అమరావతి, నవంబర్ (పున్నమి న్యూస్): మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు. శ్రీ చరణి కృషి, ప్రతిభను గుర్తించి ఆమెకు రూ.2.5 కోట్ల నగదు నజరానా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అలాగే ఆమెకు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు 1000 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 అధికారిగా ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను శ్రీ చరణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పుష్పగుచ్ఛం అందించి శ్రీ చరణిని సాదరంగా స్వాగతించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో టీమిండియా మహిళా జట్టు ప్రదర్శనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటిన శ్రీ చరణి కృషి అందరికీ ఆదర్శమని, యువతీ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
శ్రీ చరణి ఈ సందర్భంగా వరల్డ్ కప్ జట్టులోని సహచరుల సంతకాలతో కూడిన టీషర్ట్ను ముఖ్యమంత్రికి బహూకరించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం, భారత మహిళా జట్టు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మంత్రి వంగలపూడి అనిత, మంత్రి సవిత, మంత్రి సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు హాజరయ్యారు.
గన్నవరం ఎయిర్పోర్టులో శ్రీ చరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు, క్రీడా అధికారులు ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మహిళా క్రికెట్ను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.


