ఖమ్మం మార్చి
( పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల కూల్చివేత ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం కి చెందిన అయన హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
వెలుగుమట్లలో 62 ఎకరాలు 7 గుంటల భూదాన్ భూమిని 2014లో సుమారు 800 పేద కుటుంబాలకు కేటాయించారని, అప్పటి నుంచి వారు అక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కనీస వసతులు కల్పించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన రాలేదన్నారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ ఇళ్ల కూల్చివేత జరగడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారు 4 వేల పోలీసులతో, 200 బుల్డోజర్లతో తెల్లవారుజామున ఇళ్లను కూల్చివేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. భూదాన్ బోర్డు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్లు నకిలీ అని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, హైకోర్టు ఆరు సార్లు బాధితులకు అనుకూల ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
భూదాన్ ఉద్యమం వినోబా భవే పిలుపుతో ప్రారంభమైందని, 1954లో కల్వల రాజారావు దానం చేసిన భూమి ఇది తప్ప ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో సుమారు 1.80 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలోనే 28 వేల ఎకరాల భూదాన్ భూములపై పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లకు సంబంధించిన పూర్తి రికార్డులను బహిర్గతం చేయాలని, కూల్చివేసిన ఇళ్లను తిరిగి నిర్మించి పేదలకు గౌరవప్రద హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.



