గూగుల్ డేటా సంస్థకు భూముల కేటాయింపు మరియు అదానీ అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సిపిఐ జిల్లా ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ — అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్గా విశాఖలో గూగుల్ సంస్థ అదానీతో కలసి ఏర్పాటు చేయబోతోందని, దీని కోసం సుమారు 480 ఎకరాల భూములు ఆనందపురం, సింహాచలం, రాంబిల్లి, అచ్చుతాపురం మండలాల్లో కేటాయించడం అన్యాయం అని అన్నారు.
అనందపురం మండలంలోని తర్లవాడ పంచాయతీ దళితుల అసైన్మెంట్ భూములను, అలాగే సింహాచలం అడవివరంలోని 160 ఎకరాలను సంస్థకు కేటాయించడం దుర్మార్గమని, గతంలో 2019లో చంద్రబాబు నాయుడు పాలనలో అదానీకి ఇచ్చిన భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఆ భూములను కొత్తగా గూగుల్ డేటా సెంటర్ కోసం వినియోగించాలనే డిమాండ్ చేశారు.
డేటా సెంటర్ వల్ల పర్యావరణ నష్టం, భూగర్భజలాల ఎండిపోవడం, విద్యుత్ కొరత వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు.
అలాగే పెదగంట్యాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై కూడా సిపిఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేశారని, గతంలో గంగవరం పోర్టు కారణంగా స్థానికులు ఉద్యోగాలు కోల్పోయి పర్యావరణ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టులను పునరాలోచించి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సిపిఐ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మధరావు, ఆర్.శ్రీనివాసరావు, ఎండి.బేగం, నెయ్యల నాగభూషణరావు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.


