రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా
వెంకటాచలం నవంబరు (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు డేవిడ్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, సత్య ప్రియ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రానికి పూలదండ అర్పించి ఆయన చేసిన రాజ్యాంగ సేవలను స్మరించారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులు కలిసి రాజ్యాంగ పీఠికను వాచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డేవిడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో ప్రారంభమైన రచనా ప్రక్రియ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సాగి, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి విద్యార్థులు రాజ్యాంగ విలువలను ఆచరించి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. తరువాత వక్తృత్వ, క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి, జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. ఉపాధ్యాయులు కొమ్మల కృష్ణయ్య, శ్రీలక్ష్మి, సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.











