విశాఖపట్నం
*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి* నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (VCSC) మీటింగ్ ను నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు విశాఖపట్నం నగరంలో భద్రత, సంక్షేమం మరియు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పోలీస్ కమిషనర్ గారు “సెవెన్ డ్రీమ్స్ (Seven Dreams)” అనే దూరదృష్టి గల ప్రణాళికను వెల్లడించారు. విశాఖ నగరం ముందుగా దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గల నగరంగా, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇది కేవలం పోలీస్ శాఖ కల మాత్రమే కాకుండా, నగర ప్రజలందరి కలగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనలో విశాఖపట్నం భద్రతా మండలి (Vizag Security Council) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ గారు పేర్కొన్నారు. మొదటిది ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని, ప్రణాళిక ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుండి AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను నగరంలో ప్రవేశపెట్టనున్నామని, ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ సమకాలీకరణ జరిగి, వాహనాల సగటు వేగం పెరిగి ప్రజలు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని తెలిపారు. ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి, ఉల్లంఘనదారులకు ఇంటికి చేరకముందే చలాన జారీ అయ్యే విధంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందని చెప్పారు. ఈ విధానంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత పూర్తిగా ఆధునిక సాంకేతికత తీసుకుంటుందని, ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ నియంత్రణపై మాత్రమే దృష్టి సారిస్తారని తెలిపారు. ట్రాఫిక్ వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేయడంలో, అలాగే ట్రాఫిక్ సమస్యలపై స్వతంత్రంగా అంచనా వేయడంలో భద్రతా మండలి సహకారం అవసరమని పేర్కొన్నారు. రెండవది మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా భర్తలు లేదా కుటుంబ సభ్యులచే హింసకు గురైన మహిళలు, అలాగే పిల్లలతో విడిచిపెట్టబడిన మహిళలకు సమాజం అండగా నిలవాలని, భద్రతా మండలిలోని దాతలు మరియు దయాగుణం కలిగిన వ్యక్తుల సహకారంతో బాధిత మహిళలకు పునరావాసం కల్పించి, వారి పిల్లలకు విద్య అందించేలా నిధులు సమకూర్చాలన్నదే తమ ఆశయమని సీపీ గారు వెల్లడించారు. మూడవది సమాజంలోని బలహీన వర్గాలకు జీవనోపాధి మరియు పునరావాసం కల్పించాలని, ఆశ్రయం లేని వారు, ట్రాన్స్జెండర్లు, జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీలు, డ్రగ్ మరియు మద్యం వ్యసనాల నుంచి కోలుకున్నవారు, నిరుద్యోగులైన పోలీస్ సిబ్బంది పిల్లలు మరియు రిటైర్డ్ హోమ్ గార్డులకు తగిన ఉపాధి కల్పిస్తే వారు తప్పుదారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవని తెలిపారు. సమాజం అంగీకారం మరియు సహకారం లభిస్తే విశాఖపట్నం మరింత సురక్షితమైన నగరంగా మారుతుందని సీపీ గారు తెలిపారు. నాలుగవది హోమ్ గార్డుల సంక్షేమంపై కమిషనర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, హోమ్ గార్డులు 60 ఏళ్ల తర్వాత ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పదవీ విరమణ చేయాల్సి వస్తోందని, ఉద్యోగ భద్రత లేకుండా, అనారోగ్యంతో ఉన్నప్పుడు వేతనం కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని, అందుకే హోమ్ గార్డ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేయాలనీ తెలిపారు. ఐదవది నగర భద్రతను మరింత పటిష్టం చేసే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, ప్రతీ ప్రాంతంలో నైట్ విజన్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్ను క్లౌడ్లో భద్రపరచాలని, బిజీ కూడళ్లలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జాతీయ లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్లలో ఉన్న నేరస్థులను గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డ్రోన్లతో పాటు, నిఘా, నేర నిరోధం, సైరన్ మరియు పబ్లిక్ అడ్రస్ వ్యవస్థలతో కూడిన ఆధునిక డ్రోన్లు, అలాగే విపత్తుల సమయంలో ఆహారం మరియు మందులు సరఫరా చేసే డ్రోన్లు మరింత అవసరమని, ప్రతి పోలీస్ స్టేషన్లో కనీసం ఒక డ్రోన్ ఉండాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఆరవది బీచ్ భద్రత మరియు ట్రాఫిక్ ఉపకరణాలపై దృష్టి సారించాలని, మునిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు, లైట్లు, లైఫ్ గార్డ్లు ఏర్పాటు చేయాలని, మునిగిపోతున్న వారిని రక్షించేందుకు రిమోట్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ బోట్లు మరియు లైఫ్ జాకెట్లు అవసరమని, అలాగే మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించేందుకు మరిన్ని బ్రీత్ ఎనలైజర్లు, అతివేగాన్ని గుర్తించేందుకు స్పీడ్ లేజర్ గన్లు అవసరమని పేర్కొన్నారు. ఏడవది ప్రజల్లో అవగాహన మరియు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీపీ గారు, ప్రతి రకమైన సైబర్ నేరంపై తెలుగులో అవగాహన చిత్రాలను రూపొందించి, వాటిని వీధుల్లో మొబైల్ వాహనాల ద్వారా ప్రదర్శించాలని, వ్యసన విముక్తి కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రతి డ్రగ్కు అనుగుణంగా ఉత్తమ చికిత్స అందించే కేంద్రం ఏర్పాటు చేయడానికి భద్రతా మండలి సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు అందించి ప్రతి బాలికకు టీకా అందిన దేశంలో తొలి నగరంగా విశాఖపట్నాన్ని నిలపాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే టైఫాయిడ్, న్యుమోనియా, ఇన్ఫ్లుయెంజా వంటి ముఖ్యమైన టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళలపై ఆన్లైన్ నేరాలు, ఆస్తి నేరాలు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మరియు ఆర్థిక నేరాలపై క్రమం తప్పకుండా ప్రజలకు చేరువయ్యే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజలు, పోలీసులు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని కమిషనర్ గారు పేర్కొన్నారు. చాలా కాలం నుండి భద్రతా మండలి నిద్రావస్థలో ఉందని, ఇకపై చురుకుగా పనిచేసే, తనను కూడా నిద్రపోనివ్వని సభ్యులు కావాలని,, పోలీస్ శాఖ తరఫున గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్లను సమన్వయాధికారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి పలువురు ప్రతినిధులు విశాఖ నగర అభివృద్ధికి మరియు పలు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడానికి తమ కార్యా చరణ తెలియజేయడం జరుగుతుంది,తిరిగి 2026 జనవరి 07 వ తేదీన రెండవ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని తీర్మానించారు. ఈ కార్యక్రమం నందు డిసిపి-I గారు, డి.సి.పి-II గారితో పాటుగా ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, నగర VCSC నాయకత్వ బృందం , వీకిస్సీ సభ్యులు, పలు పరిశ్రమల ప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు