విశాఖపట్నం
*పంట పాడైపోతుందనే దిగులు లేదు… దళారులు మోసగిస్తారే భయం లేదు…* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *అమ్మిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమవుతున్న ధాన్యం డబ్బులు *ప్రత్యేక కొనుగోలు కేంద్రాల ద్వారా 10 వేల టన్నులు సేకరించేందుకు చర్యలు *ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లాలోని గ్రామీణ మండలాల రైతులు *సాధారణ రకం క్వింటాకు రూ.2,369, సన్న రకం ధాన్యానికి రూ.2,389 చెల్లింపులు విశాఖపట్టణం, డిసెంబర్ 02 ః ఇప్పటికే రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. వారికి దగ్గర్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి.. సిబ్బందిని అక్కడే అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తోంది. పండిన పంటను వెనువెంటనే అమ్మకునేలా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయటంతో పాటు గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ అన్నదాతల మన్ననలు పొందుతోంది. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాల వల్ల స్థానిక రైతు సేవా కేంద్రం పరిధిలోనే సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. తేమ శాతం చూడటంతో పాటు, ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా షెడ్యూల్ కూడా ఇస్తున్నారు. జీపీఎస్ అనుసంధానమైన వాహన ఏర్పాటు చేయటంలో, ఎఫ్.టి.వో.లు జనరేట్ చేయటంలో కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నారు. ధాన్యం అమ్మిన కొన్ని గంటల సమయంలోనే డబ్బులు జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. *ప్రత్యేక కేంద్రాల ద్వారా పదివేల టన్నుల ధాన్యం కొనుగోలు* జిల్లాలోని గ్రామీణ మండలాల పరిధిలో పది వేల టన్నుల ధాన్యం సేకరించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. దీనికి గాను అధికారులు పద్మనాభం మండల పరిధిలో 5, భీమిలి మండలంలో 2, ఆనందపురం మండలంలో 1, పెందుర్తి మండల పరిధిలో 2 కేంద్రాలు.. మొత్తం 10 ఏర్పాటు చేశారు. గతేడాది ఐదు వేల టన్నులు లక్ష్యం కాగా.. 5,600 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది పదివేల టన్నులు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన ఆరు మిల్లులను గుర్తించి లావాదేవీలు కొనసాగిస్తున్నారు. గతేడాది సాంబా మసూరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది స్వర్ణ, 1121 వంటి సన్నరకంతో పాటు సాంబా మసూరి కూడా తీసుకోవటం గమనార్హం. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి రూ.2,369, సన్న రకాలకు రూ.2,389 చెల్లింపులు చేస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ సారి రూ.69 క్వింటాకు అదనంగా చెల్లిస్తోంది. జిల్లాలో సుమారు 11,700 ఎకరాల్లో ధాన్యం పండిస్తుండగా.. 27వేల టన్నుల దిగుబడి వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. *రైతు సేవా కేంద్రాలను సంప్రదిస్తే చాలు.. సేవలన్నీ అందుతాయి* ధాన్యం పండిన రైతులు స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాలను సంప్రదిస్తే చాలు అన్ని రకాల సేవలు లభ్యమవుతాయి. ముందుగా పండిన ధాన్యాన్ని టెక్నికల్ అసిస్టెంట్ పరిశీలిస్తారు. తేమశాతం ఇతర వివరాలను అందజేస్తారు. తర్వాత రైతు సేవా కేంద్రంలో సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంటు వివరాలను నమోదు చేసి సంబంధిత రైతుకు షెడ్యూల్ ఇస్తారు. జిల్లాలో నిర్ణయించిన ఆరు మిల్లుల్లో ఏదొక మిల్లులో ధాన్యం అమ్ముకునేలా సమచారం అందిస్తారు. జీపీఎస్ అనుసంధానమైన వాహనం ద్వారా ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తారు. ఒకవేళ రైతులే జీపీఎస్ అనుసంధానమైన వాహనం తెచ్చుకున్నట్లయితే సంబంధిత నగదును ప్రభుత్వం చెల్లించేస్తుంది. ఈ విధంగా సోమవారం (డిసెంబర్ ఒకటో తేదీ)నాటికి పెందుర్తి మినహా మిగిలిన మూడు మండలాల పరిధిలో 167 మంది రైతుల నుంచి 821.52 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 24-48 గంటల వ్యవధిలోనే రూ.1.95 కోట్ల చెల్లింపులు జరగటం విశేషం. 