*సహారా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు*
మంచిర్యాల, జులై 22, పున్నమి ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు మంగళవారం ప్లే కార్డ్స్ పట్టుకొని డిపాజిట్ దారులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టిన లక్షలాది రూపాయల డబ్బులను భవిషత్తులో తమ కూతుర్ల పెళ్లిళ్ల కోసం, కొడుకుల చదువుల కోసం, చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశ్యంతో సహారా ఇండియాలో డిపాజిట్ చేశామని తెలిపారు. డిపాజిట్ చేసిన పాలిసీలు మెచ్యూరిటీ పూర్తి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా, చెప్పులు అరిగేలా సహారా ఆఫీస్ ల చుట్టూ తిరిగినా డిపాజిట్ డబ్బులను చెల్లించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేడు కార్యాలయం ముందు ఆందోళనకు దిగామని, తమ డిపాజిట్ లను వెంటనే చెల్లించకపోతే తమ కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మ హత్యలు చేసుకోవడమే శరణ్యమని బాధితులు విలపించారు. సహారా బాధితుల సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా సహారా కార్యాలయంలోని సిబ్బందికి సహారా ఇండియా పాలిసీలు మెచ్యూరిటీ పూర్తయిన ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, లేని ఎడల సహారా ఇండియా కార్యాలయాల ముందు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని బాధితులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సహారా బాధితుల సంఘం నాయకుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు దండు రాజమౌళి, జి.ప్రభాకర్, ఎం. కాంతయ్య, పి. చంద్రకాంత్, ఎస్. భీమేష్, బాలు, తదితరులు పాల్గొన్నారు.


