Monday, 9 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

కరుణ చూపిన వరుణుడు

కరుణ చూపిన వరుణుడు నెల్లూరు, అక్టోబర్‌ 17 (పున్నమి విలేకరి) : చాలా కాలంగా కనిపించని వరుణుడు కరుణ చూపాడు. చినుకు చిత్తడయింది. ముసారా ముసురేసింది. గలగలలు లేని సెలయేళ్లు పర వళ్లు తొక్కాయి. నీటి జాడ లేని జలా శయాలు, ఏరులు, నదులు జలకళను సంతరించు కున్నాయి. పరుగుపరుగున పరవళ్లు మొదలుపెట్టాయి. దాదాపు ఏడేళ్లుగా కనుమరుగైన వరుణుడు చినుకు రూపంలో చిత్తడి చేసి వట్టిబోయిన నదులకు, ఏరులకు జలకళను తెచ్చాడు. వెరసి నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన పెన్నా సహా ప్రధాన నదులు, ఏరులు ఇప్పుడు పర వళ్లు తొక్కుతున్నాయి. చూపరులను మదిని పులకింపచేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో నదులు, ఏరులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రధానమైన సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. వరద నీటితో పెన్నా పరివాహక జలాశయాలు జలకళను సంతరించు కున్నాయి. దాదాపు 11 ఏళ్లు తరువాత నెల్లూరు ఆనట్ట నీటి సిరులతో కనువిందు చేస్తోంది. పరుగుపరుగున ప్రధాన కాలువల వైపు ఉరకలెత్తుతోంది. పెరుగుతున్న వరద ఉధృతి కడలి తీరం వైపు కదం తొక్కుతోంది. నెల్లూరు పెన్నా బ్యారేజీ నిండు కుండలా మారింది. జలకళను సంతరించుకుంది. చాలా కాలం తరువాత ఆనకట్ట పై పెన్నా ప్రవాహం చూసి నగర ప్రజలు పులకించిపోతున్నారు. ఉరకలెత్తుతున్న నీటి ఉధృతిని చూసి పరవ శిస్తున్నారు. మరెన్నాళ్లకో ఇలాంటి వరద ప్రవా హాన్ని చూస్తామో అన్నట్లుగా పరవళ్లు తొక్కే పెన్నను తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. సెల్పీలు తీసుకుంటూ చిరుమందహాస్యం పొందు తున్నారు. కొందరు నది వెంట ఆనం దంతో కేరింతలు కొడుతున్నారు. పెన్నా నదికి సుదీర్ఘ విరామం తరువాత వరద రావడంతో డెల్టా ఆయుకట్టులో ఆనందం వెల్లివిరుస్తోంది. చినుకు రాలదేమో చింత తీరదేమోనని దిగులు చెందుతున్న అన్నదాతలు సాగుకు డోకా లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఆనకట్ట నుంచి ఇటు సర్వేపల్లి, నెల్లూరు నగరం తాగునీటి అవసరాలకు అధికారులు నీటిని మళ్లిస్తున్నారు. సర్వేపల్లి, ముత్తుకూరు, ఈదూరు, కోడూరు, జాఫర్‌సాహెబ్‌ కాలువలకు ఆనకట్ట నుంచి ఇంజనీరింగ్‌ అధికారులు నీటిని మళ్లించారు. వరద నీటితో పరవళ్లు తొక్కే కాలువలను చూసి రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మెట్ట ప్రాంతంలోని బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు, కేతామన్నేరు, కొమ్మలేరు, కైవల్య, కాళంగి, కండలేరు సహా కాలువలు పొంగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతుంది.

Featured బిజినెస్

ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ?

ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ? పున్నమి పాఠకులకు నమస్కారములు. శుభోదయం. మా ‘వత్తి జీవితం’ శీర్షికని పునః ప్రారంభిస్తున్నాము అని తెలియ జేయడానికి సంతోషిస్తున్నాము. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మాంద్యం నడుస్తోంది. ఇది వాహన రంగాన్ని పెను తుఫానులా తాకింది. ప్రభుత్వ సంస్థ అయిన ‘బిఎస్‌ఎన్‌ ఎల్‌’ నుంచి ఏకబిగిని 32,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పను న్నారు. సాఫ్ట్‌ వేర్‌ రంగం తప్ప మిగతావి అంత సేఫ్‌గా లేవు! కంపెనీ పెట్టిన 130 సంవత్సరాల తరు వాత పార్లే బిస్కెట్‌ల పరిశ్రమ ఫాక్టరీకి 10 రోజుల విరామం ప్రకటించారు. అదేంటో !! ప్రజలు బిస్కెట్‌లు తినడం కూడా తగ్గించేశారు! పార్లే జీ పెద్ద ఖరీదైనది కూడా కాదు! అందరికీ అందుబాటులో ఉండే ధర ! ఇలాంటి సమయంలో ‘ఉన్న ఉద్యోగం ఎలా కాపాడుకోవాలి’ అనే అంశం మీద మా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఆర్టికల్‌ ప్రచురిస్తున్నాం . మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తాం. అదే అభద్రత , మనకి వచ్చినప్పుడు మనం ఏమేమి చేయాలో ఈ వారం, వచ్చే వారం చర్చిద్దాం . ముఖ్య గమనిక. ఇప్పుడున్న ఆర్ధిక మాం ద్యం, మరొక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో, మనల్ని ఎవరు రక్షించరు! మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకి కావలసిన భద్రతా భావం (సెక్యూరిటీ) మనమే కల్పించుకోవాలి. మనము, లాభార్జన ధ్యేయంగా ఉన్న కంపెనీ (ఫర్‌ప్రాఫిట్‌ కంపెనీస్‌)లో పని చేస్తున్నాము అనుకోండి. మనం చేసే పని, కంపెనీ యొక్క ఆదాయాన్ని, మరియు లాభాన్ని ఏ విధంగా పెంచుతుందో, మనకి అవగాహన ఉండాలి. అది లేక పోతే, మన ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు! ఇంకా – ‘అలంకార ప్రాయమైన  ఉద్యోగాలు ‘పర్సనల్‌ సెక్రెటరీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజరు, కార్పొరేట్‌ ఇమేజ్‌ మేనేజరు, అడ్వర్‌టైజింగులో ఉన్న వారు, కంపెనీ కష్ట పరిస్థితులలో ఉంటే తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేరు ! కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీరు మానవ వనరుల మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ ) అనుకోండి . ”మన కంపెనీకి అవసరమైన మధ్య స్థాయి మేనేజర్‌లను వేటాడడం నా బాధ్యత. క్రితం సంవత్సరం నేను ముగ్గురిని రిక్రూట్‌ చేశాను. ఒకరిని సేల్స్‌లో, ఒకరిని మార్కెటింగ్‌లో, ఒకరిని కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా. వీరి పనితనం వల్ల కంపెనీకి ఇంత లాభం వచ్చింది. వారిని మన పోటీ కంపెనీలు తన్నుకు పోకుండా, బాగా చూసు కున్నాను. ముగ్గురూ ఇప్పటికీ మన కంపెనీలోనే ఉన్నారు. ఇది కంపెనీ లాభానికి నా వంతు సహాయం” మీరు ప్రొడక్షన్‌ మేనేజర్‌ అనుకోండి. ”సకాలంలో ఉత్పత్తులకు , ప్రతి ఉద్యోగి తలసరి ఉత్పాదక శక్తి పెంచాను. వేస్టేజి తగ్గించాను. ఇన్ని లక్షలు / కోట్లు కంపెనీకి ఆదా చేసాను” ఇలా. మీరు ఫైనాన్స్‌ మేనేజర్‌ అనుకోండి. ”కంపెనీకి ఇంత ఖర్చు తగ్గించాను. ఇంత డబ్బు లాభంలో మిగిల్చాను. మంచి టాక్స్‌ ప్లానింగ్‌ ద్వారా, ఎక్కువ మొత్తం ఆదాయపు పన్నుకి పోకుండా కాపాడాను!” ఇలా. సరే! చిన్న ఉద్యోగం ఉదాహరణ తీసు కుందాం. కొరియర్‌ డెలివరీ బాయ్‌, ఏ ఫ్లిప్‌ కార్ట్‌లోనో, అమెజాన్‌ లేదా స్నాప్‌డీల్‌లోనో పని చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ‘నేను మన కనుగోలు దారులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా టైం కి వారు ఆర్డర్‌ చేసిన వస్తువులు డెలివరీ చేశాను . తద్వారా, వారు మరొక్క సారి మన దగ్గర కొనే రిపీట్‌ కస్టమర్‌లని తయరు చేశాను’ ఇలా. కస్టమర్‌ సర్వీసులో లేదా రెసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని : కోపంగా వచ్చిన ఆ కస్టమర్‌ని శాంతింప జేసి, ఆమె సమస్య పరిష్కరించి పంపించాను. తద్వారా కస్టమర్‌ని కాపాడుకున్నాను. వారు మరొక్క కంపెనీకి వెళ్లకుండా ఆప గలిగాను’ ఇలా. ”నిన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసి వేయకూడదు? ఎందుకు ఉంచాలి?” అని మనని యాజమాన్యం అడిగిందే అనుకుం దాం! మనం ఏ డిపార్టుమెంటులో ఉన్నా, మనకి అప్పగించిన పని ఏదైనా, మన పని వల్ల కంపెనీ ఆదాయం, మరియు లాభం ఎలా పెంచడానికి దోహదం చేసాయో, కాన్‌ఫి డెంట్‌గా చెప్పగలిగితే, మనకి ఉద్యోగ భద్రత ఉన్నట్లే. లేక పోతే లేనట్లె . ఒక చిన్న పని : ఒక కాగితం తీసుకుని, మీరు చేసే పని వల్ల , మీ సంస్థకి యే విధంగా లాభమో, ఒక 4 లేక 5 కారణాలు రాయండి ! సమయం: 20 నిముషాలు. ఆ క్లారిటీ మీద ఎప్పుడూ ఉండండి. కంపెనీలు నడిపే యాజమాన్యం వారు, తమ సంస్థలో ఉన్న ఉద్యోగాలను 3 రకాలుగా చూస్తారు. (1) మనకి డబ్బు తెచ్చే ఉద్యోగాలు. (2) మనకి డబ్బు ఆదా చేసే ఉద్యోగాలు (3) మనకి డబ్బు ఖర్చు కలిగించే ఉద్యోగాలు . కంపెనీ ఆర్ధిక ఇబ్బందులలో ఉంటే, మొదటి వేటు, 3 వ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల పైన పడుతుంది. అంతగా ప్రాముఖ్యం లేని ఉద్యో గాలు ఏమిటి ? అంటే ఇదమిద్ధంగా చెప్ప లేము. ఒక్కో కంపెనీని బట్టి, వారు చేసే వ్యాపారాన్ని బట్టి అవి మారుతుంటాయి. మనం చేసే పని ఆగి పోతే సంస్థ నడవదు అనిపించే ఉద్యోగాలు, ప్రాముఖ్యం కలిగినవి. మనం ఒక 4 నెలలు కంపెనీ కి వెళ్ళక పోయినా అది నడుస్తుంది అనిపించే ఉద్యోగాలు – అలంకార ప్రాయమైనవి. వాటిలో తాత్కాలిక సౌకర్యం ఉంటుంది కానీ, ఉద్యోగ భద్రత ఉండదు, సుదీర్ఘ కాలంలో. మీ ప్రతిస్పందన ( ఫీడ్‌ బ్యాక్‌ ) తెలియజేయవలసిన ఇమెయిల్‌: essence.training@yahoo.com, punnami.news @gmail.com

Featured హెల్త్ టిప్స్

టీవీ, సెల్ ఫోన్ ల వాడకం — తెచ్చి పెడుతుంది ఊబకాయం.

