ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యంగా మేనేజిమెంటు వారి కోసం, పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయిలో ఉన్న మేనేజర్ల కోసం రాయబడింది. ముఖ్యంగా శెలవు మంజూరు చేసే, లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం. ‘శెలవు’ అనేది తమ హక్కుగా ఉద్యోగులు భావిస్తారు. శెలవు అనేది బాధ్యతగా వాడాలనీ, అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా? సంవత్సరాంతంలో మిగిలి పోయాయి కదా ? ‘మురిగి పోతాయేమో’ (వాడని లీవులు) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసును పై అధికారులు హర్షించరు!!
సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం) సమూలంగా మార్చి వేసింది.
ఉద్యోగినీ ఉద్యోగులు, పై స్థాయి మేనేజర్ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది. కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి.
సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో (ప్రభుత్వ మరియు ప్రైవేటు) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నాను. ‘‘మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి?’’అని.
ఒక గుడ్ న్యూసు ఏమిటంటే, చాలా చోట్ల, మన వాడు ఫోన్ చేసి, ‘నాకు జలుబు దగ్గు ఉంది సార్ / మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి?’ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణిలో అడగడం, పై వారేమో ‘ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో !’ అని ‘ఆరోగ్యం జాగ్రత్త’ అని ముక్తాయిస్తున్నారట! మన వాళ్ళు కొంత రిలీఫ్తో చెప్పారు.
మీరు ఒక కంపెనీని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయిలో పని చేసే సీనియర్ అధికారి (ణి) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు!
(1) కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖంతో
ఉంటారు. దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికంగా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి.
(2) వారు శెలవులో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి. ఏమైనా సహాయం కావాలా అడగండి. ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్గా వెళ్ళి పరామర్శించండి. డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం, ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా?
(3) ఎవరెవరు చనిపోతే జీతంతో కూడిన లీవు ఇవ్వాలి? ఈ కరోనా సమయంలో ఇది సంక్లిష్టమైన ప్రశ్న. కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి!
(4) మన మందరం ఎన్నో సంఘటనలు చూశాం, చదివాం. మన లొకాలిటీలో ఎవరో కరోనా బారిన పడి చనిపోతారు. వారి పిల్లలు పెళ్ళయి, ఇక్కడ లేక పోవచ్చు. ఈ దేశంలోనే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా, చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు. శవాన్ని ఐస్ బాక్సులో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలంలో ఎవరూ లేని అనాధలుగా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలంగా ఎన్నో చూశాం
కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక, అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తుగా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణంగా లీవు అడిగినా, ఈ విపత్కర సమయంలో కాదనకండి, కాస్త పెద్ద మనసు చేసుకుని, మంజూరు చేయండి. ఏమి జరుగుతోందో, కనిపెట్టి ఉండి, కనుక్కోండి.
(5) మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి (ని) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు, శ్మశానం నుంచి పత్రం, లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప, ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి.
(6) మీ సంస్థ, ఎవరైనా సైకాలజిస్టుతో వ్యాపార ఒప్పందం అయి ఉందా? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పనిలో లీనం కాలేకపోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి. కంపెనీ ఖర్చుతో. ఆ సమయంలో అది వారికి అవసరం కావచ్చు.
వీటిలో ఏవి వీలైతే అవి మీ సంస్థలో అమలు చేయండి. ఈ దేశం, ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్యలో ఉన్నప్పుడు, మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యంతో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం. ఆపత్కాలంలో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు. చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. పదిమందికి చెబుతారు.
C.V.Ramana, Hyderabad