*ఇ గవర్నెన్స్, డిజిటలైజేషన్లో ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటాం: ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు*
హైదరాబాద్/మంథని, జులై 25, పున్నమి ప్రతినిధి: ఇ – గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా దేశ రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
వీరిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ – గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు.
ఇందులో ఎస్తోనియా దేశ తోడ్పాటును కోరుతున్నామని, సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందనీ, డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందనీ మంత్రి తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన డ్రోన్లు శత్రు దేశానికి భారీ నష్టం కలిగించాయనీ, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామని, ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలనీ ప్రతినిధులను కోరారు. సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.


