వర్షాలు వరమై – చిట్వేల్లో హరిత హారం పునరుద్ధరణ : ఎంఈఓ మోటు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కల నాటకం
వర్షాలు కురుస్తున్న ఈ సీజన్ను సద్వినియోగం చేసుకుంటూ చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి మోటు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు విరివిగా చెట్లు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాకాలం చెట్ల పెరుగుదలకు అత్యుత్తమ సమయం అని, ఈ సమయంలో నాటిన మొక్కలు బలమైన వేళ్లను అభివృద్ధి చేసుకుని దీర్ఘకాలం నిలబడతాయని ఆయన అన్నారు. వృక్షాలు వర్షాలను ఆకర్షించి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని ఆయన పేర్కొన్నారు. మొక్కల పెంపకంతో ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ముందుండే సి.హెచ్.ఎస్ సేవా సంస్థ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ఓజోన్ పొర దెబ్బతింటున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత సమస్య పెరగవచ్చని హెచ్చరించారు. అందరూ ప్రకృతి సంరక్షణ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటే యజ్ఞంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. వృక్షాలు సూర్యకాంతిని శక్తిగా మార్చి జీవులకు ప్రాణవాయువును అందిస్తాయని, అందువల్ల వృక్షాలను నరికి వేయకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఈశ్వరయ్య, సిఆర్పి చంద్ర, కార్యాలయం సిబ్బంది గంగాదేవి, పెంచలయ్య, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్, షేక్ షబ్బీర్ బాషా, అష్ఫాక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.









