గత ప్రభుత్వ రీ సర్వే అవకతవకలకు ఇక చెక్ పడిందని
కలిగిరి మండలం పరికోట గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు . ముఖ్య అతిథిగా హాజరై రైతులకు రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో రీ సర్వే పేరుతో అనేక అవకతవకలు చోటు చేసుకుని, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు. భూసర్వే ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది రైతులు తమ భూముల విషయంలో అయోమయానికి గురయ్యారని తెలిపారు.అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యలు వేగంగా చేపట్టినట్లు ఆయన చెప్పారు. రైతులకు పూర్తి పారదర్శకతతో, రాజముద్రతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతుల భూముల వివరాలు స్పష్టంగా నమోదు అవుతాయని, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవస్థ నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అన్నదాతల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నామని సురేష్ హామీ ఇచ్చారు.