సమాజములో ఈ మధ్యకాలంలో బిపి. షుగర్‌ .ఊబకాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . గతంలో ధనికులలో ఎక్కువగా ఉండే ఊబకాయం ప్రస్తుతం పేద వారిలో కూడా కనిపిస్తుంది.గతంలో పెద్దవయసు వారిలోనే ఉండేది. ఇప్పుడు చంటి పిల్లల్లో కూడా వస్తుంది.దీనికి ప్రధాన కారణం ”పని తక్కువ – తిండి ఎక్కువ”. దీని నివారణకు తిండి తగ్గించుకోవడం ఒక భాగమైతే .శరీరానికి వ్యాయాయం కల్పించడం రెండవ భాగం. తిండి తగ్గించుకోవాలని, పని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆచరణలో చేయరు. ఇది చేయాలంటే కావలసింది గట్టి పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పిల్లలలో ఊబకాయం గురించి ” ప్రపంచ ఊబకాయ దినోత్సవం” సందర్భంగా ఈరోజు (11-10-19) కొన్ని విషయాలు చర్చించుకుందాం. పిల్లలు ముద్దుగా, బొద్దుగా బొజ్జలేసుకుని మన కళ్ళముందు తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉన్నారని సంబర పడతాము .కానీ ఈ బొజ్జ కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, బిపి, షుగర్‌ లాంటి జబ్బులు భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని మర్చిపోతాం. బొజ్జలు వచ్చిన తరువాత తగ్గించుకోవడం కష్టం . బొజ్జ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. పసిపిల్లలకు బొజ్జ రాకుండా ఏమి చేద్దాం? పసికందుకు తప్పక తల్లిపాలు తాగించాలి. బిడ్డకి కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు తాగించాలి. సంవత్సరం రోజులు తల్లి పాలు తాగిస్తే మరీ మంచిది . అలా తాగిస్తే పాలు ఇచ్చిన తల్లికి, పాలు తాగిన బిడ్డకి అందరికీ ఉపయోగమే. తల్లి పాలు తాగిన వారికి ఊబకాయం వచ్చే అవకాశం చాలా తక్కువ.  పండ్లు తినాలి-తినిపించాలి.  అప్పుడప్పుడు పండ్లు తినడం కాదు. ప్రతి రోజూ తినాలి . ఒకే రకం కాదు, రక రకాల వివిధ రంగుల పండ్లు తినాలి. రోజుకు నాలుగైదు విడతలుగా తినాలి. ఇలా పండ్లు పిల్లలకు కూడా తినిపించ గలిగితే ఊబకాయం,షుగర్ ,బిపిలు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది. పండ్లు తినడాన్ని చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. కుటుంబమంతా కలిసి పండ్లు తినడం అలవాటుగా పెట్టుకోవడం మంచిది. అప్పుడే పిల్లలు ఆచరించే ప్రయత్నం చేస్తారు.  ప్రతి రోజు తప్పక వ్యాయామం చేయాలి. పరిగెత్తడం,నడవడం,ఆడుకోవడం లాంటివి ఏవైనా కావచ్చు శరీరం బాగా కదిలే రకంగా రోజుకు ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాలు చేయగల్గితే ఊబకాయం మనచెంతకు చేరలేదు .ఈ వ్యాయామ కార్యక్రమాన్ని పెద్దలు ఆచరిస్తూ,దగ్గరుండి పిల్లలకు అలవాటు చేయాలి.అప్పుడే పిల్లలు దానిని వారి జీవితంలో ఒక భాగం గా గుర్తించి ఆచరించే ప్రయత్నం చేస్తారు.  వీడియో గేములను చూడడం తగ్గించు కోవాలి. టీవీలు ,సెల్ ఫోన్లు చూడడం చిన్నపిల్లల్లో ఇటీవల చాలా ఎక్కువైంది.పిల్లల గోల తప్పించుకోవడానికి తల్లిదండ్రులకు సెల్ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది . సెల్ ఫోను, లాప్ టాప్ ,టీవీ లను చూడడానికి మనం కేటాయించే సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటాం. ఈ స్క్రీన్ టైం గంటకు లోబడి ఉంటే ఇబ్బందులు ఏమీ లేవు .రోజుకు రెండు గంటలకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .ఈ సమస్యలు చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. కంటిమీద భారమై చూపులో దోషం వస్తుంది. ఆడుకోవడానికి సమయం లేక ఊబకాయం వస్తుంది. వీడియో చూస్తూ తిండి తింటున్నప్పుడు ఎంత తిన్నామో సరిగ్గా తెలియక ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది.వీడియోలు చూస్తూ నిద్ర సరిగా లేక అనేక అనారోగ్యాలకు గురవుతారు.  కూల్ డ్రింక్స్ ను, జంక్ ఫుడ్స్ ను వీలైనంత తగ్గించు కోవాలి  ఇవి తినడానికి, తాగడానికి రుచిగా ఉండవచ్చు . కానీ ఆరోగ్యానికి ఏ రూపంలోనూ ఉపయోగం లేదు.చిన్న కూల్ డ్రింక్ బాటిల్ లో దాదాపుగా ఎనిమిది నుంచి పది స్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ లు చెడిపోకుండా ఉండడానికి అందులో అనేక రకాల రసాయనాలు కలుపుతారు. వీటన్నిటి వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటే వారికి ఊబకాయం రావడం ఖాయం.                  గతంలో                                                                                                                                                ప్రస్తుతం                                                                                                                                                                                                డాక్టర్‌ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌), డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

