Featured
గొప్ప పరిశోధకుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ——————— రచన-ఫయాజ్ ——————— (పున్నమి భలే జ్ఞాపకాలు) “ఏమయ్యా కొండయ్య?, నేను ఇచ్చిన కాటుక పెట్టుకున్నావా? ఇప్పుడు కళ్ళకు ఎలా కనిపిస్తోంది?” “చాలా బాగా కనిపిస్తుంద య్యా, ఇంతకు ముందు నా కళ్ళ ముందు రెండు తెరలు అడ్డంగా ఉండి ప్రతి వస్తువు లీలామాత్రం గానే కనిపించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా” ఈ సంభాషణ మీకు అర్థం కాలేదు కదూ? 70 ఏళ్ల కిందట ఉదయగిరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తికి రెండు కళ్ళకు కేటరాక్ట్ వచ్చింది. వెంటనే ఉదయగిరి లోని గొప్ప వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ను సంప్రదించాడు. ఆయన ఒక కాటుకను తయారు చేసి ఇచ్చారు. దాని మూలంగా కంటి ముందు ఉన్న కాటరాక్ట్ పొరలు తొలగి పోయాయి. చూపు స్పష్టంగా వచ్చింది. మరో సంఘటన “ఏమమ్మా రసూల్ బి?, నువ్వు అడిగిన దానికి మందిచ్చా గదా. అది పని చేసిందా?, మళ్లీ ఎందు కొచ్చావు?” “అయ్యా మీరిచ్చిన మందు చాలా బాగా పని చేసింది. నా బిడ్డకు కడుపునిండా పాలివ్వగలుగుతున్నా. అయితే పాలిచ్చిన తర్వాత కూడా పాలు ఆగడం లేదు. నా రవిక తడిసిపోతోంది.ఏం చేయాలి”?. “సరే రేపు రా. దానికి పరిష్కారం చెబుతా.” ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన ఈ మహిళకు కాన్పు తర్వాత పాలు రాలేదు. అందుకని ఆమె ఉస్తాద్ ను సంప్రదించారు. ఇలా ఉదయగిరి పట్టణంలోనూ, చుట్టుపక్కల బద్వేలు, కనిగిరి, కావలి, ఆత్మకూరు తాలూకాల్లో ఇతర ప్రాంతాల్లో అంతు పట్టని ఏ రోగమొచ్చినా ఉస్తాద్ (గురువు గారు) ని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందేవారు. అరుదైన రోగాలకు సైతం ఆయన మందులిచ్చేవారు. ఈ విషయంలో ఆయన కొన్ని పరిశోధనలు సైతం చేశారు. తాను చేసిన పరిశోధనా ఫలితాలను పుస్తకాల రూపంలో రాశారు. ఆయన మూలికల కోసం ఉదయగిరి దుర్గం మీద రెండు మూడు రోజులు ఉండేవారట. కొన్ని పుష్పాలు అర్ధరాత్రి తర్వాత వికసిస్తాయని వాటిని అప్పుడే గుర్తించి సేకరించగలమని చెప్పేవారట. గొప్ప పఠనాభిలాషి. కొన్ని వందల పుస్తకాలను సేకరించారు. ఎన్నో వైద్య గ్రంథాలనూ సేకరించారు. ఆయన పేదవాడైనా వైద్యానికి ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. దిలావర్ భాయి వంశానికి చెందిన సత్తార్ హుస్సేన్ కుమారుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్. ఉస్తాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఉర్దూ పండితుడు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పార్సి భాషల్లోనూ మంచి ప్రవేశముండేది. ఉర్దూ, తెలుగుల్లో కవితలు, గీతాలు రాసేవారు. వాటికి తానే స్వరకల్పన చేసేవారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ఒకే సమయంలో అటు ఉర్దూలోనూ ఇటు తెలుగులోనూ అశువుగా కవిత్వం చెప్పేవారు. మొదట ఉర్దూలో చెప్పాక అక్కడ తెలుగు వారుంటే అదే భావాన్ని తెలుగు కవితా రూపంలో చెప్పేవారు. ఇందులో కొన్నిసార్లు విమర్శ లుండేవి. ఆ విమర్శలు చేసేటప్పుడు ధనిక, పేద తేడా లేదు. మనసుకేమనిపిస్తే ఉన్న పళంగా చెప్పేవారు. ఆయన ఏం చెప్పినా తిరుగు ప్రశ్నించే ధైర్యముండేది కాదు. నీతి, నిజాయితీ, ఆత్మగౌరవంతో ఉండేవారు. ఆయన మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా ఎవరైనా మాట్లాడితే చీల్చి చెండాడేవారు. ఆయన కోపం లో తిట్టినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఆనాటి జమీందారులు, షావుకారులూ మినహాయింపు కాదు. ఆయనపై