వెలుగుమట్ల బాధితుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుంది మంత్రి పొంగులేటి నోటిని అదుపులో ఉంచుకోవాలి – దేవకీ వాసుదేవరావు
ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో నివసిస్తున్న పేద ప్రజలను ఫిబ్రవరి 24 నుండి రోడ్డుపైకి నెట్టివేసి వారితో మూడు ముక్కుల ఆట ఆడుతున్నట్లుగా జిల్లా కు చెందిన ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నారని దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదల జీవితాలతో ఇలా ఆడుకోవడం దుర్మార్గమని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నోటి కి వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నోటి ని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా? ప్రజా పాలన అంటే ప్రజలను రోడ్డున పడేయడమేనా?” అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు మారి అధికార పదవులు పొందిన నాయకులు ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. 31.7 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి దాని విలువ రూ.250 కోట్లు అని గొప్పలు చెప్పుకుంటున్న జిల్లా కలెక్టర్కు అది నిజంగా ప్రభుత్వ భూమా లేదా భూదాన్ భూమా అనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని దేవకీ వాసుదేవరావు తెలిపారు. సమావేశం లో జిల్లా సీనియర్ నాయకులు మండధపు సుబ్బారావు, గుత్త వెంకటేశ్వర్లు, వంకదాని రామకృష్ణ లతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.











