ సహాయం అందించాలని కోరుతున్నాను” అని నల్లమల్ల రంజిత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రజలు కూడా రంజిత్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.