వరంగల్ పోలీస్ కమిషనరేట్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత (33) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం మట్టెవాడలోని తన నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు సంగీత రాసిన ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) లభ్యమైంది. తన మరణానికి తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సదరు కానిస్టేబుల్ తనను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాడని, ఆ వేధింపులు భరించలేకనే ఈ విపరీత నిర్ణయం తీసుకుంటున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. సంగీత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్య లేఖలో పేర్కొన్న కానిస్టేబుల్ ఎవరు? వేధింపుల వెనుక ఉన్న కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే ఇలాంటి వేధింపులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.



