విశాఖపట్నం మార్చి(పున్నమి ప్రతినిధి)
దేశంలో ప్రఖ్యాతి గాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం తీవ్ర గ్యాస్ కొరత సమస్యను ఎదుర్కొంటోంది. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ప్లాంట్ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో గృహ వినియోగం, ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పరిశ్రమల సరఫరా తగ్గించబడింది. సాధారణ పరిస్థితుల్లో ప్లాంట్ ఉత్పత్తి నిర్వహణకు రోజుకు సుమారు 12 టన్నుల ఎల్పీజీ అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేవలం ఐదు రోజులకే సరిపడే నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిల్వలు ముగిసిన తర్వాత కటింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి కీలక పనులు నిలిచిపోవడం అనివార్యం అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా స్టీల్ బ్లూమ్స్ను బయట ప్రైవేట్ యూనిట్లకు పంపించి ప్రాసెసింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రవాణా ఖర్చులు, ప్రాసెసింగ్ చార్జీలు పెరిగి ప్లాంట్పై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ప్లాంట్కు ఇది మరింత భారంగా మారింది. ఈ సంక్షోభం కొనసాగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్లాంట్ కార్యకలాపాలు మందగిస్తే ఉద్యోగుల ఉపాధిపై కూడా ప్రభావం పడే అవకాశముంది. దీనితో కార్మికులు, స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని గ్యాస్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పరిశ్రమలకు కనీస అవసరాల మేరకు గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధికి కీలకమైన ఈ ప్లాంట్ను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు.


