విశాఖపట్నం
*చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, భద్రత కోసం పటిష్ట చర్యలు* *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మూడు వరుస సమావేశాలు *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలో బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన చైల్డ్ వెల్ఫేర్ & ప్రొటెక్షన్ కమిటీ, సిఫారసుల కమిటీ, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమావేశాలు జరిగాయి. వీటిల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు, అధికారులు భాగస్వామ్యమయ్యారు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి తుది నమోదు సర్టిఫికెట్ల జారీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సిఫారసులు కలెక్టర్ చేశారు. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్, సంరక్షణ, రక్షణ, పునరావాసానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల అక్రమ రవాణ నిరోధానికి, బాల్య వివాహాల నివారణకుచ, పిల్లల పునరావాసం కోసం తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాల కార్మిక వ్యవహారాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, బాల్య వివాహాల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రాప్ఔట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని టీకాలు సమయానికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. బాల, బాలిక సంరక్షణ గృహాలను పక్కాగా నిర్వహించాలని, వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు సూచించారు. పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవలందించాలని చెప్పారు. ఈ క్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రామలక్ష్మి శాఖాపరమైన అంశాలపై వివరించారు. అనంతరం అధికారులంతా కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువెనైల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.