వృత్తి జీవితం – 2

వృత్తి జీవితం – 2 పనివేళలో అదనపు గంట ( 1 ) నిన్న మనం ఒక డైలమాని విశ్లేషించాం. మన కంపెని యజమాని / డైరక్టర్‌తో కలిసి ఒక ప్రాజక్టు విూద పని చేసే అవకాశంవచ్చినప్పుడు, మన పని వేళలో అదనపు గంటనిఎలా వెతికిపట్టుకోవాలి? అనే విషయం? ఈ సంచికలో అది మరింత విపులంగా. ఇలాంటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మన వృత్తి జీవితంలో ఎన్నోవస్తూ ఉంటాయి. ఏదో ఒక అదనపు బాధ్యత వచ్చి పడుతుంది. అది గనక వదులుకుంటే, మళ్ళీ రాదు, రిటైర్మెంటు అయ్యే వరకు గ్రౌండ్‌ లెవెల్‌ సిపాయి ఉద్యోగమే చెయ్యాలి. ఒప్పుకుంటే, ఒక్క సంవత్సర కాలంలో చాలా గుర్తింపు, పైకి వెళ్ళే అవకాశం. కానీ దాని కోసం చాలా వదులుకోవాలా? వీటికి ఒక పరిష్కారం మన టైం మేనేజిమెంటులో ఉంటుంది. ఇలాంటి అవకాశాలు విూ తలుపు తట్టినప్పుడు, విూకు ఈ సూచనలు ఉపయోగపడవచ్చు. (1) మొట్ట మొదటగా ‘రేపు చేయవలసిన పనుల చెక్‌ లిస్ట్‌’ రాసుకోవడం. ఉదాహరణకి విూ ఆఫీసు 6 గంటలకి అయిపోతుంది అనుకోండి. ఒక 10 నిముషాల ముందు, అన్నీ కట్టేసి, అస్త్ర సన్యాసం చేసి, ఇంటికి వెళ్ళడానికి మూటా ముల్లే సర్దుకుని, ఒక కాగితం పైన, లేదా ఒక డేట్లు ఉన్న డైరీలో, రేపు చేయవలసిన లిస్ట్‌ రాసుకోండి. ఏమేమి పనులు చెయ్యాలి? ఏయే రిపోర్టులు ఎవరెవరికి పంపాలి? ఎవరెవరికి ఫోన్‌ చేసి ఫాలో అప్‌ చెయ్యాలి? వగైరాలు. ఒక సారి మన మనసులో నుంచి పేపర్‌ విూద రాస్తే, మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఇబ్బందిపడము. రేపు ఆఫీసుకి వచ్చాక, మన చెక్‌లిస్ట్‌ ఫాలో అయిపోతాము. మన పనికి ఒక రిథం, ఒక ఫ్లో వస్తాయి. (2) రాసుకుని పూర్తి చేసిన పనుల విూద ‘టిక్‌ మార్కు’ పెట్టడం. టిక్‌ మార్కు లేనివి మళ్ళీ రేపటికి. ఇలా ఎక్కువ రాసుకోవడం, తక్కువ చెయ్యడం ఎందుకు అవుతుందంటే, ఏ పనికి ఎంత సమయం పడుతుంది అనే విశ్లేషణ లేనప్పుడు. మన బాల్యంలో స్కూలులో ‘కాలము -పని’ లెక్కలు చేశాము గుర్తు ఉందా? దానిని మళ్ళీ తిరగదోడాలి! (3) ఇక 3వ పాయింటు. మన దైనందిక పని జీవితంలో ‘టైం వేస్ట్‌ వ్యవహారాలు’ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం. వీటిలో ముఖ్యమైనవి. పని సమయంలో ఫేస్‌బుక్‌ అప్‌ డేట్‌లు, వాట్సాప్‌ ఫార్వర్డ్‌లు, చాటింగులు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకుని (అదీ ఆఫీస్‌ వై-ఫైతో!) చూడడం, ఫార్వర్డ్‌ చెయ్యడం, అనవసరమైన విూటింగులు, మధ్యలో ఫోన్‌ కాల్స్‌లాంటి ఆటంకాలు, ఎక్కడో పెట్టి మరిచిపోయిన ఫైల్స్‌ని వెతుక్కో వడం, ఇలా వీటిని తొలగిస్తే రోజుకు గంటన్నర మిగులుతుంది. (4) మనం కేవలం ప్రేక్షక పాత్ర వహించే ఆఫీస్‌ విూటింగుల నుంచి మనని తప్పించమని మనపై అధికారులని రెక్వెస్ట్‌ చేయడం. ఈ టైంలో ‘బిగ్‌బాస్‌ ప్రాజక్టు విూద ఉన్నారు కాబట్టి విూపై బాస్‌ విూ అభ్యర్ధన వింటారు! (5) ఈ చివరి సూచన ఇతర స¬ద్యోగుల సలహా అడగడం వారిని అడగవలసిన ప్రశ్నలు. (1) నాకు ఏయే పనులలో టైం వేష్టు అవుతోంది? (2) ఏయే పనులను నేను తరచుగా చేయడం తగ్గించాలి? (3) ఏ పనులు, నేను మరింత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు? (ఉదాహరణకి, ఆఫీసు విూటింగులు. (4) ఏయే పనులను నేను పూర్తిగా మానేయవచ్చు? మనం ఊహించని జవాబులు వచ్చి, మనని కుదిపేస్తాయి ! సంస్థలో అదనపు బాధ్యతని ఒక భారంగా కాక, విలువైన అవకాశంగా భావించండి. చేసే 8 గంటలలోనే, దాగి ఉన్న అదనపు గంటని కనుక్కుని, విూ ఉత్పాదక శక్తిని పెంచుకోండి. వృత్తి జీవితంలో మరిన్ని మెట్లు అధిరోహించండి.

Featured ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు అవసరం

మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు అవసరం నెల్లూరు, అక్టోబర్‌ 11 (పున్నమి విలేకరి) : చదువుతో పాటు మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు ఆడటం ఎంతో అవసరమని వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాలల పురుషుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచి విద్యను అందించాలని చూస్తున్నారే తప్ప క్రీడల పట్ల ఆలోచన చేయడం లేదు. సమాజంలో రాణించాలంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. సమాజంతో పోటీ పడేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. గెలుపోటములను తట్టుకుని నిలబడే మానసిక స్థితి, మనో స్థైర్యం క్రీడల ద్వారా మెరుగుపడతాయి. అన్ని క్రీడల పట్ల ఆసక్తి చూపించండి కానీ, గ్రామీణ క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించకండి. తల్లితండ్రులు సమాజంలో తమ బిడ్డ పేరు గర్వంగా చెప్పుకునే స్థాయికి అందరూ ఎదగాలని ఆయన తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ  అభినందనలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

