విశాఖపట్నం
సామాజిక బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* సమాజ సమస్యలపై అవగాహన ఉన్న, వాటిని పరిష్కరించడానికి చురుకుగా పనిచేసే సామాజిక బాధ్యత గల పౌరులను అభివృద్ధి చేయడం జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) ప్రధాన లక్ష్యం అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఏవిఎన్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిధులు, విశిష్ట అతిథులు చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ జాతీయ సేవా పథకాన్ని ఎన్ఎస్ఎస్ అని పిలుస్తారని చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతుందన్నారు. చదువుకుంటూనే సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్ ద్వారా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎస్ ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. బృందంతో కలిసి పని చేయగలిగే చొరవ వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అనేక రంగాలలో ప్రవేశించే నేర్పును సాధిస్తారని తెలిపారు. వ్యక్తిగత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఎన్ ఎస్ ఎస్ ఉపయోగపడుతుందన్నారు.నిస్వార్థమే లక్షణంగా, సమాజసేవే లక్ష్యంగా, ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ అంటూ విద్యార్థుల్లో చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి, మంచి క్రమశిక్షణకి దారి చూపిస్తూ ప్రజా హృదయపథంలో పయనించే ఆ రథమే జాతీయ సేవా పథకం ‘ఎన్ఎస్ఎస్’ అని కొనియాడారు. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం విద్యార్థులను సమస్యల పరిష్కారంలో పాల్గొనేటట్టు చేయడం. క్యాంపులలో సమూహ జీవనం, పనులను పూర్తి చేయడంలో ఒకరికొకరు సాయం చేయడం కోసం అవసరమైన సామర్థ్యాల్ని విద్యార్థుల్లో పెంపొందించడం. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం. జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పాటించడం. మొక్కలు, జంతువులు వంటి ఇతర జీవుల పట్ల శ్రద్ధ, దయగా ఉండేటట్లు విద్యార్థులకు నేర్పించడం వంటి అనేక మంచి లక్షణాలని సాధించడానికి ఎన్ఎస్ఎస్ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏవి అది బానోజి రావు, ఏబీఎన్ కాలేజ్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఎన్ ప్రకాష్ రావు, ఏబీఎన్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సింహాచలం, ప్రిన్సిపాల్ పి కృష్ణకుమారి, ఏవిఎన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డి. గాయత్రి తదితరులు పాల్గొన్నారు.