విశాఖపట్నం
*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలి* *సఫాయి కర్మచారీలకు ఉపాధి శిక్షణ ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులకు తోడ్పాటు అందించాలి *జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం నవంబర్ 3 పున్నమి ప్రతినిధి:-* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం సాయంత్రం జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, సీపీ శంఖబ్రత బాగ్చీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు. విచారణ పూర్తయిన కేసుల్లో పీపీల సాయం తీసుకొని ముందుకు సాగాలని, విచారణ దశలో ఉన్నవాటిలో వేగం పెంచాలని సూచించారు. విచారణ దశలో 113, పెండింగ్ ట్రయిల్ లో 689 కేసుల విషయంలో అధికారులు, పీపీలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. బాధితులకు నిర్ణీత కాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, దర్యాప్తు విషయంలో జాగ్రత్త వహించాలని, బాధితులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. *సఫాయి కర్మచారీలకు, వారి కుటుంబ సభ్యులకు ఉపాధి శిక్షణ* సఫాయి కర్మచారీలుగా పని చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉపాధి శిక్షణ అందించాలని, తద్వరా స్వయం ఉపాధి లేదా కంపెనీల్లో ఉద్యోగావకాలు కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. వీరిని గుర్తించేందుకు ఇప్పటికే నిర్వహించిన సర్వే వివరాలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వీరందరికీ సెమ్స్, జిల్లా నైపుణ్య సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని సూచించారు. రైల్వే సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులపై ప్రత్యేక పరిశీలన చేయాలని చెప్పారు. రుణ సదుపాయం కల్పనలో, గృహ నిర్మాణ పథకాల్లో ప్రాధాన్యత ఇచ్చి సహకరించాలన్నారు. పని ప్రాంతాల్లో వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పారు. రైల్వే పరిధిలో సఫాయి కర్మచారీల సమస్యలపై సభ్యులు కొన్ని సమస్యలను ప్రస్తావించగా సానుకూలంగా స్పందించి చర్యలకు ఉప క్రమించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 37వ వార్డులో సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ అధ్వానంగా ఉందని, నీరు లేదని కమిటీ సభ్యుడు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన నగర పరిధిలోని అన్ని సులభ్ కాంప్లెక్సులను పరిశీలించాలని, రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశాల్లో పండుల రవీంద్రబాబు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డీసీపీలు మణికంఠ, మేరీ ప్రశాంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, ఇన్ఛార్జి డీఆర్వో సత్తిబాబు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, పలువురు ఏసీపీలు, వివిధ విభాగాల అధికారులు, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాంబాబు, ఆంజనేయ, మాలతి తదితరులు పాల్గొన్నారు.