బాబు పర్యటనను విజయవంతం చేద్దాం

బాబు పర్యటనను విజయవంతం చేద్దాం నెల్లూరు, అక్టోబర్‌ 11 (పున్నమి విలేకరి) : జిల్లాలో ఈ నెల 14,15 వ తేదీలలో మాజీ సియం చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. 14వ తేదిన జిల్లా విసత స్థాయి సమావేశం జరుగుతుందని, నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికార పార్టీ బాధితులతో సమావేశం నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మాజీ సియం పర్యటనలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూనే, అధికార పార్టీ బాధితులకు బరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి అమర్‌నాధ్‌ రెడ్డి పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలబించిన ప్రభుత్వం ఇదేనని ఆయన విమర్శించారు. వైఎస్‌అర్‌ కంపెనీ లిమిటెడ్‌గా రాష్టాన్ని మార్చారని ఆయన దుయ్యబట్టారు. ఇసుక అక్రమంగా ఇతర రాష్టాలకు తరలిపోతుంది.ఇందులో అదికార నాయకులకే అగ్రబాగంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మద్య నిషేధం అంటు మద్యం రేట్లు పెంచి అమ్ముతున్నారు.త్వరలో మద్యం అమ్మకాలు వారి పార్టీ కార్యకర్తలకు అప్ప చెబుతారని ఇది దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు మండల స్థాయి అదికారుల పై దాడులు జరుగుతున్నాయి.త్వరలో జిల్లా, రాష్ట స్థాయికి చేరుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. రైతు బరోసా 12500ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చే 6000ను కలుపుకున్నదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. గతంలో మేము అన్నదాత సుఖీభవ లో15000 ఇవ్వడాన్ని మేము ప్రారంబించి 4వేలు ఇచ్చామని రాష్టం ఇప్పుడు ఇచ్చే రైతు బరోసాలో కేంద్రము ఇచ్చే 6వేలును కలుపుకుంటున్నారా..లేక 12500 మీరు స్వంతంగా ఇస్తున్నారా! అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రీటెండరింగ్‌ విధానాన్ని ప్రవేవపెట్టి దానిని అయోమయంగా చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో మీరు విమర్శించిన కాంట్రాక్టు కంపెనీకి మీరు అదే పనిని కట్డ బెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని కంప్లీట్‌ చేయలేదని, వెంటనే కేంద్రము ఈ ప్రాజెక్టు ను వెంటనే హ్యాండోవర్‌ చేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయాలని సోమిరెడ్డి తెలియచేశారు. ఎన్‌ అర్‌ జిసి పథకంలో కేంద్రం విడుదల చేసిన రాష్టం ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. వచ్చిన నిధులకు రాష్ట ప్రభుత్వ వాటా కలుపుకొని మూడు రోజుల్లో విడుదల చేయక పోతే 12% వడ్డీతో సహా కట్టి ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ముందుగా చేసిన పనులకు ముందుగా బిల్లు చెల్లించాలి. నీరు చెట్టు పనులు చేసిన వారి వల్ల పార్టీ నష్టపోతుందని ఆయన తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి మెండి వైఖరి వల్ల రాష్టం నష్ట పోతుందని ఆయన తెలిపారు. రాష్టం మీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కాదని ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమని దీనిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాష్డము -43శాతం గ్రోత్‌లో వెనుకబడి పోయిందని బాబు పాలనలో రాష్ట్రం ముందంజలో వుండేదని ఆయన పేర్కొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

వృత్తి జీవితం – 1 పనివేళలో అదనపు గంట ( 1 )

వృత్తి జీవితం – 1 పనివేళలో అదనపు గంట ( 1 ) కొన్ని సంవత్సరాల క్రితం టైం మేనేజిమెంటు విూద ఒక వర్క్‌ షాపు నిర్వహిస్తూ, ఒక ఆస్తక్తి కరమైన సర్వే చేశాం . ఆ ట్రెనింగ్‌ ప్రోగ్రాంలో ఒక 30 మంది ఉన్నారు. 40 నుంచి 50 మధ్య వయసు వారు. మధ్య స్థాయి మేనేజలు. వారిని ఒక ప్రశ్న అడిగాం. ”మేడమ్స్‌ అండ్‌ సార్స్‌. మాకు తెలుసు విూరంతా తమ తమ పనుల్లో, ఉద్యోగాలలో బిజీ. సకాలంలోపూర్తి చేయాల్సిన పని వత్తిడి కూడా విూ విూద ఉంది . ఇది తెలిసి కూడా, విూ బాసు, విూకు ఒక అదనపు పని లేదా ప్రాజక్టు వప్ప జెప్పారు . విూరు దాన్ని స్వీకరిస్తారా? అయితే, ఈ అదనపు పనికి గాను విూకు అదనపు జీతం / బోనస్‌ లేదా ఓవర్‌ టైం వంటి అదనపు పారితోషికం ఉండదు! ఎవరు టేకప్‌ చేస్తారో చేతులె త్తండి ! ”అని ఒక్క చెయ్యి కూడా పైకిపోలేదు . కొంతమంది అన్నారు , ‘మాకు ఉన్న పని వత్తిడితో, మేము ఎక్స్‌ట్రా పని చేయలేము సార్‌ అని మా బాస్‌తో చెబుతాము ‘అని మరి కొందరు’ విూరు చెప్పిన అదనపు బాధ్యత తప్పకుండా స్వీకరిస్తాను సర్‌. కానీ, నా చేతిలో ఉన్న పనిలో కొంత భాగం మరొకరికి అప్పగించగలరా? లేదా, నాకు అప్పగించిన పని పూర్తి చెయ్యడానికి మరికొంత సమయం ఇవ్వగలరా? నా ప్రాజక్టు డెడ్‌ లైను కొంత పొడిగించగలరా? అని వారి పై అధికారులతో ‘నెగోషియేట్‌ ‘ ( బేరసారాలు ) చేస్తాము అని చెప్పారు ! బాగుంది ఐడియా. కానీ, మేము అడిగిన ప్రశ్నలో, వారు కోరే ఆ రెండు వెసులుబాట్లూ  ఉండవు అని చెప్పాము. అలాంటప్పుడు ఏమి చేస్తారు? అని మళ్ళీ అడిగాము కాస్త మెతక స్వభావం ఉన్న వారు, ‘మనస్పూర్తిగా అయితే ( అదనపుబాధ్యత) స్వీకరించము సర్‌ ! విూకు తెలుసు మా సంస్థలో ఎంత పని వత్తిడి ఉంటుందో. ఫోను స్విచ్చాఫ్‌ చెయ్యలేము సెలవు రోజు కూడా. ఇకపై అధికారి అడిగారు కాబట్టి, నో చెప్పలేము కాబట్టి టేకప్‌ చేస్తాం. మాకు చేతనయినంత వరకు చేస్తాం . కానీ,2 పడవల విూద కాళ్ళు పెడితే, పని నాణ్యత దెబ్బ తింటుంది. మా ఆరోగ్యాలూ పాడవుతాయి ! అని మా మేనేజిమెంటు వారికి విూరయినా చెప్పండి ‘అని మాతో అన్నారు .ఆ ట్రెయినింగ్‌ కి వచ్చిన మరొక మేనేజర్‌ జోక్‌ చేశారు, ఇలా. ”ఏదో టైం మేనేజిమెంటు పైన ట్రెయినింగ్‌ ప్రోగ్రాం – అంటే ఇలా వచ్చాం. విూరేదో మాకు నేర్పుతారని ఇలాంటి ఫిట్టింగులు పెడతారు అనుకోలేదు” అని. అందరూ గొల్లున నవ్వారు! సో, ఏతావాతా, మనస్పూర్తిగా ఎవ్వరూ చేతులెత్త లేదు. అప్పుడు మరో ప్రశ్న జోడించాం. అయితే , ఈ అదనపు ప్రాజక్టు విూరు ఒప్పుకుంటే, రోజుకు ఒక గంట అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది . కానీ, విూకు విూ కంపెనీ యజమాని /ఎండీతో నేరుగా కలిసి పని చేసే అవకాశం ఉంటుంది ! విూరు ఆయన కి మెయిల్‌ పంప వచ్చు. ఆయన విూకు ఫోన్‌ చేస్తూ ఉంటారు! అని. ఈ సారి దాదాపు అందరూ చెయి పైకి లేపారు . దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగులలో నిజమైన సందిగ్ధం ! చూస్తూచూస్తూ ఇలాంటి అవకాశం ఎవరు వదులుకుంటారు ? కంపెనీ యజమానితో కలిసి పని చేసే అవకాశం. మనమేంటో నిరూపించుకునే అవకాశం. మన సామర్ధ్యం పైవారికి తెలిసే అవకాశం! కానీ ఎలా? మన ఉద్యోగం సేఫ్‌. పైగా మన పనితనం డైరక్ట్‌గా దేవుడికి తెలిస్తే, ఈ మధ్యలోని అడ్డమైన పూజారులకీ సోపు వేసే అవసరం ఉండదు ! ఇలాంటి ఆలోచనలు. కానీ, మన పని వేళలలో ఒక గంట అదనపు టైంని ఎలాగుర్తించి పట్టుకోవడం? ఈ ప్రశ్నకి జవాబులు, రేపు ఇదే సమయానికి… (12-10-2019)

