రాజమహేంద్రవరం, తేదీ: 25.09.2025
*సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలి*
*అన్ని రంగాలకు రుణ లక్ష్యాల అమలులో సమన్వయం అవసరం*
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
సిసిఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.
గురువారం బొమ్మూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (DLCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా రుణాలు మంజూరు పై బ్యాంకర్లకు కలెక్టర్ కీర్తి చేకూరి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. రైతులకి “బ్యాంకులు రుణాల మంజూరులో పాస్బుక్లలో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,314 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా, జూన్ 30 నాటికి రూ.4,047 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఎంఎస్ఎంఈ లకు రూ.4,588 కోట్లలో రూ.2,004 కోట్లు విడుదలయ్యాయనీ, మొత్తం జిల్లాలో అన్ని రంగాలకు రూ.23,930 కోట్ల లక్ష్యం పెట్టగా, ఇప్పటివరకు రూ.8,678 కోట్లు విడుదల చేశారన్నారు.
జిల్లాలో 66,584 మంది సిసిఆర్సి కార్డుదారులు ఉండగా, 5,521 మంది కౌలు రైతులకు కేవలం రూ.20 కోట్ల రుణాలు మంజూరు అవ్వడం పై కలెక్టర్ కీర్తి చేకూరి ప్రశ్నించారు. సిసిఆర్సి కార్డులు ఉన్న రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బ్యాంకర్లు కారణాలు చెప్పాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయం చేసుకొని తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పీఎం-EFME, పీఎం-EGIP, ముద్ర పథకాల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే దిశగా రుణాల లక్ష్యాలను పెంచాలని సూచించారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్టాప్స్ అమలు, పీఎం విశ్వకర్మ యోజన కింద సాంప్రదాయ వృత్తుల వారికి రుణాలు అందించడం వేగవంతం చేయాలని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సమన్వయ కర్త గా ఎల్టీఎం డివి ప్రసాద్, ఆర్బిఐ ఎల్డిఓ బెహరా గిరిధర్, నాబార్డ్ డీడీఎం ఆర్. చక్రధర్, యూనియన్ బ్యాంక్ ఆర్ హెచ్ ఏ విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, పీడీ డిఆర్డిఏ ఎన్ వి వి ఎస్ మూర్తి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఈ కె. తిలక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు, బ్యాంకర్లు ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.