చాలా గౌరవభావం ఉండేది. దానికి తోడు ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవారు. ఆకలితో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. మంచి వక్త, టీచర్ ఉదయగిరి లోని దిలావర్ భాయి వీధిలోని సత్రంలో ఉస్తాద్ పాఠాలు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, లెక్కలు బోధించేవారు. ఈ పాఠశాల సాయంత్రం నడిచేది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనేవారు. ఊళ్లో అందరూ చదువు కోవాలని భావించేవారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర చదువుకున్న ఒకరిద్దరు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఉస్తాద్ గొప్ప రచయిత ఉస్తాద్ గొప్ప కవి. సంగీత, సాహిత్య ప్రియుడు. రచయిత. ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. ఏ భాషలో రాసినా అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. ఆకులు అలములతో ఇంకును, పాళీలను తయారు చేసుకునేవారు. అది ఎలా తయారు చేయాలో కూడా రాసి పెట్టారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు. ఈయన నాటక రచయిత. వీరి కలం పేరు ఖాక్సర్. ఉదయగిరిలో మొదట ఉర్దూలో నాటకాన్ని రాసి తన శిష్యులతో ప్రదర్శించారు. అలాగే వీధి ప్రదర్శనలు చేసేవారు. ముఖ్యంగా మీలాద్- ఏ- నబి (మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి) రోజున ఆయనపై స్తోత్రాలు రాసి బాణీలు కట్టి శిష్యులతో పాడించేవారు. హజరత్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సా వలి దర్గా వద్ద జరిగే ఉరుసు లోనూ, మొహరం వేడుకల్లోనూ వీధి ప్రదర్శనలు సాగేవి. ఇందులో “కర్బలా ధర్మ యుద్ధం” ఎలా జరిగిందో ఆయా పాత్రధారులతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించేవారు. ఇది కరుణ రసంతో నిండి ఉండేది. ఉదయగిరి జమీందారు ఛాబు సాబ్ దీన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ఆయన బృందానికి అందజేశారట. ఉస్తాద్ మంచి గాయకుడు. గాత్ర శుద్ధి ఉండేది. స్వరకర్త. సంగీతంపై మంచి అవగాహన ఉండేది. ఈయన పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. మొదట రాగం పేరు చెప్పి ఎలా పాడాలో పాడి వినిపించేవారు. తర్వాత దానిని అనుసరించమని చెప్పేవారని ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన గౌస్ బాషా (89) తెలిపారు. ఆయన రాగాల పేర్లు చెబుతుంటే ఆయనకంతటి సంగీత జ్ఞానం ఎలా అబ్బిందో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. మేము ఈ పాటలను మొహరం సందర్భంలో పాడే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఉస్తాద్ శిల్పి, చిత్రకారుడు ఎటువంటి పదార్థాలతో నైనా బొమ్మలను తయారు చేసేవారు. ఆయన ఏ రూపం అనుకుంటే ఆ రూపాన్ని తనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే వారు. ఉస్తాద్ మంచి చిత్రకారుడు. ఎన్నో చిత్రాలను గీశారు. తను రాసిన చాలా పుస్తకాల్లో చిత్రాలను గీసి వాటికి వివరణ ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఈయన చిత్రాలను గీసేవారు. అవి అందర్నీ అబ్బురపరిచేవి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉస్తాద్ వృత్తిరీత్యా గుర్రపు నాడాల తయారి, చెక్క నగిషీ పనులు చేసేవారు. ఆయన గుర్రపు నాడాను, మేకులను తయారు చేస్తే మెషిన్ లో తయారు చేసినట్లే ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు . చెక్క పై నగిషీ చెక్కడం లో నేర్పరి. ఆయన ఏ పని చేసినా అందులో మాస్టర్ (ఉస్తాద్). అయితే వృత్తిని ప్రవృత్తి మించిపోయేది. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ప్రవృత్తిగా ఉన్న వైద్యం, మూలిక వైద్య పరిశోధనలపై ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఆయనకు శరీర ధర్మ శాస్త్రం (అనాటమి)పై గొప్ప అవగాహన ఉండేది. దీనికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉర్దూలో రాశారు. అందులో కొన్ని రేఖా చిత్రాలను కూడా గీశారు. శరీరంలో ఏ అవయవం, ఏ పని చేస్తుందో అందులో రాశారు. అక్కడ సమస్యలొస్తే ఏ విధమైన వైద్యం చేయాలో కూడా వివరించారు. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషిని చూస్తే అతనికొచ్చిన రోగమేమిటో ఇట్టే కనిపెట్టేవారు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు తమ బాధేమిటో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అరుదుగానే కొన్ని ప్రశ్నలడిగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు తారసపడిన వ్యక్తుల్లో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని చెప్పేవారు. చిన్నదైతే దానికి సంబంధించిన చిట్కాలు తెలిపేవారు. పెద్దదైతే మందు తయారు చేసిచ్చేవారు. ఆయన వెళ్లే దారిలో ఎవరైనా ఉమ్ము ఊసి ఉంటే అక్కడే నిలబడి పోయేవారు. ఆ ఉమ్మును చూసి ఆ మనిషికి వచ్చిన రోగమేమిటో పక్కనున్న వారికి చెప్పేవారు. కొంతమంది రోగులొచ్చినప్పుడు పరిస్థితి చేయి దాటిందని భావిస్తే మందిచ్చేవారు కాదట. ఆ కాలంలోనే కుష్టు వ్యాధికి మందును కనిపెట్టారు. ఆ మందును ఎలా తయారు చేయాలో రాసి ఉంచారు. ఆయన గొప్ప సైకాలజిస్ట్ కూడా. మనోవ్యాధికి మందు లేదనేది పాత సామెత. అయితే కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కిటుకుల ద్వారా దీనిని నయం చేయవచ్చునని నమ్మేవారు. అదే విషయాన్ని ఆయన గ్రంథస్తం చేశారు. ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో ఆచరించి చూపారు. కొన్ని వందల వ్యాధులకు ఆయన దగ్గర చికిత్స ఉండేది. ఎప్పటికప్పుడు వాటిని రాసి ఉంచుకున్నారు. పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు తన వైద్యంతో సంతాన ప్రాప్తి కలిగేట్లు చేశారు. ఆయన మనవడు హుస్సేన్ భాష ఆయన రాసి ఉంచిన పుస్తకాలను అనుసరించి ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. ఆర్.ఎం.పి సర్టిఫికెట్ తో పాటు ఆయుష్ లైసెన్స్ కూడా పొందారు. తాత గారి బాటలోనే ఇప్పటి దాకా మందు ఖరీదైనది అయితే సామగ్రిని తెప్పించుకొని తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. గొప్ప కవి ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం(భక్తి) ఇప్పటికీ ఖసీదాల (భక్తి గేయాల) రూపంలో ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. తెలుగులోనూ కొన్ని రచనలు చేశారు. కొంతమంది శిష్యులు ఆయన మరణాంతరం పుస్తకాలను తీసుకెళ్లారు. ఆయన సంతానం పుస్తకాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఉస్తాద్ పలు భక్తి గీతాలను రాయడమే కాకుండా స్వరాలను కూర్చారు. అవి ఏ సినిమా పాటలకు అనుసరణ కాదు. అందులోని అర్థం ఇప్పటికీ ప్రశంసనీయమే. ఇస్లామిక్ పండితుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ఇస్లామిక్ పండితుడు. ఖురాన్ (అల్లా వాక్కు) హదీస్ లు (మహా ప్రవక్త మహమ్మద్ స. అ.వ. స. వారి వాక్కు) లను ఇతర ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. అంతేకాదు భారత, భాగవతాలను కూడా చదువుకున్నారు. ఉర్దూ పండితులతో పాటు తెలుగు పండితులను కూడా కలిసి చర్చించేవారు. ఆనాటి ఉదయగిరి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువర్యులు హజరత్