

ప్రతీ విద్యార్థి “కలాం సర్” ను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థానంలో నిలుస్తారని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి. సిందూర అన్నారు. స్థానిక విశాఖ కోలనీలోగల శ్రీ అక్షర పాఠశాలలో, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించారు.
అధ్యక్షురాలు డా.పైడి.సిందూర మాట్లాడుతూ ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, ఉపాధ్యాయులు, డా. ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన నిర్వహిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించడానికి, స్ఫూర్తినివ్వడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరుపొందిన ఆయన, గొప్ప సైంటిస్ట్ గానే కాకుండా మానవతావాదిగా కూడా పేరు పొందారన్నారు. అవినీతి ఆరోపణలు లేని గొప్ప వ్యక్తి కలాం అని, రాజకీయ చరిత్ర లేకుండానే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు.
పర్యావరణ పరిరక్షణ మన ఊరు– మనబాధ్యతలో భాగముగా కాలుష్యరహిత జిల్లాగా మార్చటం మనతోనే మొదలుపెడదామని, ప్లాస్టిక్ ను అంతం చేసి, ప్రపంచాన్ని కాపాడుదామని పలు సూచనలను అందించారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న జిఎన్వి జ్యూయలర్స్ ఎండి ఊన్న కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలాం గారు ఇప్పటికీ ఎందరికో రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన ఆ పదవికే వన్నెతెచ్చారన్నారు.
ఆయన సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించిందని, భారతదేశ విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారన్నారు. విద్యార్థులంటే ఆయనకు చాలా అభిమానమని, ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగిస్తూనే తుది శ్వాస విడవటంతో ప్రపంచమంతా కన్నీటిపర్వమయ్యారన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, సభ్యులు పొడుగు. చరణ్, చౌదరి శ్రీనివాస్, శ్రీ అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ హరిత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

