హెర్బల్ వ్యాపార ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ బాగోతం
గుంటూరు నేరవార్తలు, న్యూస్ టుడే: హెర్బల్ పౌడర్ విక్రయాల ముసుగులో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఆరుగురిని పట్టాభిపురం, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన తాతినేని శ్రీనివాసరావు వికాస్నగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని, కొరిటెపాడుకు చెందిన యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలిసి సెల్ఫోన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా లాగిన్ ఐడీలు, పాస్వర్డులు పంపి ఫోన్పే ద్వారా నగదు జమ చేయించేవారని తెలిపారు. పోలీసుల దాడుల్లో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.13.60 లక్షల నగదు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన రూ.5.05 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.