Featured ఆంధ్రప్రదేశ్

అవినీతి తిమింగలం ఇంట ఏసీబీ సోదాలు

అవినీతి తిమింగలం ఇంట ఏసీబీ సోదాలు రూ.కోట్లలో అక్రమాస్తులు భారీగా ప్రాంసరీ నోట్లు, నగదు, నగలు ఏసీబీ అదుపులో టీజీపి డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీనరసింహం నెల్లూరు, అక్టోబర్‌ 10 (పున్నమి విలేకరి) : లెక్కకు మించిన ఆస్తులు… లక్షలాదిరూపాయల నగదు నిల్వలు… కేజీల కొద్ది బంగారం … లక్షల కొద్ది ప్రాంసరి నోట్లు… బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు… భారీగా ఎకరాలు కొద్ది భూములు… కళ్లు బైర్లు కమ్మే బంగారు, వజ్రాల ఆభరణాలు… లాకర్లు కొద్ది నగదు నిల్వలు, దస్తావేజులు ఇవి రాపూరు తెలుగు గంగ స్పెషల్‌ కలెక్టర్‌ ఎం.లక్ష్మీనరసింహం అడ్డగోలుగా కూడబెట్టిన ఆస్తుల చిట్టా… గత కొద్ది కాలంగా అవినీతే ప్రధాన అజెండాగా అక్రమ ఆస్తులు కూడబెడుతున్నాడంటూ అతని పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈవాళ నెల్లూరు ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం నివాసాలు, స్నేహితుల ఇళ్లు, బంధుపరివారాల పైన ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఇందులో అధికారులకు కళ్లు బైర్లు కమ్మే ఆస్తుల చిట్టాలు బయటపడ్డాయి. జిల్లాలోని కావలి, నెల్లూరులలో ఆర్డీవోగా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహం గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించారు. పక్కా ఆధారాలు చూసుకున్న ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం పై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో డైకస్‌రోడ్డు వద్ద ఉన్న లక్ష్మీనరసింహం ఇంట్లో సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలు, లక్షలాది రూపాయల ప్రాంసరీ నోట్లు నెల్లూరులో నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, కావలిలో ఒక షాపింగ్‌ కాంప్లెక్సు, 14 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ ప్రాధమికంగా గుర్తించింది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం, ఆపై అడ్డగోలుగా అందిన మేరకు అక్రమార్జన చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనరసింహంను ఏసీబీ డిఎస్పీ దేవానంద్‌ శాంతో అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను సేకరించే పనిలో వున్నారు. జిల్లాలో కావలి ఆర్డివోగా పనిచేసిన లక్ష్మీనరసింహం పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులో అవినీతి అధికారికంగా ఆరోపణలున్న టీజీపీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీనరసింహం ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాయనే సమాచారంతో తెలుగు గంగా స్పెషల్‌ కలెక్టర్‌ లక్ష్మీ నరసింహం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లక్ష్మీనరసింహంఇంటితోపాటు సమీప బంధువులు స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పనిచేసిన ప్రతిచోటా భారీగా అవినీతి, అక్రమాస్తుల కూడబెట్టారంటూ లక్ష్మీనరసింహం పై కేసునమోదు చేసిన ఏసీబీ. గతప్రభుత్వ హయాంలో కావలి ఆర్డీవో గా పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దగదర్తి విమానాశ్రయం భూసేకరణ లో పేదల భూముల రికార్డులు మార్చి అనర్హులకు కట్టబెట్టినట్లు ఉన్నతాధి కారులకు ఫిర్యాదులు చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

అవును…. వారిద్దరు ఒక్కటయ్యారు….

అవును…. వారిద్దరు ఒక్కటయ్యారు…. నెల్లూరు, అక్టోబర్‌ 10 (పున్నమి విలేకరి) : అవును వారిద్దరు ఒక్కటయ్యారు…. ఇదేదో సినిమా టైటిల్‌లో లేకుంటే వ్యవహారిక పదమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏపీలోని రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరులో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఐక్యతారాగం. దాదాపు ఆరు నెలల నుంచి నిన్నమొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్లింది. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్‌ కూడా చేశారు. అంతే…పార్టీ అధినేత రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యేలనేగా మీ సందేహం. వారే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఇప్పుడు అర్థమైవుంటుంది వీరిద్దరి మధ్య గొడవేంటో… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడమే రాజకీయ లౌక్యం అంటారు పెద్దలు. గతమేమో గాని ఇటీవల నెల్లూరుజిల్లాలో నెలకొన్న కొన్ని సంఘటనలు అక్కడి రాజకీయ నాయకుల ఆంతర్యాన్ని బైటపెట్టాయి. ఇటీవలి రాజకీయాల్లో కృష్ణార్జునులుగా పేరుగాంచిన బావబామర్దులు గోవర్ధన్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డిల రాజకీయ వైరం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న కాకాణిపై నిప్పులు చెరిగిన రూరల్‌ ఎమ్మెల్యేకోటంరెడ్డి అధినేత సయోద్యతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. తూచ్‌… మేమిద్దరం సన్నిహితులం… కుటుంబ బాంధవ్యమే కాదు, బాల్యమిత్రులమంటూ కాకాణి పై శ్రీధర్‌ రెడ్డి ప్రేమ ఒలకబోశారు. మరోవైపు తమ ఇద్దరి మధ్య కేవలం అవగాహన లోపమే కాని, అనుబంధం చెక్కుచెదరలేదంటూ శ్రీధర్‌ రెడ్డి బావ కాకాణి కాకాపట్టారు. దీంతో ఎమ్మెల్యేలిద్దరి మధ్య వివాదం పై నిన్నమొన్నటి వరకు కత్తులు నూరుకున్నా కేడర్‌ మాత్రం ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ప్రత్యేకించి వివాదం తారాస్థాయికి కారణమైన అధికారిణి సరళా మాత్రం సైలెంట్‌ అయిపోయారు. ఎమ్మెల్యేల వివాదానికి రాజకీయాలే కాదు, కొన్నివ్యక్తిగతమైన అంతర్గత విభేదాలున్నట్లు జిల్లాలో గతం నుంచే చర్చ జరుగుతోంది. గత టీడీపీ హయాంలో నెలకొన్న కొన్నిరాజకీయ పరిణామాలు కాకాణి ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల్లో శ్రీధర్‌ రెడ్డి ప్రత్యర్థికి సపోర్టు చేశారన్నది కాకాణి వర్గీయుల వాదన. ఆ విభేదం తారాస్థాయికి చేరి రియల్‌ ఎస్టేట్‌లో బహిర్గతమైంది.  నెల్లూరు జిల్లాలో బావబామ్మర్దులుగా బాంధవ్య భావాలున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గత కొద్దికాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పై అక్కడి స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు న్యాయపరమైన చిక్కులు తెచ్చాయి. తన పై గోవర్ధన్‌ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి కేసు వేశారు. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంలో తనకు స్వయాన బావమర్ధిగా పేరున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అప్పట్లో సోమిరెడ్డికి సపోర్టుగా నిలిచారన్నది కాకాణి వాదన. ఇదే సమయంలో రూరల్‌ ఎమ్మెల్యేకు చెందిన కొన్ని వ్యక్తిగత విషయాల్లో కాకాణి జోక్యం చేసుకుంటున్నారంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే కాకాణి పై గుర్రుగా వుంటూ వచ్చారు. అధికార పార్టీలో పవర్‌పుల్‌ లీడర్లుగా ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వివాదం ఈ మధ్య రచ్చకెక్కింది. ఓ రియల్‌ ఎస్టేట్‌కు నీళ్ల వ్యవహారంలో అక్కడి ఎంపీడీవో సరళాదేవి అనుమతులు ఇవ్వలేదంటూ రూరల్‌ ఎమ్మెల్యే ఆమె పై ఆగ్రహించారు. నివాసానికి వెళ్ళి మరీ హెచ్చరికలు చేశారు. తమ నియోజకవర్గంలో అధికారిణిపై రూరల్‌ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారన్న వ్యవహారం పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అరికాల్లో కాలింది. తమ అనుచరుల ద్వారా అధికారిణితో రూరల్‌ ఎమ్మెల్యే పై కేసులు పెట్టించారు. దీంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. అధికారిణి పై ఎమ్మెల్యే ఆగ్రహించారన్న సమాచారం అధినేతకు చేరడంతో ఆయన భగ్గుమన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, చర్యలు తీసుకోండి అంటూ అధికార యంత్రాంగాన్ని ఆపార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పాలనాధిపతి నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం పోలీసులు నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఆపై బెయిల్‌ పై ఆయన విడుదల అయ్యారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప్పు నిప్పుగా మారడం, పార్టీలో గందరగోళానికి కూడా దారితీసింది. ఇది కాస్తా పార్టీ డ్యామేజి అయ్యే స్థాయికి వెళ్లిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మహిళా అధికారిణి వనజాక్షి పై దెందులూరు ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ ఘటన కళ్ళ ముందు సాక్షాత్కారిస్తుండడంతో ప్రస్తుత ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఒకవైపు పార్టీ పై దురభిప్రాయాన్ని పోగొడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అధినేత అరెస్ట్‌ చేయించారన్న సంకేతాన్ని సాధారణ ప్రజల్లోకి వెళ్లేలా ఒక చర్య, మరో వైపు గొడవ కొనసాగితే జిల్లాలో కేడర్‌ గందరగోళం పడుతుందన్న విధానానికి స్వస్తి పలుకుతూ సయోధ్య కుదర్చడంతో వైసీపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే మధ్య జరిగిన వివాదాన్ని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన మార్కు రాజకీయంతో సర్దుబాటు చేశారు. బట్‌ ఈ సయోధ్య ఎంత వరకు కొనసాగుతుంది అన్నది వేచిచూడాల్సిందే…

