ఉదయగిరి పట్టణంలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా నిర్మించబడిన ఈ కార్యాలయం మండల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ నూతన భవనం మొత్తం రూ.83.68 లక్షల వ్యయంతో ఇందులో జిల్లా పరిషత్ గ్రాంట్ నుంచి రూ.36.20 లక్షలు, అలాగే మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మిగతా నిధులను వినియోగించి, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కార్యనిర్వహణలో సౌలభ్యం కల్పించేలా, అధునాతన హంగులతో నిర్మించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మండల అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలిచే మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇలాంటి ఆధునిక భవనంలో కార్యకలాపాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమని అన్నారు. పరిపాలనా వ్యవస్థ బలోపేతానికి, ప్రజలకు సేవలు మరింత వేగవంతంగా అందించడానికి ఇలాంటి మౌలిక వసతులు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కార్యాలయాలు బాగుంటేనే పరిపాలన కూడా అంతే పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుంది” అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే అధికారులు, సిబ్బంది కార్యాలయాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో, వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.


