షుగర్ జబ్బుకి పాదపూజకు సంబంధం ఏమిటి? భార్యకు భర్త పాదపూజ చేయడమేమిటి?
నేను చదవడం తప్పా అని అనిపిస్తుంది కదూ! తప్పేమీ లేదు మీరు చదివింది వాస్తవమే. పూజ అంటే కాళ్లు కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకుని దండం పెట్టు కోవడం కాదు. వాళ్ల కేమైనా దెబ్బలు తగిలాయా అని చూసుకోవడమే దీని అర్థం.
పది సంవత్సరాలు పైబడి షుగరు ఉన్నటువంటి వాళ్లలో చాలామందిలో అరికాళ్ళలో స్పర్శ తగ్గిపోతుంది. కాళ్ళకు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తెలియవు. కాళ్లలో ముల్లు గుచ్చుకున్నా, రాళ్లు వత్తుకున్నా ,చెప్పులు కరిచినా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ గాయాలే కాళ్ళు తీసి వేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు .అందుకే షుగర్ వుండి కాళ్లకు స్పర్శ తగ్గినటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్లకు ఇలాంటి దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుని ,నిర్ధారించుకుని ఉండడం మంచిది. గాయాలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవడం అవసరం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్లు వంగి వాళ్ళ కాళ్ళను చూసుకోవడం చాలామందిలో సాధ్యం కాదు అందుకే వారి జీవిత భాగస్వామి ఆ పని చేయడం మంచిది అలా రోజూ కాళ్లను రోగి బంధువులు కానీ జీవిత భాగస్వామి కానీ ఎవరో ఒకరు కాళ్ల పరిశీలన కార్యక్రమం చేయడం అవసరం. జీవిత భాగస్వామి తోనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి తప్పక భార్యకు భర్త ,భర్తకు భార్య రోజూ కాళ్ళను పరిశుభ్రం గా ఉంచే ప్రయత్నం చేస్తే మోకాలు కిందకి కాళ్లను తీసి వేసే పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు.
డాక్టర్ యం.వి.రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్)
డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి,
నెల్లూరు.