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఈఎస్‌ఐలోనూ అవినీతి జాడలు

భారీ మొత్తంలో గడువు తీరే మందులు కొనుగోళ్లు కార్మికుల వైద్యానికి కాస్మోటిక్‌ ఔషధాల్ణు విజిలెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న అక్రమాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం – విజిలెన్స్‌ ఎస్పీ ఎం.వి.సుబ్బారెడ్డి. (నెల్లూరు, పున్నమి ప్రతినిధి) తలవెంట్రుకలు… పెరిగేందుకు… అక్కడ భారీఎత్తున ఔషధాలు కొన్నారు… అక్కడ ఈసీజీ..పరికరాలు.. లేకున్నా… వాటికోసం లక్షల్లో బిల్లులు చేశారు.. ఇదేదో కాస్మొటిక్‌… అవసరాలకు… కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో బిల్లులు అనుకునేరు… నిరుపేద కార్మికులకు తూతూ మంత్రంగా సేవలందించే ఇఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో డ్రగ్స్‌ కొనుగోళ్లు మాటున జరుగుతున్న అక్రమాలు… జ్వరమొస్తేనే.. మాత్రలు లేవనే ఈ హాస్పిటల్స్‌ లో మందులపేరు తో జరిగిన దోపిడీలుపై విచారణ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోనూ ఆశ్చర్యం కలిగించే అక్రమాలు బయటపడుతున్నాయి.. ఇంతకీ జిల్లాలో ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ అక్రమాలేంటో మీరే చదవండి. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో..కార్మికులకు అత్యవసరంగా చికిత్స అందించాలంటే… సవాలక్ష కారణాలు చెపుతారు.. అక్కడి వైద్యులు… ఏఒక్క జబ్బుకీ…సరైన మందులు కనిపించని ఆ వైద్యశాలల్లో.. సౌందర్యపోషణకు కూడా చికిత్స అందిస్తాయంట…అందుకోసమే వీరు మందులు కొనుగొలు చేసినట్లు రికార్డులు తయారు చేసారు.నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ పోర్స్‌ మెంట్‌ తనిఖీలలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎస్‌ ఐ అసుపత్రులలో జరుగుతున్న తనిఖీలు దిమ్మ తిరిగే వాస్తవాలను వెలికి తెస్తున్నాయి.విన్న వారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.తెలంగాణ రాష్టంలో ఈఎస్‌ ఐ అసుపత్రులలో జరిగిన మందుల కుంభకోణం తర్వాత ఎపిలో కూడా రాష్ట వ్యాప్తంగా విజిలెన్స్‌ ఇప్పుడు ఈఎస్‌ ఐ అసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో తనిఖీలు చేసింది.జిల్లాలో నెల్లూరులోని పోదలకూరు రోడ్డు లోని అసుపత్రి,కావలి ,సూళ్ళురు పేట లలో వున్నక్లీనిక్‌ లలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.అక్కడ రికార్డులతో పాటు మందుల నిల్వ,ఎక్కడ నుంచి కొనుగొలు చేసారు.ఎలాంటి మందులు కొనుగొలు చేసారు లాంటి వాటిపై తనిఖీలు చేస్తున్నారు. కార్మికులు,ప్రయివేటు కంపెనీల సిబ్బందికి ఈఎస్‌ ఐ అసుపత్రులలో చికిత్స అందిస్తారు.నెల్లూరు నగరంలోరెండు,సూళ్ళురు పేటలో రెండు ,గూడురులో 1,తడ,కావలిలలో రెండు ఈఎస్‌ ఐ అసుపత్రులు నడుస్తున్నాయి.వాటి పరిదిలో కార్మికులకు ఎక్కువుగా చికిత్సలు అందిస్తారు. అయితే తనిఖీలలో విచిత్రమైన అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.కావలి ఈఎస్‌ ఐ అసుపత్రిలో అయితే జుట్టు రాలకుండ వుండేందుకు వాడే మందులు 60-100 కేస్‌ ల వాడినట్లు రికార్డులు లలో వుంది.అయితే వ్యాదుల చికిత్సకు మందులు ఇవ్వాల్సిన అసుపత్రిలో సౌందర్యానికి ఉపయోగపడే మందులు ఎందుకు వాడారన్నది ఇప్పుడు విజిలెన్స్‌ అదికారులనే విస్మయానికి గురిచేసింది.సూళ్ళురు పేటలో ప్రభుత్వం పంపించిన మందులు కాకుండా బయట అధికంగా కొనుగొలు చేసినట్లు రికార్డులు చూపించారు. అంతేకాకుండా పది మంది రోగులు వస్తుంటే వారి సంఖ్యను నాలుగింతలు పెంచినట్లు విజిలెన్స్‌ తనిఖీలలో బయటపడింది.మిగిలిన వారికి కూడా మందులు పంపిణీ చేసి నట్లు రికార్డులు తయారు చేసుకున్నట్లు గుర్తించారు అదికారులు.తనిఖీలు మరింత కాలం కొనసాగుతాయని అంటున్నారు విజిలెన్స్‌ అదికారులు…అయితే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన తర్వాత చెబుతామంటున్నారు. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు తెలంగాణాకు పరియం8తమనుకున్న విజిలెన్స్‌ అధికారులకు ఇక్కడి మందుల కొనుగోళ్లు… వాటిపంపిణి చూసి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది… ఊహించని జబ్బులకు మందులు కొనుగోలు చేశారు… గాయాలకు… జ్వరాలకు మాత్రలు దొరకని ఈ కార్మిక దవాఖానలో మాత్రం… కాస్ట్లీ మందులు భారీగా కొన్నారు.. అందులోనూ రికార్డుల్లో మాత్రమే… నిరుపేద కార్మికులకు వైద్యసేవలు అందించినట్లు సొమ్ముచేసుకున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.