తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు నవచండీ యాగ మహోత్సవాలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ముళ్ల మల్లిబాబు ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆదివారం మహిళలు గోదావరి జలాలతో అమ్మవారికి పౌర్ణమి అభిషేకం నిర్వహించి అనంతరం మహాచండీ యాగాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం బ్యాండ్ బాజాలు, గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, వేషధారణలతో తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామ వీధుల గుండా అమ్మవారి భారీ ఊరేగింపు జరిగింది.
ఫిబ్రవరి 3న సోమవారం అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, బంధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.



