రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్యలపై సీఎం సానుకూల స్పందన – తక్షణ చర్యలకు హామీ
మంగంపేట, చిట్వేల్లో ఏపీఎండీసీ విద్యా సంస్థల ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ అంగీకారం
రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, పౌర అవసరాల సాధన, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలియజేసిన రూపానంద రెడ్డి, సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తదనంతరం, ఐటి మరియు విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని కూడా విజయవాడ ఉండవల్లి నివాసంలో ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో ఏపీఎండీసీ స్కూల్కు అదనపు భవనం, ఇంటర్ కాలేజీ మరియు చిట్వేల్ మండలంలో కొత్త ఏపీఎండీసీ స్కూల్ ఏర్పాటు చేయాలని రూపానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, “ఈ ప్రతిపాదనలు తప్పకుండా ఆమోదిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, విద్యా, ఉపాధి రంగాల అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, గ్రామీణ విద్యారంగ బలోపేతం వంటి అంశాలపై కూడా మంత్రితో సమగ్రంగా చర్చించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఇచ్చిన హామీలతో ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి పథంలో రైల్వే కోడూరు ముందుకు తీసుకెళ్లే దిశగా రూపానంద రెడ్డి చేస్తున్న కృషిని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.


