గ్యాస్ కొరతలోనూ హోటల్ ఆగదు – కట్టెల పొయ్యితోనే ప్రజలకు ఆహారం అందిస్తున్న హోటల్ నిర్వాహకుడు
ఖమ్మం మార్చి
( పున్నమి జిల్లా ఇంచార్జి )
గ్యాస్ కొరత నేపథ్యంలో ఖమ్మం నగరంలో అనేక హోటళ్లు మూతపడుతున్న సమయంలో, కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్ నిర్వాహకుడు వినూత్న నిర్ణయం తీసుకుని ప్రజలకు నిరంతరంగా ఆహారం అందిస్తున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి వంటలు చేసి వినియోగదారులకు భోజనం, అల్పాహారం అందిస్తున్నారు.
ఈ కట్టెల పొయ్యిని ఏర్పాటు చేయడానికి సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యిందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కట్టెల పొయ్యితోనే వంటలు చేసి ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆహారం అందిస్తామని వారు పేర్కొన్నారు.
గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్లు మూతపడిన పరిస్థితిలో, ఈ హోటల్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహారం అందిస్తాం అని నిర్వాహకులు తెలిపారు.