1. *దళారుల బెడద తగ్గింది… ధర గిట్టుబాటు అయ్యింది..* ః బోణి గోవింద, బోణి గ్రామం, ఆనందపురం మండలం ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల దళారుల బెడద తగ్గింది. వాళ్లయితే తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు. నేను 1121 సన్నరకం బియ్యం అమ్మాను. క్వింటాకు రూ.2,389 చెల్లించారు. అదే దళారులైతే రూ.1800 గానీ రూ.1900 గానీ ఇచ్చేవారు. వారికైతే తరుగు కింద క్వింటాకు ఐదు కేజీల ధాన్యం ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చేది. నేను 174 బస్తాల ధాన్యం విక్రయించాను. నాకు 24 గంటల్లో డబ్బులు వచ్చేశాయి. నాతో పాటు అమ్మిన వారికి కూడా నగదు జమ అయ్యింది. 2. *అధికారులు, సిబ్బంది బాగా స్పందిస్తున్నారు…* ః మద్దిల ప్రకాశ్, బోణి గ్రామం, ఆనందపురం మండలం మా ప్రాంతంలో బోణి గ్రామంలోనే ముందుగా కోతలు మొదలయ్యాయి. ఇక్కడ అధికారులు, సిబ్బంది స్పందన బాగుంది. మేము ఏం అడిగినా ఓపిగ్గా చెబుతున్నారు. వాళ్లే కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఎప్పుడు ధాన్యం తేవాలో చెబుతున్నారు. దాని ప్రకారం నేను ఒక సారి ఐదు టన్నులన్నర, ఇంకొక సారి ఐదు టన్నులు కలిపి మొత్తం 180 బస్తాల ధాన్యం అమ్మాను. ఒక రోజు దాటగానే డబ్బులు అకౌంట్లో పడ్డాయి. 3. *అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను* ః బోణి అప్పలరాజు, బోణి గ్రామం, ఆనందపురం మండలం ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సాయమందించారు. నేను 1121 సన్న రకం ధాన్యం పండించాను. 11 టన్నులు అమ్మాను. డబ్బులు రెండో రోజు పడ్డాయి. మా ఊరులోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటంతో కోత అయిన వెంటనే ధాన్యం అమ్ముకోగలిగాను. దళారులైతే ఏవేవో చెప్పి బోలెడు కోతలు వేసేస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. అంతా బాగానే జరిగింది. 4. *చాలా సంతోషంగా ఉంది…* ః ఉప్పలాల ఉదయ భాను, బోణి గ్రామం, ఆనందపురం మండలం వర్షాలు పడిపోతాయని అందరం ఆందోళన చెందాం. మా ఊరులో కాస్త ముందుగానే కోతలు అయిపోవటంతో ఊపిరి పీల్చుకున్నాం. అక్కడక్కడ శివారు పొలాల వారు ఇంకా కోస్తున్నారు. చాలా మంది ధాన్యం వెంటవెంటనే కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించేస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ పడకుండా ధాన్యం అమ్ముకోగలిగాం. 190 బస్తాల ధాన్యాన్ని అమ్మాను. *రైతులకు ఇబ్బంది రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాం* *ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా కలెక్టర్, విశాఖపట్టణం* ధాన్యం పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. సాగు వివరాల ఆధారంగా గ్రామీణ మండలాల పరిధిలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జీపీఎస్ కు అనుసంధానమైన వాహనాల ద్వారా ధాన్యం మిల్లులకు తరలించటం ద్వారా అవకతవకలకు వీలులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. జిల్లాలో ఆరు మిల్లులను గుర్తించాం. రైతులు వారికి ఇష్టమైన మిల్లుకు ధాన్యం విక్రయించుకొనేలా వెసులుబాటు కల్పించాం. వర్షాలు కారణంగా నష్టం వాటిల్లకూడదనే ముందు చూపుతో కాస్త ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ప్రక్రియ అంతా సజావుగానే జరిగిపోతోంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేవు. *రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలి* రైతుల సౌకర్యార్థం వారికి దగ్గరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్యవర్తులను ఆశ్రయిస్తే కమీషన్ల రూపంలో దోచుకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గంటల వ్యవధిలోనే డబ్బు అందిస్తున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారుల సహాయంతో ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఏమైనా సమస్యలున్నట్లయితే స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే వెనువెంటనే పరిష్కరిస్తాం.